కంచి కామకోటి తదుపరి పీఠాధిపతిగా గణేష్ శర్మ

కంచి కామకోటి తదుపరి పీఠాధిపతిగా గణేష్ శర్మ

కంచి కామకోటి పీఠం . . ప్రపంచంలోనే పురాతన పీఠంగా పేరొందింది. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన ఈ పీఠానికి పీఠాధిపతిగా అధిష్టించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అన్నవరం ప్రాంతానికి చెందిన ఓ యువ సన్యాసికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రవిడ్ (24) ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున అభిషేకం చేయబడ్డారు . ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చి సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించారు .

యాదృచ్చికంగా . .. : 2009 మేలో గణేశశర్మ తిరుపతిలో బంధువుల ఇంటికి వెళ్లారు. కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆశీర్వదించి రుగ్వేద పండితుడు, ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకరభట్‌ శర్మ వద్ద వేదవిద్యలో చేర్పించమని సలహా ఇచ్చారు. గణేశశర్మ అక్కడ చేరారు. 12 ఏళ్లు రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. ఆ తర్వాత మంత్ర ఉచ్ఛరణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకరభట్‌ కుమారుడు శ్రీనివాసశర్మ మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో ఉన్నత శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలోనూ సేవలు అందించారు. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.

జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి కాలక్రమంలో ఏర్పడిన కేంద్రపీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి!

మొక్కుబడులు, కృతజ్ఞతలు చెల్లించుకునే జంతు బలులు, రక్తతర్పణాల నుండి మానవ సమాజాలను సాత్విక, ఆధ్యాత్మిక దృక్పధాల్లోకి నడిపిన తాత్వికుడు, మత సంస్కర్త ఆది శంకరాచార్యులు. అస్పృశ్యత కూడదన్న ఆచరణవాది. 2500 ఏళ్ళ క్రితం భారతీయ సామాజిక, మతపరమైన స్ధితిగతులకు ఊహించగలిగితే శంకరాచార్య మత విప్లవవేత్త అని బోధపడుతుంది.

గుంపులు, సమూహాల పూజావిధానాన్ని వైదికమతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సఫల మయ్యారు. దేశ స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను షణ్మతానికి పరిమితం చేశారు.

షణ్మతాలు అంటే ఆరు ప్రధాన హైందవ సంప్రదాయాలు, ఇవి వివిధ దేవతల ఆరాధనను కేంద్రీకరించి ఉంటాయి. ఇవి:

1. శైవం – శివుడిని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

2. వైష్ణవం – విష్ణువు లేదా అతని అవతారాలను (రామ, కృష్ణ) ఆరాధించే సంప్రదాయం.

3. శాక్తం – దేవి (శక్తి)ని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

4. గాణపత్యం – గణపతిని (వినాయకుడు) ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

5. కౌమారం – కుమారస్వామి (కార్తికేయ)ని ఆరాధించే సంప్రదాయం.

6. సౌరం – సూర్య దేవుడిని ఆరాధించే సంప్రదాయం.

ఆది శంకరాచార్యులు ఈ ఆరు సంప్రదాయాలను సమన్వయం చేసి, హైందవ ధర్మంలో ఏకత్వాన్ని స్థాపించేందుకు కృషి చేశారు. ఈ షణ్మతాలు ఒక్కొక్కటి విభిన్న దేవతలను ఆరాధించినప్పటికీ, అన్నీ ఒకే బ్రహ్మతత్త్వాన్ని సూచిస్తాయని శంకరులు బోధించారు. ఇది అద్వైత వేదాంత సిద్ధాంతంతో సమన్వయం చేయబడింది.

ఈ విధంగా, షణ్మత స్థాపన హైందవ ధర్మంలో వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఏకత్వాన్ని ప్రోత్సహించింది.

అనేక సాంఘిక పరిణామాల నుంచి ప్రపంచమంతా వేర్వేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునర్జీవనం సంభవించిన కాలంలో ఆదిశంకరాచార్యులు (క్రీస్తుపూర్వం) అద్వైత తత్వాన్ని ప్రభోదించారు. ఆయన స్థాపించిన కాంచీపురం (కంచి) పీఠంనుంచి హిందూ దేశమంతటా అద్వైత తత్వం విస్తరించింది. ఆదిశంకరాచార్యులను “నడిచే శివుడు” అని హిందువులు విశ్వసిస్తారు.

కంచిపీఠం ఆధిపత్యం ఒక పరంపరగా సాగుతుంది. వేదాలను వైదిక శాస్త్రాలను అపపోసిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా సాగుతోంది.

ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి.

68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు.

వారిహయాంలో చాలా సంస్కరణలు జరిగాయి. హిందువుల్లో అద్వైతం బ్రాహ్మణులను దాటి బయటకు రావడంలేదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఆయన కంచి పీఠంలోకి అన్ని కులాలవారూ వచ్చేలా చేసి అద్వైతాన్ని సమాజంలో విస్తరింపచేశారు. జ్ఞాన సాధనే మోక్షమార్గమని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మానవ సమాజాల్లో హేతుబద్ధతను పెంపొందించారు.

చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన్ని సమాజంలో లోతుగా విస్తరింపచేశారు. అయితే జయేంద్ర సరస్వతి పీఠంలో ఒక అధికారి హత్యకేసులో అరెస్టవ్వడం పెద్ద సంచలనమైంది. హేతువాదాన్ని భుజానవేసుకున్న ఎఐడిఎంకే అధినేత్రి ఎన్నికలకు ముందు ఓట్లకోసం పీఠంలో జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని జయేంద్రసరస్వతిని కేసులో ఇరికించారని ప్రజలు నమ్మారు. స్వామి పై ఆరోపణలు రుజువు కాకపోవడం వల్ల జయేంద్ర సరస్వతి నిర్దోషిగా జైలునుంచి బయటపడ్డారు. అయినా శంకరుడి రూపమైన స్వామి హత్యకళంకాన్ని మోయక తప్పలేదు. వారితర్వాత 70 వస్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.

గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి. పూర్వీకులూ ప్రముఖ వేద పండితులే.

వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. శ్రీ కాంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.

ఈ ఉత్తరాధికార అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం విశిష్టతను సంతరిస్తోంది .

ఏపీలో బీజేపీ వ్యూహం ఇదేనా

ఏపీలో బీజేపీ వ్యూహం ఇదేనా

కార్యకర్తలకే బిజెపిలో పెద్దపీట – ఇది ఎపిలో వ్యూహం – నాలుగు దశాబ్దాల నిబద్దత కలిగిన కార్యకర్తకు రాజ్యసభ

పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, అత్యంత విధేయతతో సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. రాజకీయంగా ఉనికి కోసం యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .

నమ్మకంతో కట్టుబడి పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఊహించలేనంత పెద్ద అవకాశాలు ఇవ్వగలమన్న సంకేతాలను బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కాలంలోనే కల్పించింది .

పక్కజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కు తెలియని బి. శ్రీనివాసవర్మకు నరసాపురం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చారు. జగన్ వ్యతిరేకప్రభంజనంలో వర్మగెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు.

రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు విజయసాయిరెడ్డి స్ధానంలో పి వెంకట

సత్యనారాయణను ఎంపిక చేసినట్టు బిజెపి ప్రకటించింది. కూటమి బలం కారణంగా ఆయన ఎన్నిక ఎన్నిక కేవలం లాంఛనమే!

శ్రీనివాస్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా స్థాయి లో పార్టీపరంగా అనేక బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ గా వున్నారు. ఇద్దరిదీ భీమవరమే! ఇద్దరూ స్వయం సేవకులే! ఇద్దరూ పటాటోపాలకు దూరంగా వుండే కార్యకర్తలుగా గుర్తింపు పొందినవారే కావడం గమనార్హం. బిజెపి బలంలేని ఆంధ్రప్రదేశ్ లో పెద్దపెద్ద పదవులు వున్నవారి ప్రభావం కూడా సహజంగా తక్కువగానే వుంటుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చిన్నగా విస్తరిస్తోంది. బిజెపికి పార్లమెంటులో ఆధిక్యత వున్నపుడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు మొదలైన అనేక అంశాల్లో దగా చేసినందుకు ప్రజలు ఆపార్టీ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీలేక తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో (రాష్ట్రంలో కూడా) కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక “పట్టి విడిచినట్టు” రాష్ట్రం కోర్కెలను కేంద్రం చిన్నగా తీరుస్తోంది. ఇందువల్ల ప్రజల ఆగ్రహం తగ్గింది. ఒకప్పుడు పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేని ఎపిలో బిజెపి సభ్యత్వాల సఖ్యపెరుగుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1 లక్షా 50 వేలమంది కంటే ఎక్కువ మందే బిజెపిలో సభ్యులుగా వున్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి ఏ నియోజక వర్గంలోనైనా పాతిక ముప్పై మంది క్రియాశీలక సభ్యులే పార్టీకి వున్నారు.

కొద్దినెలల క్రితం బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు వున్న కాలంలోనే వీర్రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వ్యతిరేకంగా విమర్శలు చేసి రెండుపార్టీల మద్య వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అలాంటి వీర్రాజు మళ్ళీ ఎమ్మెల్సీ కావడం అనూహ్యమే! టీడీపీని కాదని వీర్రాజు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్సే కొట్టగలిగారు . అదీ బీజేపీలో జరిగే రాజకీయం . చంద్రబాబు విధిలేక ఒప్పుకోవడం లేదా హుందాగా అంగీకరించడంలో బిజెపి మేనేజిమెంటు చాతుర్యం కూడా వుంది.

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిలో పార్టీ బలం పెంచుకోడానికి సొంత ఎత్తుగడలు వున్నాయి. తెలుగుదేశంపార్టీ తన ఎమ్మెల్యేలు లేనిచోట ఇంచార్జ్ లను నియమించి వారి ద్వారా రోజువారీ పాలనలో కూడా జోక్యం చేసుకుంటోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ నాయకత్వం తప్ప సంస్ధాగత నిర్మాణం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికార కేంద్రాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం ఇన్ చార్జ్ వ్యవస్థకు జనసేన అధికార కేంద్రాలకు మధ్య స్పర్ధలు వున్నాయి. అవి రోడ్డున పడే పరిస్ధితి ఇప్పట్లో వుండకపోవచ్చు .

పార్టీకి కట్టుబడిన వారికే పదవులు అనే బిజెపి ఎత్తుగడ, లాయలిస్టుల్లో నిరాసక్తత ను తొలగించి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అది ఆ పార్టీ విధానం… దానిని తప్పుపట్టడం పెద్దతప్పే అవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. “ఎంతపని చేసినా ఇంతే! లాయల్టీకి గుర్తింపు గౌరవం లేవు. బాబు మారడు. అధికారంలో లేనపుడు కార్యకర్తలే ప్రాణ సమానం అంటాడు. అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతాడు……” ఇలాంటి కామెంట్లు తెలుగుదేశంలో తరచూ వినిపిస్తుంటాయి.

ఏరాజకీయ పార్టీ అయినా బలంపెంచుకోవలసిందే! అయితే ప్రజల్లోకి వెళ్ళడానికంటే కంటే కేంద్రం లో వున్న అధికారాన్ని ఇందుకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్న! బిజెపికి ఇలాంటి నైతికమీమాంసలేమీ వుండవు అని రకరకాల పరిణామాల ద్వారా దేశప్రజలందరికీ తెలుసు!

బీజేపీ మింగేస్తుంది

బిజెపికి అవకాశం వచ్చినపుడు, ఇతరపార్టీలు ఆదమరచి వున్నపుడు బిజెపి ఆన్ని విధాలా ఆక్రమించేస్తుందని జనసేన కు తెలుస్తుందోలేదో కానీ , , తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మర్మం ఖచ్చితంగా తెలుసు. అయినా కొన్ని పదవులు , కొన్ని పనులు వ్యవహారంలో వైసీపీకి సపోర్టుగా ఉండే బీజేపీ నేతలకు సైతం పెద్ద పీట వేయాల్సి రావడం టీడీపీ కి గత్యంతరంలేని పరిస్థితిగా కనిపిస్తోంది . అమరావతి , పోలవరం వంటి వాటిని నెరవేర్చాలంటే బీజేపీ పెద్దల అండదండలు కావాల్సిందే . అందుకోసం కొన్నింటిలో కాంప్రమైజ్ కాక తప్పడంలేదు .

రంగరాయ ప్రిన్సిపల్ గా డాక్టర్ విష్ణువర్ధన్

రంగరాయ ప్రిన్సిపల్ గా డాక్టర్ విష్ణువర్ధన్

తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .

మద్యం కుంభకోణంలో ‘మర్డర్ ‘  కేసులు

మద్యం కుంభకోణంలో ‘మర్డర్ ‘ కేసులు

2019లో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ లో వందలమంది మందుబాబులు బలయ్యారు . వేలమంది అనారోగ్యంపాలై , రోగాలతో కునారిల్లడానికి నాసిరకం , కల్తీ మద్యం కారణమని చెప్పవచ్చు .

అప్పట్లో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ ‘సిట్ ‘ వేసింది . ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది వరకు అరెస్టయ్యారు . కీలక సూత్రధారులైన రాజ్ కసిరెడ్డి , సజ్జల రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు . మరికొందరు అరెస్టవ్వడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతవరకు ఓకె . అయితే ఈ కేసును కేవలం ఆర్ధిక దోపిడీ వరకు చూసి వదిలేయడానికి లేదు . జగన్ సర్కార్ చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరి తరపున మద్యం కుంభకోణంలో సూత్రదారులు , పాత్రదారులపై హత్య నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది .

సీఎంగా అధికార పీఠం ఎక్కిన వెంటనే  జగన్మోహన్‌రెడ్డి  మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి తనకు, తన వారికి  పాడి ఆవుగా చేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న  పాపులర్‌ బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారు.   ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి ప్రభుత్వం తరపున  కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో రోగాలు పాలయ్యారు.   కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి.

 ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో జగన్‌ అండ్‌ కో ఆరితేరారు . అంతకు ముందు 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో మాత్రం బాగానే దండుకున్నారు . దీనిని గమనించిన జగన్ ఇసుక అక్రమాలలో మరో అడుగు ముందుకేసి వేల కోట్ల సమకూర్చుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయి . ఇసుక వంటి వాటిలో దోపిడీని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోరు . అవసరమైన వాళ్ళు మాత్రం డబ్బు ఎక్కువ పెట్టాల్సిన వస్తుందని ఆ కాసేపు తిట్టుకుని వదిలేస్తారు . మద్యం విషయం అలా కాదు . . నాసిరకం మద్యం సరఫరా ద్వారా బోలెడంత డబ్బుతో పాటు . . అంతకు అనేకరెట్లు పాపం కూడా మూటకట్టుకున్న జగన్ అండ్ కో మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే . చంద్రబాబు సర్కార్ వదిలిపెట్టిన పైవాడు మాత్రం వదిలిపెడతాడా ? అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయ్ .

లిక్కర్‌ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం… ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించిన అధికారులు , అత్యున్నత పదవులు నిర్వహించిన వారు నాసిరకం మద్యంతో మరణించిన , అనారోగ్యంపాలైన కుటుంబాల ఆర్తనాదాలు తగలకుండా ఉంటాయా ? కర్మ ఫలం అనుభవించక తప్పదని మరువకండి .

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

జమ్మూ కాశ్మీర్ సమీపంలో  పహల్గాంలో జరిగిన మారణహోమం   తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది.  పాకిస్థాన్‌ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా   ఉన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్‌ పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.

చర్చల ద్వారానే పరిష్కారం!
ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.

 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .