భూతలదాడులకు దిగితే అమెరికా సైనికులు సొరచేపలకు ఆహారం అవుతారు: ఇరాన్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్ – అమెరికా యుద్ధం ఎటుదారితీస్తుందోనన్న ఆందోళన ఎక్కువవుతోంది . ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఇరాన్ సైన్యం చేసిన క్షిపణిదాడిలో సౌదీఅరేబియాలోని ప్రిన్స్సుల్తాన్ ఎయిర్బేస్లో ఉన్న అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసమైంది. బోయింగ్-707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్ సెంటర్లా రూపొందించిన ఈ3-సెంట్రీ అవాక్స్ చాలా శక్తిమంతమైంది. 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ విమానం అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.
పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా, భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకోవటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్ చేస్తుండగా, మరోవైపు టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాల్లో ఐడీఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్ గల్ఫ్ సొర చేపలకు ఆహారం అవుతారని ఇరాన్ హెచ్చరించిడాం చర్చకు దారితీసింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు ఇంతవరకు ససేమిరా అన్న ఇరాన్, కాస్త బెట్టువీడినట్లు తెలుస్తోంది. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్లో ఆదివారం మధ్యవర్తిత్వ ప్రక్రియపై జరిగే ప్రతిపాదిత చర్చలు యుద్ధ విరమణ లేదా తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తక్షణమే దాడులు ఆపాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని విశ్వసనీయమైన గ్యారంటీ ఇవ్వాలనే షరతులు పెట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చలకు ఇరాన్ 5 షరతులు పెట్టినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.
ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్దేశాలు ప్రకటించాయి. గల్ఫ్ దేశాలకు డ్రోన్లతో రక్షణ కల్పించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్నిరోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది.
హర్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై మోదీ, ట్రంప్ మధ్య చర్చ
మోదీకి ట్రంప్ ఫోన్ చేసినట్లు చెప్పిన అమెరికా రాయబారి సెర్గియా గోర్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో . .. కీలక పరిణామం చోటుచేసుకుంది . భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసారు . ఈ సందర్బంగా ట్రంప్ మోదీ మధ్య కీలక చర్చ నడిచింది . ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం గురించి చర్చించినట్లు సమాచారం . ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అమెరికా – ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య చోటుచేసుకున్న యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ… మోడీ – ట్రంప్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది .
ఇరాన్పై దాడులను ముగించే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు . ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను ఇటీవలే అమెరికా తాత్కాలికంగా తొలగించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ కామెంట్స్ చేశారు. అమెరికా తన లక్ష్యాలకు చేరవ అయ్యిందని ట్రంప్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో మిలిటరీ చర్యలకు ముగింపు పలికే యోచనలో ఉన్నామని అన్నారు.
శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్ కూడా ఈ విషయమై కీలక ప్రకటన విడుదల చేశారు. నాలుగు నుంచి ఆరు వారాల్లో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్టు పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పోస్టు అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికా సాయుధ దళాలు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పాలకులు బలహీనమవుతున్నారు. అమెరికాపై వారు ఇక బెదిరింపులకు దిగలేరు.
ఇటీవలే అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు తొలగించింది. మార్చ్ 20కి ముందే రవాణా నౌకల్లోకి చేర్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని యూఎస్ ట్రెజరీ పేర్కొంది. ఈ చర్యలతో 140 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 112.19 డాలర్లకు చేరింది . ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే క్రుడ్ ఆయిల్ మరింత పెరిగే ప్రమాదం ఉంది .
”భారీ మెజార్టీ . .. అంటే ఓడిపోయిన అభ్యర్థి కంటే భారీగా ఓట్లు రావడం . . ఇక్కడ జరిగిన ఎన్నికలలో భారీ కాదు . . అతి భారీ కూడా అనలేం . .. ఏమనాలి ? ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఆయన సారథ్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు మార్చి 15న జరిగిన ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఏకంగా 99.93 శాతం ఓట్లను సాధించాయి. దేశంలోని కేవలం 0.07 శాతం మంది ప్రజలే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఓటర్లకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తున్నామనే ప్రచారం చేసుకునేందుకే ఈ అవకాశాన్ని ఓటర్లకు కిమ్ జోంగ్ ఉన్ ఇస్తున్నారని అంటున్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అత్యధికంగా 99.99 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పార్టీలకు చెందిన 687 మంది ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తర కొరియా 15వ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల సమాచారంతో ఈమేరకు ఆ దేశ మీడియాలో కథనాలు పబ్లిష్ అయ్యాయి . . ఈనేపథ్యంలో తదుపరిగా నూతన సభ్యులతో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశమై, కిమ్ను మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై ప్రకటన చేయనుంది. రాజ్యాంగంలో చేయాల్సిన కీలక సవరణలపై ఈ సభ చర్చించనుంది.
మళ్లీ దేశ అధ్యక్షుడిగా కిమ్ కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ లాంఛనంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సిన ఇది . ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలో చేసిన తీర్మానాల ప్రకారం, రాజ్యాంగ సవరణలకు కసరత్తును మొదలుపెట్టనుంది. అధికారికంగా దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని కిమ్ జోంగ్ ఉన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాజ్యాంగంలో సవరణలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక పత్రంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు శత్రుదేశాలనే అంశం ఉందనే విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలోనూ దీనిపై ప్రత్యేక తీర్మానాలు చేశారు. పార్టీ ఛార్టర్లో మార్పులు,చేర్పులు చేశారు.
దక్షిణ కొరియాపై కిమ్ ప్రకటన దక్షిణ కొరియా తమకు శత్రుదేశమని 2024లోనే అధికారికంగా కిమ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు రాజ్యాంగబద్ధత, చట్టపరమైన ఆమోదాన్ని కల్పించే దిశగా ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ జోంగ్ ఉన్ చేసే అధికారిక ప్రకటన కోసం దక్షిణ కొరియా సహా ఇతర ఇరుగుపొరుగు దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉత్తర కొరియా అంతర్జాతీయ సంబంధాలు, శత్రుదేశాలు, మిత్రదేశాలపై ఆయన చేయనున్న ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
రబ్బరు స్టాంపు ఉత్తర కొరియా అసెంబ్లీ కిమ్ జోంగ్ ఉన్ కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని రబ్బరు స్టాంపు లాంటిదని చెబుతుంటారు. వాస్తవానికి దేశంతో ముడిపడిన అన్ని చట్టాలను రూపొందించే, ఆమోదించే అధికారాలు ఈ సభకు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ కిమ్ ఆధ్వర్యంలో నడిచే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సిద్ధాంతాల ప్రకారమే జరుగుతుంటాయి.
ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది కొత్తవాళ్లే ఉత్తర కొరియా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, దాదాపు 70 శాతం మంది పాత ప్రజాప్రతినిధుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. కిమ్ జోంగ్ ఉన్ అధికార పీఠానికి మరింత బలాన్ని చేకూర్చేందుకే, బలమైన ప్రజాప్రతినిధులు తయారుకాకుండా అడ్డుకునేందుకే ఇంతగా మార్పులు చేశారని పరిశీలకులు అంటున్నారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికైన 687 మందిలో జో యోంగ్ వన్, కిమ్కు అత్యంత సన్నిహితుడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఈయనకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించిన చోయీ ర్యోంగ్ హయీకి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఇవ్వలేదని సమాచారం. కొత్త ఎంపీల జాబితాలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి చోయీ సన్ హుయీ కూడా ఉన్నారు. .
హోర్ముజ్ జలసంధి వద్దకు యుద్ధనౌకలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, డెన్మార్క్ , ఫ్రాన్స్ నో
ఆ బాటలోనే ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు
ముందు యుద్ధం ఆపండి: చైనా హితవు
నేను కోరిన సాయం చేయకపోతే నాటో దేశాల భవిష్యత్తు చెడ్డగా ఉంటుంది: ట్రంప్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
దుబాయి ఎయిర్పోర్టు వద్ద ట్యాంకర్ ధ్వంసం
‘‘హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం వల్ల ఇబ్బందిపడే దేశాలన్నీ.. నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా ఈ పని చేద్దాం’’ అంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు అమెరికా మిత్రదేశాలే నిష్కర్షగా ‘నో’ చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే.. తదితర దేశాలు హోర్ముజ్ జలసంధి వద్దకు తమ తమ యుద్ధనౌకలను పంపుతాయని ఆయన ఆశించగా.. వాటిలో ఒక్క దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగతా దేశాలేవీ సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని జపాన్ ప్రధాని టకైచీ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా తెలుపగా.. ఆస్ట్రేలియా కూడా అదే మాట చెప్పింది. యుద్ధనౌకలను హోర్ముజ్ జలసంధికి పంపడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని స్టార్మర్ ట్రంప్ అభ్యర్థనను తోసిపుచ్చారు. విస్తృత యుద్ధంలో అడుగుపెట్టాలని బ్రిటన్ అనుకోవట్లేదన్న ఆయన.. తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్ను అనుసరించదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నానని.. కానీ, అది నాటో మిషన్ కాదని స్టార్మర్ స్పష్టం చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ వేడ్ఫుల్ కూడా ట్రంప్ పిలుపునకు ప్రతికూలంగా స్పందించారు. సముద్ర మార్గాలను కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడూ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని.. కానీ, హోర్ముజ్ వద్దకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళాల్సిన అవసరం తనకు కనపడట్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా యుద్ధనౌకలు చేయలేని పనిని యూరప్ దేశాలకు చెందిన యుద్ధనౌకలు చేస్తాయని ట్రంప్ ఎలా అనుకుంటున్నారని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ప్రశ్నించారు. ఇది అసలు తమ యుద్ధం కాదని.. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఇక, ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్.. హోర్ముజ్కు తామేమీ యుద్ధనౌకలను పంపబోమని కిందటివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటో సభ్యదేశాలైన స్పెయిన్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోమని సంకేతాలిచ్చాయి. దీనిపై నాటో ప్రతినిధులు స్పందించారు. కూటమిలోని సభ్యదేశంపై బయటి దేశాలేవైనా దాడి చేస్తే.. అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడుతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే.. మిగతా సభ్యదేశాలు కూడా ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఏప్పుడో చెప్పా..
యూకే, జపాన్, ఆస్ట్రేలియా తమ నిర్ణయాలను ప్రకటించకముందే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలు సహాయం చేయడంలో విఫలమైతే.. నాటో కూటమి భవిష్యత్తు చాలా చెడ్డగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు! ‘‘నాటో అని మనకి ఒక కూటమి ఉంది. దాని విషయంలో మేం చాలా మంచిగా ప్రవర్తించాం. ఉక్రెయిన్కు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా.. మేం వారికి సాయం చేశాం. ఇప్పుడు వారు (నాటో దేశాలు) మాకు సాయం చేస్తారో లేదో చూస్తాం. మేం వారి కోసం నిలబడతాంగానీ, వారు మాకోసం నిలబడరని నేనెప్పుడో చెప్పాను. ఈసారి కూడా వారు మా కోసం వస్తారని నేను అనుకోవట్లేదు. నాటో దేశాలు అసలు స్పందించకపోయినా.. ప్రతికూలంగా స్పందించినా అది కూటమి భవిష్యత్తుకు చెడు చేస్తుంది’’ అని పేర్కొన్నారు. అలాగే.. హోర్ముజ్ జలసంధిపై తాను ఏడు దేశాల సాయం కోసం కోరగా.. అందులో కొన్ని అంగీకరించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే, అంగీకారం తెలిపిన దేశాలేవో ఆయన వెల్లడించలేదు. కాగా, హోర్ముజ్లో నౌకల సురక్షిత రాకపోకల విషయంలో మిత్రదేశాలన్నీ అమెరికాకు హ్యాండివ్వగా.. చైనా అత్యంత జాగ్రత్తగా స్పందించింది. ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా ఉండాలంటే ఇరుపక్షాలూ సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని సూచించింది.
జలసంధిని తెరవలేకపోతే..
హోర్ముజ్ను ఇరాన్ మరికొంతకాలం ఇలాగే మూసి ఉంచితే.. ట్రంప్ ఖార్గ్ ద్వీపం స్వాధీనం దిశగా అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచా రం. అయితే, ఖార్గ్ స్వాధీనానికి కేవలం వైమానిక దాడులు చాలవని.. అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఆ పని చేస్తే.. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వారు పేర్కొంటున్నారు.
”ఖర్గ్ ద్వీపం” ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరో ప్రాణం అంటారు . ..ఎందుకు ?
ఇరాన్ ముడి చమురు బిజినెస్ లో అత్యంత కీలకమైనది . .. ఖర్గ్ ద్వీపం. ఆ దేశ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటాయి. అటువంటి కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఖర్గ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, తమ నెక్ట్స్ టార్గెట్లో అక్కడి చమురు మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖర్గ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఐలాండ్ ఇరాన్లో ఎక్కడుంది ? ఇది ఇరాన్కు అంతగా ముఖ్యమైందా ? దీన్ని అమెరికా ఎందుకు లక్ష్యంగా చేసుకుంది ? అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది ? ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ . ..?
ఖర్గ్ ద్వీపం ఎక్కడుంది ? ఖర్గ్ ద్వీపం ఇరాన్ నైరుతి సముద్ర తీరానికి 26 కి.మీ దూరంలో ఉంది. కీలకమైన హర్మూజ్ జలసంధికి వాయవ్య దిశలో దాదాపు 483 కి.మీ దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఇరాన్ ఓడరేవు నగరం బుషెహర్కు వాయవ్య దిశలో 55 కి.మీ దూరంలో ఖర్గ్ ఉంది. ఈ ద్వీపం చుట్టూ సహజసిద్ధంగానే చాలా లోతు వరకు సముద్రజలాలు ఉన్నాయి. దీంతో భారీ సైజు ముడి చమురు ట్యాంకర్లను పార్కింగ్ చేసేందుకు ఈ ద్వీపంలోని తీర ప్రాంతం అనువైంది. ఆయిల్ ట్యాంకర్లు, నౌకల పార్కింగ్ కోసం ఖర్గ్ ద్వీపం చుట్టూ పెద్దసంఖ్యలో టెర్మినళ్లను ఇరాన్ నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఇరాన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పహారాలో ఖర్గ్ ఉంది. ఎందుకంటే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటుంది. ఈవిధంగా దేశ ముడి చమురు వాణిజ్యంపైనా ఐఆర్జీసీకి బలమైన పట్టు ఏర్పడింది.
ఖర్గ్ ఇరాన్కు అత్యంత ముఖ్యమైంది? ఎందుకంటే . . అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సేకరించిన 1984 నాటి డీక్లాసిఫైడ్ నోట్ ప్రకారం, ఖర్గ్ ద్వీపం ఇరాన్ పెట్రోలియం వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం టైంలో, 2003లో జరిగిన అమెరికా – ఇరాక్ యుద్ధం వేళ ఖర్గ్ ద్వీపం ప్రధాన టార్గెట్గా మారింది. ఆనాడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇరాక్ వందలాది సార్లు ఖర్గ్ ద్వీపంపై బాంబు దాడులు చేసింది. ఈ ద్వీపంలోని టెర్మినళ్లకు భారీ చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఇరాన్లోని అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ చమురు, సహజ వాయువు క్షేత్రాల నుంచి ఖర్గ్ వరకు పైప్లైన్లు విస్తరించి ఉన్నాయి. ఈ పైప్లైన్ల వ్యవస్థ సముద్ర జలాల అడుగున ఉంది. దీని ద్వారా ఖర్గ్కు చేరుకునే చమురు, సహజ వాయువును భారీ నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తూ ఉంటారు .
ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్కు ఇక్కట్ల ఖర్గ్ ద్వీపం ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ ఖర్గ్లో ముడి చమురు వాణిజ్యం ఆగిపోతే ఇరాన్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా సైనికశక్తి కూడా బలహీనపడుతుంది. అమెరికా కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ ఖర్గ్పై అమెరికా దాడులు తీవ్రతరమైతే, ఇరాన్ కూడా బలంగా ప్రతిఘటించే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
హర్మూజ్తో ఇరాన్- ఖర్గ్తో అమెరికా ఒత్తిడి
ఖర్గ్ ద్వీపంలో చమురు వాణిజ్యం స్తంభిస్తే ఇరాన్ ఆర్థికంగా బలహీనపడటం ఖాయం. ఎందుకంటే ఇరాన్ చమురు వాణిజ్యంలో 90 శాతం ఆ ఒక్క ద్వీపం నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఖర్గ్పై అమెరికా ఫోకస్ పెట్టింది. తద్వారా హర్మూజ్ విషయంలో ఇరాన్ వైఖరిని మార్చాలని భావిస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచేందుకు ఇరాన్ యత్నిస్తోంది. దీనికి ప్రతిగా ఖర్గ్పై దాడులతో, ఇరాన్పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని జేపీ మోర్గాన్ కంపెనీకి చెందిన గ్లోబల్ కమోడిటీ రీసెర్చ్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ చమురు శాఖకు చెందిన మూడు ప్రధాన ఇంధన సౌకర్యాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు ఫలాత్ ఇరాన్ ఆయిల్ కంపెనీ. ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్లో చమురును ఉత్పత్తి చేసే నాలుగు శుద్ధి కర్మాగారాలలో ఇదే అతిపెద్దది. ఈ ద్వీపంలోనే ఖర్గ్ పెట్రోకెమికల్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ యూనిట్లలోనే చమురు, ద్రవీకృత సహజ వాయువును నిల్వ చేస్తారు, ఎగుమతి చేస్తారు. ఇరాన్ ప్రభుత్వం ఖర్గ్లోని చమురు టెర్మినల్ నిల్వ సామర్థ్యాన్ని 2 మిలియన్ బ్యారెళ్లకు విస్తరించిందని 2025లో నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ప్రతీ చమురు ట్యాంక్కు ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే కెపాసిటీ ఉంది.
ఇరాన్ ప్రతిదాడి ఎలా? హర్మూజ్ మీదుగా ఇతర దేశాల ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. కానీ ఖర్గ్ ద్వీపం నుంచి చమురు సప్లైలను ఇరాన్ ఇంకా కొనసాగిస్తోందని తెలుస్తోంది. తాజాగా TankerTrackers.com చేసిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం, మార్చి 11న (బుధవారం) ఖర్గ్ ద్వీపంలో అనేక పెద్ద ముడి చమురు ట్యాంకర్లు లోడ్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి బుధవారం వరకు ఇరాన్ రోజుకు సగటున 1.1 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఖర్గ్పై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఖర్గ్ను అమెరికా లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ ఘాటుగా బదులిచ్చే ఛాన్స్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.