by Rama Chandra P | Jul 21, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆధారాలు లభ్యమైనా.. ‘సిట్ ‘ నత్తనడకన వెళుతుందెందుకు ?
” అధికారంలోకి వచ్చాకా .. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం ‘ ‘ అని ‘2019 ఎన్నికలకు ముందు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన ముఖ్యమైన వాగ్దానం . అయితే, ఐదేళ్ల పాలన ముగిసేసరికి, ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరాల ప్రకారం, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన, సుమారు ₹3,200 కోట్ల ఆర్గనైజ్డ్ దోపిడీ. దర్యాప్తు పూర్తయ్యే సరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం వుంది. నిషేధం అనే సామాజిక లక్ష్యం, ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ స్కామ్ మూడు మూడు ప్రధాన దశల్లో జరిగింది.
1. ప్రభుత్వ గుత్తాధిపత్యం: అధికారంలోకి రాగానే, ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి, మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కిందకు తెచ్చారు. అమ్మకాలను నియంత్రించి, అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా, అసలు ఉద్దేశ్యం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే!
2. “జె-బ్రాండ్” వ్యూహం: ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక, దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు. వాటి స్థానంలో, ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అధికార పార్టీ నేతలతో సంబంధం వున్న వారి డిస్టిలరీల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో (“జె-బ్రాండ్లు”) మార్కెట్ను ముంచెత్తాయి. ఫలితంగా, ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా 53% నుంచి 5.3%కి పడిపోయింది. వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయాలు లేక, “జె-బ్రాండ్ల” నే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు.
3. పారదర్శకతకు పాతర: స్కామ్ కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు. గతంలో ఉన్న పారదర్శకమైన, ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థ “సి-టెల్”ను రద్దు చేశారు. దాని స్థానంలో, అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ “ఆఫర్ ఫర్ సేల్” (OFS) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా, తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ, ఇతరులను పక్కనపెట్టారు. ఇదే కిక్బ్యాక్ల పథకానికి పునాది వేసింది.
ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి, దానిని చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు.
* కిక్బ్యాక్లు: తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు, దాని రకాన్ని బట్టి ₹150 నుంచి ₹600 వరకు లంచం/కిక్బ్యాక్గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది. ఈ లెక్కన, ఐదేళ్లలో సుమారు ₹3,200 కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు. లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు.
* నగదు లావాదేవీలు: ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, డిజిటల్ చెల్లింపులను నిషేధించి, కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు. ఐదేళ్లలో జరిగిన ₹99,413 కోట్ల అమ్మకాల్లో 99.38% నగదు రూపంలోనే జరిగాయి. ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది.
* మనీ లాండరింగ్: ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్కు తరలించడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, “ఈడీ ఎంటర్టైన్మెంట్స్” అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లధనంగా మార్చారని సిట్ కనిపెట్టింది.
* లిక్కర్ బాండ్లు: వీటన్నిటికీ మించి, భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, APSBCL ద్వారా అధిక వడ్డీకి (9.62% వరకు) వేల కోట్ల రూపాయల రుణాలు (బాండ్లు) సేకరించారు. ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది.
ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం “జె-బ్రాండ్ల”లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి అనేక మరణాలు, అనారోగ్యాలు ఉదాహరణలుగా వున్నాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం, 2019-24 మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ, మూత్రపిండాల వ్యాధుల కేసులు 100% పెరిగాయి.
ప్రస్తుతం ఈ కేసుపై సిట్ దర్యాప్తు చేస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డిని “ప్రధాన సూత్రధారి”గా పేర్కొంటూ, మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్టు చేసింది. అయితే, ఇది రాజకీయ కక్ష సాధింపేనని, తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని వైఎస్సార్సీపీ వాదిస్తోంది.
మొత్తం మీద, మద్యపాన నిషేధం అనే ప్రజా సంక్షేమ హామీ, ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారితీసిందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ప్రభుత్వ గుత్తాధిపత్యం, అపారదర్శక విధానాలు, రాజకీయ-అధికార-కార్పొరేట్ కూటమి కలిసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడి, వేలమంది మద్యం అలవాటున్న వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం . . వందలమంది చనిపోవడం జరిగాయి . వారి కుటుంబాలకు నష్టం చేసారు . ఈ కుంభకోణంలో దోచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు.
by Ram Maddipati | Jul 14, 2025 | ఆంధ్రప్రదేశ్
బిట్స్ ఏఐ + క్యా0పస్ పై కుమారమంగళం బిర్లా ప్రకటన
అమరావతిలో మరో ప్రతిష్ట విద్యా సంస్థ క్యా0పస్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే మొదటి ఏఐ యూనివర్సిటీ
అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 7000 మంది విద్యార్థులకు స్టడీకి అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని… వచ్చే 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు .
ఇండియాలో ఫస్ట్ ఏఐ క్యాంపస్: ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది .. దేశంలో ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదు . . . దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
70 ఎకరాలలో బిట్స్
బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.
భూ సమీకరణ-2 .. వ్యవహారంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో… ఆ అంశంపై పెద్దగా చర్చ లేకుండా ఉండేందుకు బిట్స్ అమరావతిలో ఏర్పాటు అంశం వెంటనే తెరపైకి వచ్చినట్లు కూడా పలువురు ప్రచారం మొదలుపెట్టారు .
by Rama Chandra P | Jul 9, 2025 | ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం యాత్రలో బెంబేలెత్తిన జనం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మామిడి రైతులను పరామర్శించే బంగారుపాళ్యం యాత్ర జనసమీకరణ డ్రామా గా మారింది . ఈ యాత్రకు 10 వేలమందిని అనుమతించాలని ఆయన పార్టీ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. మండలాల వారీగా ఎంతెంత మంది ఎన్నెన్ని వాహనాల్లో రావాలో స్థానిక వైసీపీ నేతలకు కోటాలు కూడా విధించారు. 500 మందికి మించి అనుమతించలేమని పోలీసులు సమాధానమిచ్చారు . జగన్ పార్టీవారికి లా అండ్ ఆర్డర్ తో పనిలేదు. ఈ సారికూడా పోలీసు ఆదేశాలను ధిక్కరించేసారు . ఇష్టానుసారం పేట్రేగిపోయారు .
జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పహారా కాస్తున్న పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ మూకల వీరంగం..
అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్ యార్డ్లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జగన్ కి జనసమీకరణ అవసరం :
151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన పార్టీకి, జన సమీకరణ ఒక రాజకీయ అవసరంగా మారింది. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందనే ముద్రను చెరిపేయడం, 2) కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం, 3) అధికార పక్షానికి తమ బలాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించడం.
ఈ వ్యూహం నిస్సందేహంగా నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా ఉంచుతుంది.
* కోర్ ఓటర్ బేస్, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది.
* నాయకుడి ఉనికిని, ప్రాముఖ్యతను మీడియాలో, ప్రజలలో నిరంతరం నిలుపుతుంది.
* కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా అధికార పక్షాన్ని నిరంతరం రక్షణాత్మక స్థితిలో ఉంచుతుంది…. అని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీ కేడర్ పైనా , నేతలపైనా జనంలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు .
వైసీపీ హంగామా వల్ల నష్టాలు:
* ప్రజా విసుగు (Public Fatigue): నిరంతరం పునరావృతమయ్యే రాజకీయ నాటకంగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ డ్రామా
తటస్థ ఓటర్లను జగన్ పార్టీకి దూరం చేస్తుంది. కిడ్నాప్, హింస, ఎన్నికల అక్రమాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీలకు నాయకులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, నేర ప్రవర్తనను సమర్థించడంగా భావిస్తున్నారు.
పదే పదే జన ప్రదర్శనల వల్ల ప్రభుత్వంపై విధానపరమైన, వాస్తవ సమస్యల ఆధారంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని జగన్ పార్టీ పోగొట్టుకుంది. .
ఇది పునరుజ్జీవనానికి స్థిరమైన మార్గమా?
జన సమీకరణ అనేది పార్టీ మనుగడకు అవసరమైన స్వల్పకాలిక సాధనం అయినప్పటికీ, అది పార్టీ పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. రాజకీయ పునరుజ్జీవనం అనేది కేవలం ధిక్కారం, వేధింపుల కథనంపై ఆధారపడి సాధ్యం కాదు. దానికి బదులుగా, పార్టీ తన భారీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం, తన కోర్ బేస్ను దాటి విస్తృత ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆకర్షణీయమైన, సానుకూల దృష్టిని అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది
by Rama Chandra P | Jul 8, 2025 | ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ
వెబ్ ల్యా0డ్ లో భూములకు రంగులెందుకు ? అనుకుంటున్నారా ? భూదర్శని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది .
కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్ల్యాండ్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్ల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు.
వెబ్ల్యాండ్లో మనకు కావలసిన భూమిపై క్లిక్ చేయగానే యజమాని పేరు, సర్వే నంబరు తదితర వివరాలు సులువుగా తెలుస్తాయి
‘భూ దర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్ల్యాండ్లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు (1,27,547.856 చదరపు కిలోమీటర్లు) ఉండగా, వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే (34,984.18 చ.కి.మీ. మేర) పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఆవి ఆటోమేటిగ్గా వెబ్ల్యాండ్లోకి చేరుతున్నాయి.
5 రంగులు: రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాపుల్లో ఉన్న భూములను 5 వేర్వేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది. రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా దృశ్యరూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. వెబ్ల్యాండ్లో భూముల వద్ద క్లిక్ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ విధానం క్రయ, విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది.
భుదర్శిని తో ప్రయోజనాలు
- సరి హద్దులు కచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు.
- ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది.
- ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు.
- విపత్తుల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- అధికారులు రైతుల పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుంది .
- చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వంటివి గుర్తించవచ్చు.
- పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లోని పంటల సాగు, భూముల స్వభావం తెలుసుకోవచ్చు.
- గ్రీన్ ఎనర్జీలో భాగంగా విద్యుత్తు ఉత్పాదనకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
by Rama Chandra P | Jul 3, 2025 | ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి – టీడీపీ – వైసీపీ రాజకీయ క్రీడ
ఒక నాయకుడి కారు కింద పది కార్యకర్త చనిపోతే కారు సదరు నాయకుడిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం > >> అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . అయితే సింగయ్య కారుకిందపడినడిపుడు . .. కారు ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళితే ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు . కానీ చావు బతుకుల మధ్య ఉన్న సింగయ్యను పక్కనపడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు . సకాలంలో వైద్యం అందక సింగయ్య చనిపోయాడు .
ఒక కార్యక్రమంలో జగన్ ని చూసేందుకు వచ్చి జగన్ కారు కిందపడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు . సింగయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వార్తలలో నిలిచింది. పైకి చూస్తే, ఇది ఒక ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తుంది. నాగరిక సమాజంలో పలకరింపు, పరామర్శ, ఓదార్పు అనేవి మానవత్వానికి ప్రతీకలు. అయితే, ఈ సంఘటనను కేవలం మానవతా కోణంలోనే కాకుండా, దాని వెనుక ఉన్న పోలీసు కేసు, నైతిక బాధ్యతల నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
సింగయ్య మరణానికి కారణమైన ప్రమాదంపై నమోదైన కేసులో జగన్ రెండవ ముద్దాయి (A2). కారు కింద పడిన వ్యక్తిని పట్టించుకోకుండా, పక్కకు లాగి ముందుకు సాగిపోవడం “ఉద్దేశం లేని హత్య” (Culpable Homicide not amounting to Murder) కిందకు వస్తుందని, వాహన యజమానిగా ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేరమని పోలీసులు అభియోగం మోపారు.
జగన్ పై చర్యలు వద్దన్నారు . . సరే.. పిలిపించుకుని మాట్లాడటం సబబేనా?
ఈ అభియోగాన్ని కేసును పూర్తిగా కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) జగన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ, న్యాయమూర్తి “తొందరపాటు చర్యలు తీసుకోవద్దు” అని పోలీసులను ఆదేశించారు. దీని అంతరార్థం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జగన్ను అరెస్టు చేయరాదని! అయితే, అతడిని విచారించవచ్చో లేదో అనే విషయంలో స్పష్టత లోపించింది. చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టే, ఏమి చేయకూడదో ముద్దాయికి కూడా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయం కదా! దీన్నే ఊళ్ళలో ఏమీ చదువుకోని వారు కూడా “తల్లీ బిడ్డల న్యాయం” అంటారు. సమధర్మాన్ని సూచించే తల్లీబిడ్డల న్యాయం కోర్టులో కూడా కనబడాలి కదా!
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో, ముద్దాయి సాక్షులను లేదా బాధితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే, ప్రాసిక్యూషన్ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది న్యాయ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం. జగన్ విషయంలో, ఆయన ఇంకా కేసు నుండి బయటపడలేదు. న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదు. అలాంటి సున్నితమైన దశలో, కేసులో బాధితులైన సింగయ్య కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
ఈ ప్రాథమిక విషయాన్ని విస్మరించి, బాధితులతో సమావేశమవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది బాధితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో లేదా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు, నిందితుడికి లభించిన తాత్కాలిక రక్షణను బాధితులను ప్రలోభపెట్టడానికో, ప్రభావితం చేయడానికో వాడుకోకూడదు.
న్యాయస్థానాలు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ నిర్ణయాలు కేవలం సాంకేతికంగానే కాకుండా, న్యాయాన్ని అందించేవిగా, ధర్మాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చట్టం (Law): సమాజ క్రమానికి రూపొందించిన నియమాల సమాహారం. న్యాయం (Justice): ఆ చట్టం ద్వారా సాధించాల్సిన అంతిమ లక్ష్యం. ధర్మం (Dharma): చట్టం మరియు న్యాయానికి ఆత్మ వంటిది. ఇది నైతికత, నీతి, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంటుంది.
సమాజాన్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకులు ఈ “ధర్మాన్ని” నిలబెట్టడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించాలి. వారి ప్రవర్తన సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ, ప్రస్తుత సంఘటనలో ఆ బాధ్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కోర్టు ఆదేశాలు, తీర్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులకు లభించే ఊరటలపై సామాన్యులలో సైతం చర్చ జరుగుతోంది. “పోలీసుల కాళ్లు కట్టేసి, దొంగతోపాటు పరుగెత్తమన్నట్లుంది తీర్పు,” లేదా “ఈ కోర్టులో ఇలాగే ఉంటుంది, పై కోర్టులో చూడాలి” వంటి వ్యాఖ్యలు ప్రజాబాహుళ్యంలో వినిపిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ “అప్డేటెడ్” ప్రజల అభిప్రాయాలను, వారిలోని నైతిక ఆక్రోశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
న్యాయవ్యవస్థ ప్రాథమికంగా చట్టానికి బాధ్యత వహిస్తుంది, కానీ ఆ చట్టాన్ని న్యాయాన్ని సాధించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ మొత్తం ప్రక్రియ “ధర్మం” అనే ఉన్నతమైన నైతిక చట్రంలో జరిగినప్పుడే దానికి సార్థకత. రానురాను ఆ సమతూకం దెబ్బతినడమే నేటి అసలు విషాదం.
అయితే ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి వైపు తప్పులేదంటూ తటస్థ వైఖరి ముసుగు వేసుకున్న కొందరు మేధావులు వాదిస్తున్నారు . ఒక మనిషిని కారు గుద్ది ప్రమాదంలో ఉంటె . .. అది తెలిసి కూడా వదిలేసి వెళ్లిపోవడం మానవత్వమా ? సదరు మేధావులు చెప్పాలి .
by Ram Maddipati | Jul 2, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కొత్త అధ్యక్షుల నియామకంతో మారనున్న రాజకీయ పరిణామాలు
బీజేపీ వ్యూహం వెనుక 2029 లక్ష్యం కనిపిస్తోందా ? ?
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో తాజాగా వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది.
కాషాయ పార్టీ మొదటినుంచీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో తనదైన విలక్షణతను చాటుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినవారిని పార్టీలోకి చేర్చుకున్నా వారిని అధ్యక్ష పదవుల్లో నియమించడం లేదు. తొలినుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని మాత్రమే అందుకు ఎంచుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేయడం దీనినే సూచిస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారిని తప్పక గుర్తిస్తామని చాటుతూ పార్టీ క్యాడర్లో మొరాలిటీని పెంచేందుకు ఈ విధానం ఆపార్టీకి ఉపకరిస్తోంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ నియమించిన అధ్యక్షులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగానే ఎంచుకుంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్నవారే. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ది కూడా అదే సామాజికవర్గమన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గం మొదటినుంచీ అధికశాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూవస్తోంది. ఇక సంఖ్యాప్రకారం తక్కువే ఐనా రాజకీయంగా ఆ ప్రాంతంలో గట్టి ప్రభావం చూపగల సత్తా వెలమలది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను మరింత బలహీనపరచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వెలమలతో పాటు.. బీసీలు, ఇతర సామాజికవర్గాల మద్దతుతో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో అధికారం సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. కాళేశ్వరంలో అవినీతి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ఆయుధంగా చేసుకుని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోలేకపోతే అది తనకే మేలు చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ మీదే విమర్శల దాడిని పెంచుతోంది. ప్రజలపై ప్రభావం చూపే అంశాలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైనా భారీ స్థాయిలో ప్రచారం, పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ప్రజలు భావించేలా పార్టీని బలోపేతం చేయడం. ఇందుకు అనుగుణంగా కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీ విషయం తర్వాత చూసుకుందాం..
ఏపీలో ఇప్పటికిప్పుడు బలపడకపోయినా పరవాలేదు. అక్కడ తాను భాగస్వామిగా ఉన్న కూటమే అధికారంలో ఉంది. కనుక బీజేపీ అధిష్ఠానం ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించి ఉంటే తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా నష్టమని ఆ పార్టీ భావించినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిని ఆయుధంగా మలుచుకుని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ లాభపడేందుకు ప్రయత్నిస్తాయని బీజేపీ భావించింది. ఇదే అంశంపై ఇప్పటికే ఆ పార్టీలు రెండూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఆ అవకాశం లేకుండా చేసింది.
ఏపీలో “సైలెంట్ గ్రోత్ష మోడల్
నిజానికి 2024 ఎన్నికలకు కొద్దికాలం ముందుదాకా ఏపీలో బీజేపీ- టీడీపీ సంబంధాలు ఏమంత సజావుగా లేవు. నాటి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఉందన్న భావం జనంలో సైతం విస్తృతంగా ఉన్న సమయమది. టీడీపీ- బీజేపీ కలిసి నడవడం సాధ్యమేనా అన్న అభిప్రాయం ఉండేది. అయితే జనసేనాని పవన్కల్యాణ్ టీడీపీతో కలిసినడవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతోపాటు మూడు పార్టీల కూటమి ఏర్పాటుకు గట్టిప్రయత్నం చేయడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ పరిస్థితి తెలంగాణకు భిన్నంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా తిరుగులేని విజయం పొందినప్పటికీ, పార్టీకి అక్కడ మద్దతు స్వల్పమే. అందుకే పార్టీ బలోపేతానికి నెమ్మదిగా అడుగులు వేయాలనుకుంటోంది. భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టిందని అర్థమవుతోంది.
పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబం మొదటినుంచీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిఉంది. ఆయన తండ్రి కూడ ఆర్ఎస్ఎస్లో కీలకంగా పని చేశారు. మాధవ్ 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్కు సౌమ్యుడిగా పేరుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా మిత్రపక్షాలతో సమన్వయం, సంయమనం పాటిస్తూ సొంత పార్టీ బలోపేతానికి కృషి చేయగల సత్తా ఆయనకుందని బీజేపీ భావించడంతోనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అందించినట్టు తెలుస్తోంది.