by Ram Maddipati | Jul 14, 2025 | ఆంధ్రప్రదేశ్
బిట్స్ ఏఐ + క్యా0పస్ పై కుమారమంగళం బిర్లా ప్రకటన
అమరావతిలో మరో ప్రతిష్ట విద్యా సంస్థ క్యా0పస్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే మొదటి ఏఐ యూనివర్సిటీ
అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 7000 మంది విద్యార్థులకు స్టడీకి అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని… వచ్చే 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు .
ఇండియాలో ఫస్ట్ ఏఐ క్యాంపస్: ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది .. దేశంలో ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదు . . . దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
70 ఎకరాలలో బిట్స్
బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.
భూ సమీకరణ-2 .. వ్యవహారంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో… ఆ అంశంపై పెద్దగా చర్చ లేకుండా ఉండేందుకు బిట్స్ అమరావతిలో ఏర్పాటు అంశం వెంటనే తెరపైకి వచ్చినట్లు కూడా పలువురు ప్రచారం మొదలుపెట్టారు .
by Ram Maddipati | Jul 2, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
కొత్త అధ్యక్షుల నియామకంతో మారనున్న రాజకీయ పరిణామాలు
బీజేపీ వ్యూహం వెనుక 2029 లక్ష్యం కనిపిస్తోందా ? ?
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో తాజాగా వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది.
కాషాయ పార్టీ మొదటినుంచీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో తనదైన విలక్షణతను చాటుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినవారిని పార్టీలోకి చేర్చుకున్నా వారిని అధ్యక్ష పదవుల్లో నియమించడం లేదు. తొలినుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని మాత్రమే అందుకు ఎంచుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేయడం దీనినే సూచిస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారిని తప్పక గుర్తిస్తామని చాటుతూ పార్టీ క్యాడర్లో మొరాలిటీని పెంచేందుకు ఈ విధానం ఆపార్టీకి ఉపకరిస్తోంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ నియమించిన అధ్యక్షులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగానే ఎంచుకుంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్నవారే. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ది కూడా అదే సామాజికవర్గమన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గం మొదటినుంచీ అధికశాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూవస్తోంది. ఇక సంఖ్యాప్రకారం తక్కువే ఐనా రాజకీయంగా ఆ ప్రాంతంలో గట్టి ప్రభావం చూపగల సత్తా వెలమలది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను మరింత బలహీనపరచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వెలమలతో పాటు.. బీసీలు, ఇతర సామాజికవర్గాల మద్దతుతో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో అధికారం సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. కాళేశ్వరంలో అవినీతి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ఆయుధంగా చేసుకుని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోలేకపోతే అది తనకే మేలు చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ మీదే విమర్శల దాడిని పెంచుతోంది. ప్రజలపై ప్రభావం చూపే అంశాలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైనా భారీ స్థాయిలో ప్రచారం, పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ప్రజలు భావించేలా పార్టీని బలోపేతం చేయడం. ఇందుకు అనుగుణంగా కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీ విషయం తర్వాత చూసుకుందాం..
ఏపీలో ఇప్పటికిప్పుడు బలపడకపోయినా పరవాలేదు. అక్కడ తాను భాగస్వామిగా ఉన్న కూటమే అధికారంలో ఉంది. కనుక బీజేపీ అధిష్ఠానం ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించి ఉంటే తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా నష్టమని ఆ పార్టీ భావించినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిని ఆయుధంగా మలుచుకుని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ లాభపడేందుకు ప్రయత్నిస్తాయని బీజేపీ భావించింది. ఇదే అంశంపై ఇప్పటికే ఆ పార్టీలు రెండూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఆ అవకాశం లేకుండా చేసింది.
ఏపీలో “సైలెంట్ గ్రోత్ష మోడల్
నిజానికి 2024 ఎన్నికలకు కొద్దికాలం ముందుదాకా ఏపీలో బీజేపీ- టీడీపీ సంబంధాలు ఏమంత సజావుగా లేవు. నాటి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఉందన్న భావం జనంలో సైతం విస్తృతంగా ఉన్న సమయమది. టీడీపీ- బీజేపీ కలిసి నడవడం సాధ్యమేనా అన్న అభిప్రాయం ఉండేది. అయితే జనసేనాని పవన్కల్యాణ్ టీడీపీతో కలిసినడవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతోపాటు మూడు పార్టీల కూటమి ఏర్పాటుకు గట్టిప్రయత్నం చేయడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ పరిస్థితి తెలంగాణకు భిన్నంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా తిరుగులేని విజయం పొందినప్పటికీ, పార్టీకి అక్కడ మద్దతు స్వల్పమే. అందుకే పార్టీ బలోపేతానికి నెమ్మదిగా అడుగులు వేయాలనుకుంటోంది. భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టిందని అర్థమవుతోంది.
పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబం మొదటినుంచీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిఉంది. ఆయన తండ్రి కూడ ఆర్ఎస్ఎస్లో కీలకంగా పని చేశారు. మాధవ్ 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్కు సౌమ్యుడిగా పేరుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా మిత్రపక్షాలతో సమన్వయం, సంయమనం పాటిస్తూ సొంత పార్టీ బలోపేతానికి కృషి చేయగల సత్తా ఆయనకుందని బీజేపీ భావించడంతోనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అందించినట్టు తెలుస్తోంది.
by Ram Maddipati | Jun 25, 2025 | ఆంధ్రప్రదేశ్
విభజన తర్వాత చట్ట సభల్లో ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ– భవిష్యత్తుపైనే నాయకుల ఆశలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అయితే కేంద్రంలో తాను అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఆ పార్టీ ఆశించిన రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో సైతం దక్కించుకోలేకపోయిందన్నది నిజం. పదేళ్ల తర్వాత రేవంత్రెడ్డి నేతృత్వంలో ఆయన పోరాటంతోపాటు పలు అంశాలు కలిసివచ్చి అధికారం దక్కించుకోవడం వేరే సంగతి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పటంలో ఆ పార్టీ దాదాపు కనుమరుగైన స్థాయికి క్షీణించిందని చెప్పాలి. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి స్వయంకృతమే. గతంలో దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచిన సమయంలోనూ ఆ పార్టీకి అండగా నిలిచింది తెలుగు ప్రజలే. తిరిగి ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో ప్రధాన పాత్ర ఉమ్మడి ఏపీది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రాతినిధ్యంలో కూడా ఏపీలో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలింది.
విభజన గాయమా.. ప్రత్యర్థుల వ్యూహమా..?
2014లో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రం కావడం, ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేసే అంశంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుంది. అయితే సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకపోవడంతోపాటు పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించిన తీరు ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇక్కడి ప్రజలు శిక్షించారు. అయితే ఈ ఘటన జరిగి దశాబ్దకాలం గడచినా ఆ పార్టీ ఇక్కడ ఒక మోస్తరు స్థాయిలోనైనా కోలుకోలేకపోవడానికి కారణం మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యమేనని చెప్పాలి. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణలో నాటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గరిష్ట ప్రయోజనం దక్కించుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తప్పుడు వ్యూహాలే కారణం. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే కాంగ్రెస్కి ఘోర పరాభవాన్ని తేటతెల్లం చేశాయి.
కాంగ్రెస్ పార్టీ తప్పిదాలే వైసీపీ పునాదులు
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తాను ఏంచేసినా చెల్లుతుందని, భవిష్యత్తు రాజకీయ పరిణామాలు తాను ఆశించినట్టే ఉంటాయని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మరోపక్క బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా ఎదురయ్యే ముప్పును కూడా చాలా తక్కువగా అంచనా వేసింది. తెలంగాణ ఇచ్చింది తానే కాబట్టి అక్కడి ప్రజలు తనవెంటే ఉంటారని భావించింది. కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు విని చేతులారా వదులకుంది. ఇక ఏపీలో తాత్కాలికంగా నష్టపోయినా సంప్రదాయ ఓటు బ్యాంకు భవిష్యత్తులో తిరిగి తన నీడకే చేరుతుందని భావించింది. వైఎస్సార్ తనయుడైన జగన్మోహన్రెడ్డి పార్టీ ఈ పరిణామం ద్వారా బలపడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. తాను అమలు చేసే వ్యూహం ప్రకారం జగన్ తిరిగి తనగూటికే చేరక తప్పదని అనుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలన్నీ ఘోర తప్పిదాలుగా మారి పార్టీ దుస్థితికి కారణమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకే వైసీపీకి పునాది
వైసీపీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న జగన్మోహన్రెడ్డి ఈ పరిణామాలను, అవకాశాన్ని తెలివిగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడర్ను గంపగుత్తగా సొంతం చేసుకుని ఏపీలో బలమైన రాజకీయనేతగా ఆవిర్భవించారు.2014 అసెంబ్లీ ఎన్నికలు: 175 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు షేర్ 2% కంటే తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికలు: ఓటింగ్లో పార్టీ ఉనికే కన్పించలేదు – రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ 1% లోపే. 2024 ఎన్నికలు: కాంగ్రెస్ పోటీ చేసినా, ఫలితాలు నామమాత్రమే. టీవీ చర్చల్లోనైనా పేరు వినిపించనంత స్థాయిలో వెనుకబడిపోయింది.
నాయకత్వ లోపం – నిస్సత్తువగా పునర్నిర్మాణం
విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు మిగల్లేదు. పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన లోటును పార్టీ ఇప్పటికీ పూడ్చుకోలేకపోయింది. అంతేకాదు.. వైఎస్సార్ హయాంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇతర నాయకులను ఎదగనివ్వకపోవడం తాలూకు దుష్పరిణామాలను ఇప్పుడు అనుభవిస్తోంది. ఆయన వారసుడైన జగన్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వైఎస్ షర్మిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినా పార్టీ కోలుకుంటున్న సూచనలు ఏమాత్రం కానరావడం లేదు.
భవిష్యత్ లో పుంజుకునేందుకు ప్రయత్నాలేవీ..?
కేంద్రంలో వరుసగా మూడు ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోవడం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెనుశాపంగా మారింది. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహించిన సమయంలోనూ ఏపీకి ఏమంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీల్లో ఒకరైనా కొన్నిరోజులపాటు ఏపీలో పర్యటించి గతంలో పార్టీ తరపున రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని ప్రజలను కోరకపోవడం వారి రాజకీయ అపరిపక్వతగానే భావించాలి. ఏదేమైనా గతంలో బలమైన క్యాడర్ను కలిగిఉన్నరాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించే విధానాలు, స్థానిక నేతల ప్రోత్సాహం, ఓర్పుతో కేడర్ మళ్లీ తయారు చేయడం.. విభజనపై బాధ్యతను అంగీకరించి, ప్రజల్లో విశ్వాసం కలిగించగల సామర్థ్యం ఉన్న ఓ మానవీయమైన నాయకత్వం..ఇవన్నీ కలిస్తేనే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగలదు. కానీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ దిశగా తొలి అడుగులు వేసే ప్రయత్నం కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం వహించిన పీసీసీ కార్యాలయాల్లో చురుకైన కార్యకలాపాలు లేవు. జిల్లాల్లో పాత నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.
ముగింపు మాట
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రాజకీయ విశ్లేషకులు హాస్పాస్పదంగా స్పందించే పరిస్థితి ఉంది. అయితే, రాజకీయాల్లో శాశ్వతంగా ఇదే ముఖచిత్రం ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని ప్రత్యామ్నాయ శక్తిగా మారగలిగే గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. ప్రజలు తమ అభిప్రాయం మార్చుకుంటే పార్టీల తలరాతలు తిరిగి రాయగలరు. ఆ దిశగా పార్టీ చేసే కృషి మాత్రమే ప్రజాదరణకు దగ్గర చేయగలదు అందుకు తగిన సంస్కరణలు, కొత్త దారులు అవసరం. లేకపోతే “ఒకప్పుడు ఏపీని పాలించిన అభయ హస్తచిహ్నం… ఇప్పుడు జాడలు మిగలని జ్ఞాపకమే..”! అన్నట్టుగా చరిత్రలో మిగిలిపోతుంది.
by Ram Maddipati | Jun 21, 2025 | జనరల్
అప్పుల ఊబిలో అగ్రరాజ్యం.. ఏటా వడ్డీలకే ట్రిలియన్ డాలర్ల ఖర్చు
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలోని ప్రధాన దేశాలు బలహీనపడటంతో ప్రపంచంలోనే ఆర్థికంగా సైనికంగా తిరుగులేని అగ్రరాజ్యంగా ఆవిర్భవించే అవకాశం అమెరికాకు దక్కింది. ఆ తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సోవియట్ యూనియన్ నుంచి రాజకీయంగా సైనిక ఆయుధశక్తిపరంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నా అంతిమంగా గెలిచింది అమెరికానే. సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక అమెరికా ఏకైక అగ్రదేశంగా నిలిచి ప్రపంచదేశాలను అన్నివిధాలుగా శాసిస్తూ వచ్చింది. అయితే ఈ వైభవం ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలు కొంతకాలంగా ఆర్థిక రంగంలోని నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. విశ్వవాణిజ్యంలో ఇప్పటిదాకా ప్రధాన కరెన్సీగా ఆమెరికా డాలర్ చలామణిలో ఉంది. బంగారం వంటి విలువైన లోహాల నుంచి ముడి చమురు వ్యాపారం దాకా అత్యధిక శాతం మారకం డాలర్లలోనే సాగుతోంది. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో మారే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా చైనా దేశం నుంచి అమెరికాకు ఎదురవుతున్న పోటీయేనని చెప్పుకోవాలి. చైనాకు అమెరికా మధ్య సాగుతున్న ఆర్థిక పోటీ, వ్యూహాత్మక వేడి, డాలర్పై ఆధిపత్యాన్ని తగ్గించాలన్న చైనాకి ఉన్న ప్రణాళికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ప్రపంచ తయారీ రంగంపై పెరిగిన చైనా ఆధిపత్యం..
ప్రపంచ తయారీ రంగంలో గడచిన రెండున్నర దశాబ్దాలుగా చైనా శరవేగంగా దూసుకెళుతోంది. 2023 నాటికి గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్లో చైనాకి ఉన్న వాటా దాదాపు 28.8 శాతంగా ఉంది, ఇది పెద్దన్న అమెరికా (15.5%) కంటే ఇంచుమించు రెట్టింపు. రెండు దశాబ్దాల క్రితం ఇది కేవలం 8 శాతం మాత్రమే. చైనా తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో పెరిగిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. చైనా దూకుడు ఉత్పత్తి రంగంతో మాత్రమే ఆగలేదు. ‘Made in China 2025’ వంటి ప్రణాళికలతో దేశీయ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన సాంకేతిక రంగంలో సైతం ఆధిపత్యాన్నిసాధించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా టెక్ జెయింట్లు వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి తయారు చేసిన చాట్ జీపీటీ వంటి అద్భుత సాంకేతిక సాధనాలకు పోటీగా తక్కువ వ్యయంతోనే డీప్సీక్ వంటి డిజిటల్ ఉత్పత్తులతో ఆ రంగంలోనూ అమెరికాకు సవాల్ విసురుతోంది.
టెక్నాలజీ, పరిశోధనలో గణనీయ పెట్టుబడులు
చైనా తన జాతీయ ఆదాయంలో 2.6 శాతానికి పైగా నిధులను పరిశోధన & అభివృద్ధి రంగానికి ఖర్చు చేస్తోంది. 2024లో ఈ ఖర్చు దాదాపు $70 బిలియన్లకు చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, చిప్ తయారీ వంటి కీలక రంగాల్లో చైనా స్వావలంబన వైపు వేగంగా కదులుతోంది. ఇది తన ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు అనే భయం అమెరికాలో నెలకొంది. అందుకే అక్కడ నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షలు పెడుతోంది.
డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ?
చైనా పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో అమెరికన్ డాలర్కు బదులుగా, తమ కరెన్సీ అయిన రెమ్మిన్బి (యువాన్)లో లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తోంది. 2024 నాటికి ట్రేడ్ ఫైనాన్స్లో రెమ్మిన్బి వాడకం స్విఫ్ట్ డేటా ప్రకారం రెండో స్థానానికి చేరింది. ఇది డాలర్ ఆధిపత్యానికి గండికొట్టే దిశగా బలమైన అడుగుగా పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇప్పటికే చైనా ఎదిగింది. అమెరిక సహా అనేక దేశాలతో వాణిజ్యంలో చైనాకు మిగులు ఆదాయం ఉంది. అంటే ఆయా దేశాలనుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువ కంటే చైనా ఎగుమతి చేసేవాటి విలువ ఎంతో ఎక్కువ. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాలు కూడా అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.
అమెరికా రక్షణాత్మక చర్యలు
చైనా సహా ఇతర దేశాలు సాధిస్తున్న వృద్ధి తనకు ప్రతికూలంగా మారుతున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు పలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటోంది. చైనా టెక్ సంస్థలపై ఆంక్షలు, హై-ఎండ్ చిప్స్ ఎగుమతులకు అడ్డుపడే విధంగా చర్యలు, మిత్ర దేశాల్లో చైనా దూకుడును తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక స్థానికంగా తయారీని ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అమెరికా చేస్తోంది. కానీ ఆ దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంతో అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
అమెరికాను భయపెడుతున్న అప్పులు
అగ్రరాజ్యం అమెరికాకు అప్పులు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అవి సుమారు 37 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏటా అమెరికా వీటిపై కడుతున్న వడ్డీనే ఏటా 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారింది. అమెరికాతో వాణిజ్య మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని చైనా తిరిగి ఆదేశంలోనే బాండ్లలో పెట్టుబడి పెడుతూ వచ్చింది. పదేళ్లక్రితం ఈ పెట్టుబడులు దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. ఆ తరువాత అమెరికాలో అత్యధిక పెట్టుబడులు ఉన్న దేశాలుగా జపాన్, యూకే ఉండేవి. అయితే ఈ దశాబ్ద కాలంలో చైనా అమెరికా బాండ్లలో తన పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం అవి 785 ట్రిలియన్ డాలర్లకు తగ్గడంతో చైనా అమెరికా పెట్టుబడుల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఒకరకంగా ఇది అమెరికా డాలర్పై వత్తిడి పెంచేందుకు చైనా అనుసరించిన వ్యూహాత్మక విధానమేనని చెప్పాలి. ఆర్థికంగా బలంగా ఉన్న చైనా తన పెట్టుబడులు ఉపసంహరించుంటే అమెరికాకు రుణ సేకరణ భారమవుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆంక్షలంటూ చైనా సహా పలు దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేస్తున్న విన్యాసాల వెనుక నేపథ్యమిదే.
కమ్యూనిస్టు దేశం కావడమే చైనాకు అడ్డంకి..
అయితే ఇప్పటికిప్పుడు చైనా పూర్తిగా అమెరికా స్థానాన్ని సొంతం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ చైనా కొన్ని సరళ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నా మౌళికంగా కమ్యూనిస్టు దేశం. ఇంకా పర్-క్యాపిటా ఆదాయం, బహుళరాజకీయ విధానాలు, ఫైనాన్షియల్ వ్యవస్థలు వంటి విషయాల్లోనూ అమెరికాతో పోలిస్తే చైనా వెనుకబడి ఉంది. అయితే దీర్ఘకాలంలో చూసినప్పుడు, చైనా ముందస్తు ప్రణాళికలతో, క్రమంగా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విషయం కాదనలేని వాస్తవం.
by Ram Maddipati | Jun 18, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దుల్లో తగ్గిన మావోల అలజడి . .. ఛత్తీస్ ఘడ్ లోనూ తగ్గిన ప్రభావం
తాజాగా ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం.. అల్లూరి జిల్లాలో ఘటన
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో భద్రతా దళాల గాలింపు చర్యల్లో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళ సహా ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మరణించారు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల సమీపంలోని కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు వద్ద ఇరువర్గాలకు భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చనిపోయిన వారిని మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య అరుణ, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చలపతిరావు ఈ ఏడాది జనవరిలో చత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో జరిగిన భద్రతాదళాల కూంబింగ్లో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
మూడు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం
కాగా ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ సహా భారీగా ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. హతుల్లో అరుణ మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు కాగా గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎంగా ఉన్నట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జరిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉంది. చనిపోయినవారి మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్కౌంటర్తో ఉలికిపాటుకు గురైన ప్రజలు
ఇటీవలికాలంలో ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో ఈ ప్రాంతమంతా ఉన్న సమయంలో ప్రజలు తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ, తూర్పుగోదావరిజిల్లాల్లోని దండకారణ్య ప్రాంతం మావోయిస్టులకు పెట్టనికోటగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి పలువురు యువకులు ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులై చేరడంతోపాటు, గ్రామాల్లో పలువురు సానుభూతిపరులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్యమం బలంగా విస్తరించింది. భద్రతా దళాలకు.. మావోయిస్టులకు తరచుగా కాల్పులు జరుగుతూ ఇరువైపులా ప్రాణనష్టం జరిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జరుగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా తీవ్రవాదులు సరిహద్దుల్లోని చత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో తరలిపోయి షెల్టర్ తీసుకునేవారు. తమకు అనువైన సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడి ఎదురుదాడి చేసేవారు. ఈ కారణంగానే వారిని ఎదుర్కోవడం పోలీసులకు పెనుసవాల్గా ఉండేది.
గతంలో ప్రభుత్వాలకు వణుకు పుట్టించిన మావోయిస్టు దాడులు
కొన్నేళ్ల క్రితం తీవ్రవాద ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ఏవోబీలోను, బస్తర్ అడవుల్లోనూ కూంబింగ్కు వెళ్లిన భద్రతాదళాలపై ఊహించనివిధంగా చుట్టుముట్టి మావోలు భీకరమైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బలిమెల జలాశయంలో గ్రేహౌండ్స్ దళాలు ప్రయాణిస్తున్న పడవపై మావోయిస్టులు తూటాల వర్షం కురిపించడంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు సహా మొత్తం 38 మంది మరణించారు. 2010 ఏప్రిల్లో చత్తీస్గడ్ రాష్ట్రంలోని చింతల్నార్ వద్ద కూంబింగ్కు వెళ్లిన 200 మంది భద్రతాదళాలను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చక్రవ్యూహంలో బంధించి జరిపిన మారణహోమంలో 76మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జరిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెలలో మళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వస్తున్న ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చి 10మందిని బలిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్రమే.
వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన మావోయిస్టులు
మావోయిస్టుల సమస్యను బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర హోం శాఖ.. మావోయిస్టు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించింది. దీంతో సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలు మావోల ప్రాబల్యమున్న రాష్ట్రాల పోలీసుల సహకారం సమన్వయంతో వారున్న అటవీ ప్రాంతాలను కొన్ని నెలలుగా ప్రణాళిక ప్రకారం జల్లెడ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ జరుగని స్థాయిలో మావోలతో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్రనాయకత్వంతో సహా రెండువందలమందికి పైగా భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్టర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చినట్టు విశ్లేషణలు వస్తున్నాయి.
ఉద్యమం బలహీనపడటానికి కారణాలెన్నో..!
ఆయుధాలు చేతబట్టి హింసావాదంతో వ్యవస్థలను మార్చవచ్చని నమ్మే కాలం చెల్లిన ఆలోచనావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాలను గుర్తించలేని పిడివాదం.. సామాన్య ప్రజల్లో ఉద్యమంపై ఒకనాటి సానుభూతి క్రమేణా కరిగిపోవడం మావోయిస్టు ఉద్యమం బలహీనపడటానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా యువతకు అభివృద్ధి ఫలాలు అందడంతో కొత్తగా ఉద్యమం వైపు ఆకర్షితమయ్యేవారు కరువయ్యారు. ఇదే సమయంలో కొందరు మావోయిస్టు పార్టీ నేతలు తెలంగాణలోనూ ఇటు ఏపీ, రాయలసీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు అనుకూలంగా వ్యవహరించి ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకరకంగా వారి వెన్నుపోటు పార్టీని తప్పుడు మార్గం పట్టించింది. మావోయిస్టులను తమ రాజకీయ ఎదుగుదలకు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకున్న ఆ నేతలు తమకు అధికారం దక్కాక ఉద్యమాన్ని అంతం చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. ఉద్యమం బలహీనం కావడం మొదలైంది ఆ కాలంలోనే. ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలపై పోరాడాల్సింది పోయి వ్యవస్థపైనే పోరాటం సాగిస్తామనడం అర్థరహితం అవివేకం. మావోయిస్టు ఉద్యమం ఉత్ధాన పతనాలు చెప్పే పాఠమదే. అక్రమాలను ప్రశ్నించే ధైర్యమున్న అతికొద్దిమంది యువత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు నడిపించే నాయకులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు పట్టి అడవిపాలై తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.