ప్రకృతి వ్యవసాయంపై ‘అమిత్ షా’ ఆసక్తి ఎందుకు ?

ప్రకృతి వ్యవసాయంపై ‘అమిత్ షా’ ఆసక్తి ఎందుకు ?

రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట

అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .

‘‘రిటైర్మెంట్‌ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్​, థైరాయిడ్​తో పాటు ప్రాణాంతక క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .

మరో సహకార ఉద్యమం రావాలి .
కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్​లోని ఆనంద్​లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ పాల్గొన్నారు. అమూల్​ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్​, ప్లాట్​ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్​లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

జగన్ … జనసమీకరణ డ్రామా

జగన్ … జనసమీకరణ డ్రామా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మామిడి రైతులను పరామర్శించే బంగారుపాళ్యం యాత్ర జనసమీకరణ డ్రామా గా మారింది . ఈ యాత్రకు 10 వేలమందిని అనుమతించాలని ఆయన పార్టీ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. మండలాల వారీగా ఎంతెంత మంది ఎన్నెన్ని వాహనాల్లో రావాలో స్థానిక వైసీపీ నేతలకు కోటాలు కూడా విధించారు. 500 మందికి మించి అనుమతించలేమని పోలీసులు సమాధానమిచ్చారు . జగన్ పార్టీవారికి లా అండ్ ఆర్డర్ తో పనిలేదు. ఈ సారికూడా పోలీసు ఆదేశాలను ధిక్కరించేసారు . ఇష్టానుసారం పేట్రేగిపోయారు .

జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పహారా కాస్తున్న పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వైసీపీ మూకల వీరంగం..

అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన పార్టీకి, జన సమీకరణ ఒక రాజకీయ అవసరంగా మారింది. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందనే ముద్రను చెరిపేయడం, 2) కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం, 3) అధికార పక్షానికి తమ బలాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించడం.

ఈ వ్యూహం నిస్సందేహంగా నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా ఉంచుతుంది.

* కోర్ ఓటర్ బేస్, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది.

* నాయకుడి ఉనికిని, ప్రాముఖ్యతను మీడియాలో, ప్రజలలో నిరంతరం నిలుపుతుంది.

* కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా అధికార పక్షాన్ని నిరంతరం రక్షణాత్మక స్థితిలో ఉంచుతుంది…. అని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీ కేడర్ పైనా , నేతలపైనా జనంలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు .

వైసీపీ హంగామా వల్ల నష్టాలు:

* ప్రజా విసుగు (Public Fatigue): నిరంతరం పునరావృతమయ్యే రాజకీయ నాటకంగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ డ్రామా

తటస్థ ఓటర్లను జగన్ పార్టీకి దూరం చేస్తుంది. కిడ్నాప్, హింస, ఎన్నికల అక్రమాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీలకు నాయకులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, నేర ప్రవర్తనను సమర్థించడంగా భావిస్తున్నారు.

పదే పదే జన ప్రదర్శనల వల్ల ప్రభుత్వంపై విధానపరమైన, వాస్తవ సమస్యల ఆధారంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని జగన్ పార్టీ పోగొట్టుకుంది. .

ఇది పునరుజ్జీవనానికి స్థిరమైన మార్గమా?

జన సమీకరణ అనేది పార్టీ మనుగడకు అవసరమైన స్వల్పకాలిక సాధనం అయినప్పటికీ, అది పార్టీ పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. రాజకీయ పునరుజ్జీవనం అనేది కేవలం ధిక్కారం, వేధింపుల కథనంపై ఆధారపడి సాధ్యం కాదు. దానికి బదులుగా, పార్టీ తన భారీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం, తన కోర్ బేస్‌ను దాటి విస్తృత ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆకర్షణీయమైన, సానుకూల దృష్టిని అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది

ట్రంప్ టారిఫ్​ల దెబ్బ  –  – భారత్​పై  ఎంత ఎఫెక్ట్ ?

ట్రంప్ టారిఫ్​ల దెబ్బ – – భారత్​పై ఎంత ఎఫెక్ట్ ?

ఫార్మా ఉత్పత్తులపై 200శాతం,రాగిపై 50, సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్

భారత్​పై భారీ ప్రభావం పడుతుందంటున్న నిపుణులు

తన పిచ్చి చేష్టలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారిఫ్​లను విధించిన ట్రంప్, తాజాగా రాగిపై కూడా 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించేదిలేదని ట్రాంప్ క్లారిటీ ఇచ్చారు .

భారత్​పై ప్రభావం ఏ మేరకు . ..

విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్​పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్​కు ఎక్కువగా రాగి, ఔషదాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25లో ప్రపంచదేశాలకు 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి, దాని అనుబంధ ఉత్పత్తులను సరఫరా చేసింది భారత్. ఇందులో అమెరికా మార్కెట్లకు 360 మిలియన్ డాలర్లు లేదా 17 శాతంగా రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియా (26 శాతం), చైనా (18 శాతం) తర్వాత అమెరికాకు ఎక్కువ రాగి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశంగా మన దేశం మూడవ స్థానంలో ఉంది .

ఫార్మాకు గట్టి దెబ్బె . .. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీయనున్నాయి. రాగి ఉత్పత్తులతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం ఫార్మా రంగంపైనే ఎక్కువ పడనుంది. ప్రపంచ దేశాల్లో అమెరికాకే భారత్ ఎక్కువ ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేసింది. ఇది మునుపటి ఏడాది ఎగుమతులు 8.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతంగా ఉంది. ఫార్మా రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్​ను కుదుర్చుకునే పనిలో భారత్ ఉంది. సుంకాల అమలు గడువు ఆగస్టు 1లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొత్త టారిఫ్ ల ప్రభావం భారత మార్కెట్లపై పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

భూమికి రంగులు… భూముల గుర్తింపు కోసం ఏపీలో ఫస్ట్ టైమ్

భూమికి రంగులు… భూముల గుర్తింపు కోసం ఏపీలో ఫస్ట్ టైమ్

ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ

వెబ్ ల్యా0డ్ లో భూములకు రంగులెందుకు ? అనుకుంటున్నారా ? భూదర్శని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది .

 కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్‌ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్‌ల్యాండ్‌ను తీర్చిదిద్దుతున్నారు.

వెబ్‌ల్యాండ్‌లో మనకు కావలసిన భూమిపై క్లిక్‌ చేయగానే యజమాని పేరు, సర్వే నంబరు తదితర వివరాలు సులువుగా తెలుస్తాయి

‘భూ దర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు (1,27,547.856 చదరపు కిలోమీటర్లు) ఉండగా, వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే (34,984.18 చ.కి.మీ. మేర) పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఆవి ఆటోమేటిగ్గా వెబ్‌ల్యాండ్‌లోకి చేరుతున్నాయి.

5 రంగులు: రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాపుల్లో ఉన్న భూములను 5 వేర్వేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది. రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్‌కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి. డ్రోన్లు, శాటిలైట్​ ఇమేజ్​ల ఆధారంగా దృశ్యరూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వద్ద క్లిక్‌ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ విధానం క్రయ, విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది.

భుదర్శిని తో ప్రయోజనాలు

  • సరి హద్దులు కచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు.
  • ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది.
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు.
  • విపత్తుల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  • అధికారులు రైతుల పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుంది .
  • చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వంటివి గుర్తించవచ్చు.
  • పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లోని పంటల సాగు, భూముల స్వభావం తెలుసుకోవచ్చు.
  • గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా విద్యుత్తు ఉత్పాదనకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
బీహార్ ఓటర్ల జాబితా,  ప్రజాస్వామ్యమేనా?

బీహార్ ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్యమేనా?

ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఓటర్ల జాబితాలో ఓటర్ల సవరణ, నమోదు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ. ముసాయిదా జాబితాను విడుదల చేయడం, కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల వివరాలను రాజకీయ పార్టీలతో అందజేయడం సర్వసాధారణం. దీనివల్ల అభ్యంతరాలుంటే తెలియజేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఈసారి బీహార్‌లో ఎన్నికల సంఘం ఈ పద్ధతికి తూట్లు పొడిచింది. “ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్” పేరుతో ఒక కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో, ఏయే ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను (Addition and Deletion Lists) రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. కేవలం ఒకే ఒక ఏకీకృత జాబితాను అందిస్తున్నారు.

ఇది “గడ్డివాములో సూదిని వెతకడం” లాంటిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది ఓటర్లున్న నియోజకవర్గాల్లో, పాత జాబితాతో కొత్త జాబితాను బేరీజు వేసుకుని, ఏ పేరు పోయిందో, ఏ పేరు వచ్చిందో తెలుసుకోవడం అసాధ్యమని వాపోతున్నాయి. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని, అక్రమాలకు ఆస్కారం కల్పించడానికే ఈ గోప్యత నాటకమని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు వంటి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను గుట్టుచప్పుడు కాకుండా జాబితా నుంచి తొలగించి, దొంగ ఓట్లను చేర్చే కుట్ర కోణం ఇందులో దాగి ఉందని వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు .

ఎలక్షన్ కమిషన్ పై నీలినీడలు

ప్రతిపక్షాలు వారు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) నుంచి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వరకు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల, ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేశామని చెబుతున్నారు. పాత జాబితాలను, మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్‌లైన్‌లో సౌకర్యం ఉందని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఈ వాదనతో ప్రతిపక్షాలు ఏకీభవించడం లేదు. ఆన్‌లైన్ వ్యవస్థలు అంత పటిష్టంగా లేవని, లక్షలాది ఓటర్ల వివరాలను అలా పరిశీలించడం ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సహకరించడం లేదని, కావాలనే సమాచారాన్ని దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి . …

ఓటర్ల జాబితాలో గందరగోళాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక వ్యవస్థీకృత పద్ధతిలో, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పారదర్శకత లోపించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇది కేవలం ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించినది కాదు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకానికి సంబంధించినది. “మా ఓటు భద్రంగా ఉందా? మా పేరు జాబితాలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో మేమెలా ఓటు వేయాలి?” అనే సందేహం ఒక్కసారి ప్రజల్లో కలిగితే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల నుంచి ప్రతిఘటన లేకపోతే, ప్రజాస్వామ్య వాదులు దీనిపై ఉద్యమాల్ని నిర్మించకపోతే ఈ దుర్నీతి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే ప్రమాదం వుంది.

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

జగన్నామ స్మరణ వదిలిపెట్టి … జరగాల్సిన పనులు చూడండి.. అరాచకవాదుల ఆగడాలకు కట్టడివేయలేకపోతున్నారెందుకు ?

అమరావతి మొదటి విడత పనులు మూడేళ్ళలో ఎలా పూర్తి చేస్తారు? లెక్కలేమైనా ఉన్నాయా ?

అభాసుపాలవుతారు ? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టేయకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక విజన్ తోనే పనిచేస్తారు. తాజా విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి అనే బాబు హయాంలో అభివృద్ధి ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ప్రజల్లో ఆ ప్రభావం కూడా మిశ్రమంగా వుంది. ఆయన పార్టీ గెలుస్తోంది. ఓడిపోతుంది. గెలుస్తోంది. ఓడిపోతుంది. దీనంతటికీ బాధ్యత ముమ్మాటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిడే .

బాబు అభివృద్ధి మంత్రం ప్రజలను ఎంతగా కనెక్ట్ చేస్తోందో అధ్యయనం లేదు. జగన్ ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుని  బాబు పేదల సంక్షేమ పధకాల సొమ్ము పెంచి ఇంకా హెచ్చుమందికి  విస్తరింపచేశారు. లబ్దిదారుల తృప్తి లేదా అసంతృప్తి ఇప్పటికిప్పుడే లెక్కతేలేది కాదు.

ఇన్వెస్టర్లు నేరుగా బాబు తో టచ్ లో వున్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారేమో అనే భయం తప్ప వారికి మరో సంకోచమే లేదు.

క్షేత్రస్ధాయిలో ఎమ్మెల్యేలదే రాజ్యం. సంక్షేమ పధకాల లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బు జమ అవుతుంది . వారి ఇతర సమస్యల పరిష్కారం, మధ్యతరగతి వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు పెద్ద పని అవుతుంది. ఆచరణలో ఇది కూడా పెద్ద భారంకాదు. సమస్య స్టేటస్ ఆన్ లైన్ లో కనబడుతూనే వుంటుంది. దాన్ని పుష్ చేయడమే ప్రజాప్రతినిధులు చేయగలపని.

ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుల నిర్వహణ, అజమాయిషీ సిండికేట్లవే! ఈ సిండికేట్ల వెనుక ప్రజాప్రతినిధులు వున్నారు. శక్తివంతులైన ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి పాటదారుల సిండికేట్లు నాయకుల మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకోవాలి. గ్రామాల్లో ఈ విషయం లెక్కలతో సహా ఓపెన్ గా చెప్పేస్తూ వుంటారు. “మాకేంటి” అనే నాయకులు కూడా వున్నారు.

ఇసుక మట్టి పనుల్లో ఎమ్మెల్యేలు ఎంత దూరంగా వుంటే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని చంద్రబాబు హెచ్చరించడమే  పరిస్ధితి శృతిమించి రాగాన పడుతున్నదనడానికి ఒక సూచన!  ఎవరి కారణాలు వారికి వున్నా ఆదివారం జరిగిన అధికారపార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలను ముఖ్యనాయకులను పిలిచారు. మొత్తం ఆహ్వానితుల్లో  56 మంది హాజరు కాలేదంటే అది ఒక విధమైన లెక్కలేని తనానికి ఒక సూచనగా అర్ధం చేసుకోవచ్చు.

క్వాంటమ్ మొదలైన టెక్నాలజీ ప్రాజెక్టులు, రకరకాల పరిశ్రమలకు ఇన్వెస్టిమెంట్లు దీర్ఘకాలంలో  భవిష్యత్తుకి అవసరాలే! ఇవేమీ కళ్ళముందున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. కనెక్టు కాలేవు.

అధికారపార్టీల్లో వున్న ఎమ్మెల్యేల పనితీరే ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుంది. ప్రజల్లో నిలబెడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తుంది.

రేపటి అభివృద్ధి జపంలో కూటమి ప్రభుత్వం ఇపుడు కళ్ళముందున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, క్రిమినల్స్ ను నేరుగా సమర్థిస్తున్న అనేక కేసుల్లో నిందితుడైన జగన్ మీద చర్యల్లో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేయలేకపోతోంది. జగన్ పై చర్య చంద్రబాబు వల్ల కాదని ఆయన పార్టీ వాళ్ళే అంటున్నారంటే పరిపాలనలో ఒక పార్శ్వాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమౌతోంది. జగన్ మీద వ్యతిరేకతతోనే కూటమిని గెలిపించిన వర్గాల మనోభావాలను బాబు పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

బాబు సన్నిహితుడన్న బావసతో జగన్ ప్రభుత్వం వేధించిన ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ఒంటరి పోరాటం చేసి తనపై పాత ప్రభుత్వం మోపిన అభియోగాలనుంచి విముక్తుడయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది గడచినా ఎబి పెన్షన్ సెటిల్ మెంట్ జరగలేదు. జీతంలో సగం బకాయిలు ఇంకా ఆయనకు చెల్లించనే లేదు. మధ్యతరగతి విద్యావంతుల్లో చంద్రబాబు పాలనపై పెరుగుతున్న నిరుత్సాహానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి.

ప్రపంచంలో పెద్ద క్వాంటమ్ ప్రాజెక్టు మాకే వుంది. ఇంకో పాతికేళ్ళకు మేము ప్రపంచంలో గొప్పరాష్టం వాళ్ళమైపోతాం అనుకోడానికే తప్ప! బాబుగారి అభివృద్ధి మంత్రం వల్ల రోజువారీ బతుకుల్లో మార్పులు వుండవు. మాతోపాటు  ప్రభుత్వం వుందన్న భరోసా వుంటే చాలు. అదే ముందుకి నడిపిస్తుంది. సంక్షేమ పధకాల ద్వారా పేద వర్గాలకు జగన్ ఉన్నాడన్న ధీమాను ఆయన ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేసినా అది జగన్ పధకాల కొనసాగింపుగానే చూస్తారు. ఇందులో కూటమి లేబుల్ కాని బాబు లేబుల్ కాని లేవు.

బాబు గారూ! ప్రభుత్వం వుందన్న ప్రజెన్స్ ను మధ్యతరగతి వారికి, విద్యావంతులకు, జగన్ పై ఆగ్రహంతో మీకు అధికారాన్ని ఇచ్చిన వారికి చూపించండి. మీ ప్రభుత్వం  ఓడిపోవడం మీకు కొత్తకాదు. కానీ, మీ మీద నమ్మకం వుంచిన వారి ఆశలు కొన్నైనా నెరవేర్చండి!!

ఆషాడం… దేవతల నిద్ర సమయమా ?

ఆషాడం… దేవతల నిద్ర సమయమా ?

ఈ నెలలో అన్నీ స్తబ్ద0గా ఉండటానికి కారణం తెలుసుకుందామా . ..

ఆషాఢ మాసం వచ్చిందంటే బట్టల షాపుల్లో భారీ డిస్కౌంట్స్ . ఇలా చాలా బిజినెస్ ల వారు డిస్కౌంట్ల మేళాలు పెట్టడం తెలుగు రాష్ట్రాలలో రెండు దశాబ్దాలుగా వస్తోంది . ఎందుకంటే ఈ నెలలో ఎక్కువ వ్యాపారాలు తగ్గుముఖం పడతాయి, డబ్బు చెలామణి తగ్గిపోతుంది అన్ని రంగాల్లో ఒక రకమైన స్తబ్దత ఆవరిస్తుంది. దీని వెనుక స్పష్టమైన మతపరమైన, సామాజిక, వ్యవసాయ ఆర్థిక కారణాలు ఉన్నాయి.

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసాన్ని ‘శూన్య మాసం’గా పరిగణిస్తారు.

దీనికి ప్రధాన కారణాలు:

దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో దేవతలు యోగనిద్రలో ఉంటారని, వారి అనుగ్రహం పూర్తిగా ఉండదని ఒక నమ్మకం. అందువల్ల, వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, భూమి కొనుగోళ్లు వంటి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసే శుభకార్యాలను ఈ మాసంలో జరపరు. హిందూ కుటుంబాలలో ఇది సెంటిమెంట్

శుభకార్యాల ప్రభావం: పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరగనప్పుడు వాటిపై ఆధారపడిన అనేక వ్యాపారాలు సహజంగానే దెబ్బతింటాయి. బట్టల దుకాణాలు, బంగారం షాపులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, డెకరేషన్, రవాణా వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. ఇది మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని ఒక్కసారిగా తగ్గిస్తుంది.

వ్యవసాయ పనుల ముమ్మరం: ఆషాఢ మాసం వర్షాకాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది రైతులకు అత్యంత కీలకమైన సమయం. పెట్టుబడి అనంతరం విరామం: రైతులు అప్పటికే ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ఉంటారు. ఆషాఢ మాసంలో పొలం దున్నడం, నాట్లు వేయడం వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.

చేతిలో డబ్బు తక్కువ: వారి పెట్టుబడి అంతా భూమిలో ఉంటుంది. పంట చేతికి రావడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో రైతుల చేతిలో డబ్బు తక్కువగా ఉంటుంది. వారు అనవసర ఖర్చులు చేయరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముక కాబట్టి, వారి కొనుగోలు శక్తి తగ్గడం మొత్తం మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది.

వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం, అంటువ్యాధులు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు మరియు అనవసర ప్రయాణాలను, బయట తినడాన్ని మానుకుంటారు. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక రంగాలపై ప్రభావం చూపుతుంది.

ఆషాడ మాసంలో . .. (జులై ) వర్షాల కారణంగా ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి . ప్రజలు సొంత ఊళ్ళుమ్ ఇళ్లకే పరిమితం కావడానికి ఇది కూడా ఒక కారణం, తద్వారా వారి ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఆర్థిక చక్రంలో ఒక భాగం: ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం పండుగలకు, శుభకార్యాలకు పెట్టింది పేరు. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో మార్కెట్లో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజలు ఆషాఢంలో ఆదా చేసిన డబ్బును శ్రావణ మాసంలో ఖర్చు చేయడానికి మానసికంగా సిద్ధపడతారు. ఇలాంటి వాటిని బట్టే . .. కాబట్టి, ఆషాఢ మాసంలోని ఈ మందగమనం, రాబోయే పండుగల సీజన్‌కు ముందు వచ్చే ఒక సహజమైన ఆర్థిక విరామం లాంటిది.

ఆషాఢ మాసంలో కనిపించే ఆర్థిక మందగమనం కేవలం ఒక్క కారణం వల్ల ఏర్పడేది కాదు. శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాలు, వ్యవసాయ ఆధారిత జీవనశైలి, మరియు సహజమైన ఆర్థిక చక్రాలు అన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీస్తాయి. ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. శ్రావణం రాకతో మళ్లీ అన్ని రంగాల్లోనూ కొత్త కళ సంతరించుకుంటుంది

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

”పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.

దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.

దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.

ఎన్‌జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు
దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.

వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు
కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్‌ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.

బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం
గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

జగన్ పరామర్శ – ఒక నైతిక మీమాంస

జగన్ పరామర్శ – ఒక నైతిక మీమాంస

వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి – టీడీపీ – వైసీపీ రాజకీయ క్రీడ

ఒక నాయకుడి కారు కింద పది కార్యకర్త చనిపోతే కారు సదరు నాయకుడిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం > >> అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . అయితే సింగయ్య కారుకిందపడినడిపుడు . .. కారు ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళితే ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు . కానీ చావు బతుకుల మధ్య ఉన్న సింగయ్యను పక్కనపడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు . సకాలంలో వైద్యం అందక సింగయ్య చనిపోయాడు .

ఒక కార్యక్రమంలో జగన్ ని చూసేందుకు వచ్చి జగన్ కారు కిందపడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు . సింగయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వార్తలలో నిలిచింది. పైకి చూస్తే, ఇది ఒక ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తుంది. నాగరిక సమాజంలో పలకరింపు, పరామర్శ, ఓదార్పు అనేవి మానవత్వానికి ప్రతీకలు. అయితే, ఈ సంఘటనను కేవలం మానవతా కోణంలోనే కాకుండా, దాని వెనుక ఉన్న పోలీసు కేసు, నైతిక బాధ్యతల నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

సింగయ్య మరణానికి కారణమైన ప్రమాదంపై నమోదైన కేసులో జగన్ రెండవ ముద్దాయి (A2). కారు కింద పడిన వ్యక్తిని పట్టించుకోకుండా, పక్కకు లాగి ముందుకు సాగిపోవడం “ఉద్దేశం లేని హత్య” (Culpable Homicide not amounting to Murder) కిందకు వస్తుందని, వాహన యజమానిగా ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేరమని పోలీసులు అభియోగం మోపారు.

జగన్ పై చర్యలు వద్దన్నారు . . సరే.. పిలిపించుకుని మాట్లాడటం సబబేనా?

ఈ అభియోగాన్ని కేసును పూర్తిగా కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) జగన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ, న్యాయమూర్తి “తొందరపాటు చర్యలు తీసుకోవద్దు” అని పోలీసులను ఆదేశించారు. దీని అంతరార్థం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జగన్‌ను అరెస్టు చేయరాదని! అయితే, అతడిని విచారించవచ్చో లేదో అనే విషయంలో స్పష్టత లోపించింది. చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టే, ఏమి చేయకూడదో ముద్దాయికి కూడా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయం కదా! దీన్నే ఊళ్ళలో ఏమీ చదువుకోని వారు కూడా “తల్లీ బిడ్డల న్యాయం” అంటారు. సమధర్మాన్ని సూచించే తల్లీబిడ్డల న్యాయం కోర్టులో కూడా కనబడాలి కదా!

ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో, ముద్దాయి సాక్షులను లేదా బాధితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే, ప్రాసిక్యూషన్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది న్యాయ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం. జగన్ విషయంలో, ఆయన ఇంకా కేసు నుండి బయటపడలేదు. న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదు. అలాంటి సున్నితమైన దశలో, కేసులో బాధితులైన సింగయ్య కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?

ఈ ప్రాథమిక విషయాన్ని విస్మరించి, బాధితులతో సమావేశమవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది బాధితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో లేదా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు, నిందితుడికి లభించిన తాత్కాలిక రక్షణను బాధితులను ప్రలోభపెట్టడానికో, ప్రభావితం చేయడానికో వాడుకోకూడదు.

న్యాయస్థానాలు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ నిర్ణయాలు కేవలం సాంకేతికంగానే కాకుండా, న్యాయాన్ని అందించేవిగా, ధర్మాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చట్టం (Law): సమాజ క్రమానికి రూపొందించిన నియమాల సమాహారం. న్యాయం (Justice): ఆ చట్టం ద్వారా సాధించాల్సిన అంతిమ లక్ష్యం. ధర్మం (Dharma): చట్టం మరియు న్యాయానికి ఆత్మ వంటిది. ఇది నైతికత, నీతి, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంటుంది.

సమాజాన్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకులు ఈ “ధర్మాన్ని” నిలబెట్టడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించాలి. వారి ప్రవర్తన సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ, ప్రస్తుత సంఘటనలో ఆ బాధ్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కోర్టు ఆదేశాలు, తీర్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులకు లభించే ఊరటలపై సామాన్యులలో సైతం చర్చ జరుగుతోంది. “పోలీసుల కాళ్లు కట్టేసి, దొంగతోపాటు పరుగెత్తమన్నట్లుంది తీర్పు,” లేదా “ఈ కోర్టులో ఇలాగే ఉంటుంది, పై కోర్టులో చూడాలి” వంటి వ్యాఖ్యలు ప్రజాబాహుళ్యంలో వినిపిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ “అప్‌డేటెడ్” ప్రజల అభిప్రాయాలను, వారిలోని నైతిక ఆక్రోశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

న్యాయవ్యవస్థ ప్రాథమికంగా చట్టానికి బాధ్యత వహిస్తుంది, కానీ ఆ చట్టాన్ని న్యాయాన్ని సాధించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ మొత్తం ప్రక్రియ “ధర్మం” అనే ఉన్నతమైన నైతిక చట్రంలో జరిగినప్పుడే దానికి సార్థకత. రానురాను ఆ సమతూకం దెబ్బతినడమే నేటి అసలు విషాదం.

అయితే ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి వైపు తప్పులేదంటూ తటస్థ వైఖరి ముసుగు వేసుకున్న కొందరు మేధావులు వాదిస్తున్నారు . ఒక మనిషిని కారు గుద్ది ప్రమాదంలో ఉంటె . .. అది తెలిసి కూడా వదిలేసి వెళ్లిపోవడం మానవత్వమా ? సదరు మేధావులు చెప్పాలి .

దలైలామా వారసుడి ఎంపికపై  వివాదం ఏమిటీ?

దలైలామా వారసుడి ఎంపికపై వివాదం ఏమిటీ?

దలైలామా . .. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ గురువు. బౌద్ధంలో కీలక , చారిత్రక వ్యవహారాలపై ఆయన తీసుకునే నిర్ణయాలకు బౌద్ధ సమాజం మద్దతుగా నిలవడం ఆనవాయితీ. అయితే దలైలామా వారసుడి ఎంపికపై చైనా నిర్ణయంతో తాజాగా వివాదం నెలకొంది .

” నా వారసుడిని నిర్ణయించే అధికారం నాకు మాత్రమే ఉంది..” అంటూ బౌద్ధ మత గురువు దలైలామ చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ”దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారంలో తప్పనిసరిగా మా ఆమోదముద్ర ఉండాల్సిందే…” అని చైనా స్పష్టంగా పేర్కొంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు . దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది . టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పుచేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ఉబలాటపడుతోంది.

”15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది , దానిని నిర్వహించే అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు మాత్రమే ఉంటుంది . ..” అని సోషల్‌ మీడియాలో దలైలామా పోస్టు చేశారు . ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా వెంటనే విదేశాంగమంత్రితో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వాదనకు దిగింది . 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. తను తదనంతరం (మరణించిన తర్వాతే) తన వారసుడు వస్తారని దలైలామా స్పష్టం చేశారు. 2015లో ఈ ట్రస్ట్‌ను దలైలామా ఏర్పాటు చేశారు. 2011 సెప్టెంబర్‌ 24నే తాను టిబెట్‌ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్‌ మతపెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు తేటతెల్లం చేసారు .

‘వారసుడి ఎంపిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని అనుసరించాల్సిందేనని మావో నింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ అర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది’ అని మావోనింగ్ అన్నారు. అయితే, మావోనింగ్ దలైలామా వ్యాఖ్యలకు ఇచ్చిన స్పందన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ట్రాన్స్‌క్రిప్ట్‌లో లేకపోవడం గమనార్హం.

లివింగ్ బుద్ధా పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్​లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. ‘దలైలామ కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది. వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు, మత సంప్రదాయాల ఆధారంగా మాత్రమే జరగాలి’ అని ద్వారా ఎక్స్​ ద్వారా వెల్లడించారు.