by Abhi Correspondent | Sep 15, 2025 | జనరల్
ఇంజనీరింగ్ నైపుణ్యంలోనే కాదు . . నైతిక విలువల్లోనూ ఆణిముత్యం విశ్వేశ్వరరావు
2017 ఆగష్టులో జూబ్లీ హిల్ల్స్ పబ్లిక్ స్కూలు విద్యార్థులను ఉద్దేశించి పూజ్య గురువులు చేసిన ప్రసంగములో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ ని గురించిన విశేషములు, శ్రీ విశ్వేశ్వరయ్య గారి జన్మదినము సందర్భముగా…
…ఆ రోజులలో ప్రభుత్వ ఇంజినీర్లు ఎన్నో గ్రామాలలో తిరిగి, వారి నివేదికలు చేతితో వ్రాసి, తయారు చేసి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన పరిస్థితి. ఒకానొక సమయములో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామములో ఒక నివేదిక తయారు చేయటము కొరకు ఆ గ్రామములోని ఒక పెద్ద మనిషి ఇంటిలో బస చేసారు. పగలంతా తిరిగి, అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనము చేసి, రాత్రికి నివేదిక తయారు చెయ్యటానికి ఉద్యుక్తులయ్యారు విశ్వేశ్వరయ్య గారు. ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్తు లేదు. కానీ ఆ నివేదిక వ్రాయటము వాయిదా వేస్తే తాను ఎమైనా మరచిపోతానేమోనని తన సంచీలోనుంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుగులో తన నివేదిక పూర్తి చేసారు వారు.
సహజముగానే పుస్తక పఠనాసక్తులయిన విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పి మరొక కొవ్వొత్తిని వెలిగించి, దాని వెలుగులో తన పుస్తక పఠన చేయసాగారు. ఇది చూచిన ఆ ఇంటి పెద్దాయన విశ్వేశ్వరయ్య గారి వద్దకు వెళ్ళి – “అయ్యా…ఈ రెండు కొవ్వొత్తులు ఏమిటి? ఒక కొవ్వొత్తి ఆర్పి, రెండవ కొవ్వొత్తి కాంతి లో ఎందుకు చదువుతున్నారు?” అని కుతూహలముగా అడిగారు. “నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వము వారు విద్యుత్తు లేనప్పుడు నా ఉద్యోగ ధర్మములో ఉపయోగపడుతుందని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది నా ఉద్యోగము కాదుగా…నాకు ఆసక్తయిన పుస్తక పఠనము. దీనికి వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వ వనరులు దుర్వినియోగ పరచటమవుతుంది కదా…బాధ్యతగల పౌరులుగా మనము అది చేయకూడదు. అందుకే, నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుతా…” అని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు. విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ పెద్దాయన అబ్బురపడ్డారు…
విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ…కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కూడా తరచూ మోక్షగుండం విశ్వేశ్వరరావు గురించి , అయన నైతికత గురించి చెపుతూ ఉంటారు .
by Rama Chandra P | Sep 11, 2025 | జనరల్
నేపాల్: యువత ఆగ్రహం, రాజకీయ అనిశ్చితి
మనం బాగుంటే సరిపోదు . ఇరుగు పొరుగు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి అలజడులు , అశాంతి మన పక్కన ఉన్నా మనకు కూడా మనఃశాంతి కరువవుతుంది . ఇది కుటుంబాలకే కాదు . . దేశాలకు వర్తిస్తుంది .
నేపాల్లో చెలరేగిన యువత నిరసనలు, ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం తక్షణ కారణమైనప్పటికీ, అసలు కారణాలు నిరుద్యోగం, అవినీతి, పాలన వైఫల్యం. ఈ “జెన్-జీ” నిరసనల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య, ఖాట్మండు మేయర్ బలేంద్ర షా ఒక కొత్త నాయకుడిగా ఆవిర్భవించారు.
నేపాల్లో అస్థిరత అంటే, భారత్కు తలనొప్పే. మనకు నేపాల్తో స్వేచ్ఛా సరిహద్దు ఉంది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడితే, ఆ ప్రదేశాన్ని చైనా తన పలుకుబడి పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఇది భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం.
భారతదేశం ఒక సంక్లిష్టమైన, చారిత్రాత్మకమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. అయితే, గడిచిన ఏడాది, రెండేళ్లలో ఈ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. పాకిస్థాన్ నుంచి మాల్దీవుల వరకు, దాదాపు ప్రతి పొరుగు దేశం తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక పతనం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, జాతి ఘర్షణలు మన సరిహద్దుల వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ అల్లకల్లోలం కేవలం వారి అంతర్గత సమస్య మాత్రమే కాదు, భారతదేశ జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.
పాకిస్థాన్: ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, దాని రాజకీయ, భద్రతా పరిస్థితి మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంది. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని రాజకీయంగా పక్కన పెట్టడంతో దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ అస్థిరతే ఉగ్రవాదులకు వరంగా మారింది. ముఖ్యంగా, తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులు తీవ్రమయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలోనే పాకిస్థాన్లో 200లకు పైగా ఉగ్రదాడులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పాకిస్థాన్ అస్థిరత భారత్కు ఎప్పుడూ ముప్పే. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పినట్లు, “పాకిస్థాన్ అనుసరిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధ తంత్రం” భారత్ భద్రతకు రెండో అతిపెద్ద ముప్పు. పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరిగితే, అది కశ్మీర్లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక పతనం అంచున ఉన్న అణ్వస్త్ర దేశం పక్కన ఉండటం, వ్యూహాత్మకంగా భారత్కు పెను సవాలు.
బంగ్లాదేశ్: రాజకీయ శూన్యత, మతతత్వం
ఒకప్పుడు స్థిరంగా కనిపించిన బంగ్లాదేశ్, ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. 2024 “జూలై విప్లవం” తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మే 2025లో, హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. ఈ రాజకీయ శూన్యత భద్రతా వ్యవస్థను బలహీనపరిచింది. ఇదే అదనుగా అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మళ్లీ బలపడుతున్నాయి.
బంగ్లాదేశ్లో మతతత్వ శక్తులు బలపడటం భారత్కు మంచిది కాదు. ఇది పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా సమస్యలను సృష్టిస్తుంది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద నెట్వర్క్లు పునరుజ్జీవం పొందే ప్రమాదం ఉంది. దీనికి తోడు, బంగ్లాదేశ్లోని కాక్స్బజార్లో ఉన్న పది లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థుల సమస్య ఉంది. నిధుల కొరతతో వారి శిబిరాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇది అక్రమ వలసలను, మానవ అక్రమ రవాణాను పెంచుతోంది.
శ్రీలంక: ఆర్థిక పునరుజ్జీవనం, జాతి విభేదాలు
2022లో ఘోరమైన ఆర్థిక పతనం తర్వాత, శ్రీలంక నెమ్మదిగా కోలుకుంటోంది. 2025 నాటికి విదేశీ మారక నిల్వలు 6.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది. కానీ, రాజకీయంగా పరిస్థితి సున్నితంగానే ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) ప్రభుత్వం, తమిళ మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. దీనివల్ల జాతి విభేదాలు చాప కింద నీరులా ఉన్నాయి.
శ్రీలంకలో భారత్కు అతిపెద్ద ఆందోళన చైనా ప్రభావం. ఆర్థిక సహాయం పేరుతో చైనా, శ్రీలంకలో వ్యూహాత్మకంగా పాగా వేస్తోంది. హంబన్తోటలో చైనాకు చెందిన సినోపెక్ నిర్మిస్తున్న 3.7 బిలియన్ డాలర్ల ఆయిల్ రిఫైనరీ, హిందూ మహాసముద్రంలో భారత నౌకా భద్రతకు ప్రత్యక్ష సవాలు.
మాల్దీవులు: చైనా నీడ నుంచి బయటకు..
అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు “ఇండియా ఔట్” ప్రచారంతో అధికారంలోకి వచ్చినప్పుడు, మాల్దీవులు పూర్తిగా చైనా వైపు వెళ్లిపోతుందని భావించారు. కానీ, 2025 మధ్య నాటికి పరిస్థితి అనూహ్యంగా మారింది. జూలై 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన, సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భారత్ సుమారు 560 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని, రక్షణ సహకారాన్ని ప్రకటించింది. ఇది చైనాకు వ్యూహాత్మక చెక్ పెట్టింది.
హిందూ మహాసముద్రంలో మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకమైనవి. అక్కడి ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా మారితే, మన సముద్ర భద్రతకు పెను ముప్పు. ప్రస్తుతం సంబంధాలు మెరుగుపడటం ఒక మంచి పరిణామం, కానీ ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం.
భూటాన్: చైనాతో సరిహద్దు చర్చలు
ప్రశాంతంగా కనిపించే భూటాన్లో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, దానివల్ల “బ్రెయిన్ డ్రెయిన్”. రెండోది, చైనాతో జరుగుతున్న సరిహద్దు చర్చలు. డోక్లాం పీఠభూమికి బదులుగా, ఉత్తరాన ఉన్న కొన్ని లోయలను తీసుకోవాలని చైనా భూటాన్పై ఒత్తిడి తెస్తోంది.
ఈ ప్రభావం అత్యంత తీవ్రమైనది. డోక్లాం పీఠభూమి, భారత్ యొక్క “సిలిగురి కారిడార్” (చికెన్స్ నెక్) భద్రతకు అత్యంత కీలకం. ఒకవేళ డోక్లాం చైనా చేతికి వెళ్తే, ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశంతో ఉన్న కీలకమైన మార్గంపై చైనా నేరుగా నిఘా పెట్టగలదు. ఇది భారతదేశ భద్రతకు పెను ప్రమాదం.
సరిహద్దుల వెంబడి రగులుతున్న ఈ సంక్షోభాలు, భారతదేశ విదేశాంగ, భద్రతా విధాన రూపకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శరణార్థుల ప్రవాహాన్ని నియంత్రించడం, చైనా వ్యూహాత్మక విస్తరణను అడ్డుకోవడం, అదే సమయంలో ఈ దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించడం ఒక కత్తి మీద సాము లాంటిది. రాబోయే కాలంలో, భారత్ మరింత చురుకైన, దృఢమైన, వ్యూహాత్మక విదేశాంగ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
by Rama Chandra P | Aug 31, 2025 | జనరల్
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో చర్చ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ (Shanghai Cooperation Organization) 25వ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. రష్యా, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్న ఈ వేదికపై, అదీ చైనా గడ్డపై మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య నెలకొన్న అపనమ్మకం, అమెరికా వాణిజ్య ఆంక్షలతో మారుతున్న ప్రపంచ సమీకరణాల నడుమ ఈ సదస్సు జరుగుతోంది. అందుకే, యావత్ ప్రపంచం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.
సదస్సు ప్రాధాన్యత, పూర్వాపరాలు
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదేళ్ల పాటు ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరగలేదు. అయితే, గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ (Brazil, Russia, India, China, South Africa)సదస్సులో మోదీ, జిన్పింగ్ సమావేశమవ్వడంతో ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపించాయి. ఈ క్రమంలోనే, ఆగస్టు 2025లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించారు. సరిహద్దు వివాద పరిష్కారానికి కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఈ సానుకూల వాతావరణానికి మరో ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ పరిణామం భారత్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ, ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్కు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ మొగ్గు చూపుతోంది. ఈ సదస్సు ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఒక పరీక్ష లాంటిది.
సదస్సులో భారత్ అజెండా: ఈ సమావేశంలో భారత్ రెండు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
ప్రాంతీయ భద్రత: సరిహద్దు తీవ్రవాదం భారత్కు ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను ఎస్సీఓ వేదికగా గట్టిగా ప్రస్తావించాలని మోదీ భావిస్తున్నారు. సంస్థ ఉగ్రవాద నిరోధక విభాగం RATS (Regional Anti-Terrorist Structure — ఇది ఎస్సీఓ యొక్క శాశ్వత అవయవం, సభ్య దేశాల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సమన్వయాన్ని నిర్వహిస్తుంది.) ద్వారా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని భారత్ డిమాండ్ చేయనుంది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా, వారి నెట్వర్క్లను ఛేదించేందుకు సభ్య దేశాల మధ్య సమన్వయం పెరగాలని కోరనుంది.
వాణిజ్యం, అనుసంధానం: అమెరికా సుంకాల ప్రభావంతో ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్కు అత్యవసరం. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ INSTC – (International North-South Transport Corridor — భారత్, ఇరాన్, రష్యా మరియు యూరప్ను కలిపే బహుమాధ్య రవాణా మార్గాల సమూహం), చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భారత్ ప్రతిపాదించనుంది. ఇవి చైనా ఆధిపత్యంలోని వాణిజ్య మార్గాలకు ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. మధ్య ఆసియా దేశాలతో భారత్కు నేరుగా సంబంధాలు పెంచుతాయి.
భారత్ ముందున్న సవాళ్లు
ఎస్సీఓలో చైనా, రష్యా వంటి దేశాలతో భారత్ వేదిక పంచుకుంటున్నప్పటికీ, అదే సమయంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ కూటమిలోనూ క్రియాశీలకంగా ఉంది. క్వాడ్ (Quadrilateral Security Dialogue — భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా) కూటమి చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికే ఏర్పడిందన్నది బహిరంగ రహస్యం. ఈ సదస్సుకు ముందు మోదీ జపాన్లో పర్యటించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని నొక్కి చెప్పడం గమనార్హం. ఇలా భిన్న ప్రయోజనాలున్న కూటములతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం భారత విదేశాంగ విధానానికి ఒక కత్తి మీద సాము లాంటిది.
మొత్తం మీద, ఈ ఎస్సీఓ సదస్సు భారత్కు ఒక పెద్ద అవకాశం, అదే సమయంలో ఒక సవాలు. తీవ్రవాదం, సమాన వృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై తన గొంతు వినిపించి, ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ చూస్తోంది. టియాంజిన్ సదస్సు ఈ దిశగా భారత్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి కానుంది.
by Abhi Correspondent | Aug 14, 2025 | జనరల్
పూర్ణిమ తణుకు – బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ
” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్స్టిట్యూట్ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్లో సర్జన్గా పని చేస్తున్న డాక్టర్ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్ కంపెనీలో కెరియర్ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్ ట్రస్ట్’కి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”
బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.
బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ (ఎన్డీఎన్ఏ)కు ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్షిప్ అసోసియేషన్. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .
అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్డీఎన్ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (ఓబీఈ)ను కింగ్ చార్లెస్ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)ని చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, నోబెల్ గ్రహీత హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .
by Rama Chandra P | Aug 9, 2025 | జనరల్
రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . ..
ఉక్రెయిన్పై రష్యా దాడికి ప్రతిగా, పాశ్చాత్య దేశాలు మాస్కో ఆదాయాన్ని దెబ్బతీయడానికి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇందులో భాగంగా రష్యా సముద్రమార్గ చమురుపై బ్యారెల్కు $60 ధరల పరిమితిని విధించాయి. అయితే, ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఒక రహస్య మార్గాన్ని ఎంచుకుంది. అదే “షాడో ఫ్లీట్“ (ఎలాంటి పర్మిట్లూ లేని “దొంగ” నౌకలు అనేక మోసపూరిత పద్ధతులను అనుసరిస్తాయి. ఈ నౌకల యజమానులు ఎవరో స్పష్టంగా తెలియకుండా ఉండేందుకు సంక్లిష్టమైన కంపెనీ నిర్మాణాలు, షెల్ కంపెనీలను ఉపయోగిస్తారు. పనామా, లైబీరియా, గాబన్ వంటి దేశాల జెండాలను ఎగురవేస్తాయి. ఈ దేశాలలో నిబంధనలు చాలా సరళంగా ఉండటంతో, నౌకల తనిఖీ, భద్రతా ప్రమాణాల నుంచి తప్పించుకోవడం సులభం. ఈ నౌకలకు సరైన భీమా ఉండదు. పాశ్చాత్య భీమా కంపెనీలు ఆంక్షల కారణంగా సేవలు అందించవు. దీంతో, ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే నాథుడు ఉండడు. ఈ నౌకాదళంలోని చాలా ట్యాంకర్లు 15-20 ఏళ్లకు పైబడినవి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. తమ కదలికలను దాచిపెట్టడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాన్స్పాండర్లను ఆపివేస్తాయి. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును మార్చేసి చమురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చేస్తాయి.వందలాది పాత చమురు ట్యాంకర్లతో కూడిన ఈ రహస్య నెట్వర్క్ ద్వారా తన చమురును, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు అమ్ముతూ ప్రపంచ ఇంధన మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.
ఈ క్రమం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తోంది.
పాశ్చాత్య దేశాలు రష్యా చమురును బహిష్కరించడంతో, భారత్, చైనాలు అతిపెద్ద కొనుగోలుదారులుగా అవతరించాయి. ముఖ్యంగా, యుద్ధానికి ముందు రష్యా నుంచి నామమాత్రంగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఆంక్షల తర్వాత తన దిగుమతులను భారీగా పెంచుకుంది. రష్యా అందించిన తగ్గింపు ధరలను అందిపుచ్చుకుని, తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడుకుంటున్నామని భారత్ వాదిస్తోంది.
రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సంస్థలు చౌక చమురును శుద్ధి చేసి, పెట్రోలియం ఉత్పత్తులను అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలకే ఎగుమతి చేశాయి. ప్రభుత్వం కూడా ఈ లాభాలపై “విండ్ఫాల్” పన్నుల రూపంలో ఆదాయం పొందింది. అయితే, ఈ ప్రయోజనాలు దేశీయ వినియోగదారులకు చేరలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.
ఈ నీడల నౌకాదళం సముద్ర పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాత నౌకలు, సరైన నిర్వహణ లేకపోవడం, భీమా సౌకర్యం కొరవడటంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.రెండు “దొంగ” నౌకలు నల్ల సముద్రంలో డిసెంబర్ 2024 న తుఫానులో చిక్కుకుని ముక్కలవ్వడంతో భారీగా చమురు సముద్రంలో కలిసి, తీవ్ర పర్యావరణ నష్టం జరిగింది.
2024 మార్చి లో రష్యా నుంచి భారత్కు వస్తున్న ‘ఇన్నోవా’ అనే ట్యాంకర్ స్కాట్లాండ్ తీరంలో 23 కిలోమీటర్ల పొడవున చమురును కక్కేసింది.
2024 ఫిబ్రవరిలో ఇటలీ తీరంలో ‘అరుణా గుల్కే’ అనే నౌక 47 కిలోమీటర్ల మేర చమురును చిమ్మింది.
మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు
రష్యా చమురు వాణిజ్యం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా, భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇది దశాబ్దాలుగా బలపడుతున్న ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీలుస్తున్నాయని, డాలర్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ బ్రిక్స్ పే (BRICS Pay) వంటి ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు .
by Rama Chandra P | Aug 8, 2025 | జనరల్
మొండి – జగమొండి రకం వీరిద్దరూ . …
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత ఒకరు . . మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు. ఒకరు నరేంద్ర మోదీ. ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్. వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండవచ్చు. వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు. కానీ వారిద్దరినీ ఒకే గాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలన శైలి అచుగుద్దినట్లు అనిపిస్తుంది.
మోదీ, ట్రంప్ ఇద్దరూ రాజకీయాల్లోకి ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు. అప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు. తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని, ప్రజల పక్షాన పోరాడటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు.
వాషింగ్టన్లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలోని “ల్యూటెన్స్ మీడియా, మేధావుల వర్గాన్ని” మోదీ లక్ష్యం చేసుకున్నారు. (దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ “ల్యూటెన్స్” రూపొందించారు. ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన, చెట్లతో కప్పబడిన అవెన్యూలు, గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలతో వుంటుంది. ఈ ప్రాంతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులకు ప్రసిద్ధి చెందింది. ప్రజలతో సంబందంలేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు.) ప్రజల భాషలో మాట్లాడుతూ, వారి భావోద్వేగాలను స్పృశిస్తూ సామాన్యులకు చేరువయ్యారు.
ఈ పాలకులు ఇద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని తట్టిలేపారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటూనే మోదీ ఒక “నవ భారత” నిర్మాణం గురించి మాట్లాడారు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడటానికే తాము ఉన్నామని ప్రజలను నమ్మించారు. ఈ జాతీయవాద నినాదాలు వారి మద్దతుదారులను ఏకం చేశాయి. వారిని గుడ్డిగా ఆరాధించే భక్త గణాన్ని తయారుచేశాయి.
మెయిన్ స్ట్రీమ్ మీడియాపై దాడి చేయడం వారిద్దరి రాజకీయ వ్యూహంలో మరో కీలక భాగం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను, చానెళ్లను ట్రంప్ “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేశారు. మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను “ప్రెస్టిట్యూట్స్” అని, (డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తిపరమైన నిజాయితీని, నైతికతను అమ్ముకుని, వార్తలు రాసే పత్రికలను, మీడియా సంస్థలను, లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదం ఇది.) “దేశద్రోహులు” అని ముద్ర వేశారు. మీడియాను బలహీనపరిచి, తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరూ సఫలమయ్యారు. దీనివల్ల తమ చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించుకున్నారు. విమర్శలు ఆ కోట గోడలను తాకలేకపోయాయి.
వ్యక్తి ఆరాధన.. ఇద్దరి పాలనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలైనా, దేశ విజయాలైనా అన్నీ తమ ఘనతగానే ప్రచారం చేసుకున్నారు. తామే దేశానికి రక్షకులమని, తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుకున్నారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి. మంత్రులు, అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది.
ఆర్థిక రంగంలోనూ వారి విధానాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేశీయ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే, మోదీ “మేక్ ఇన్ ఇండియా” అంటూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించారు. వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా, తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది.
ఈ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ, దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ఇది. ప్రజల ఆకాంక్షలను, వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుని, దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది. అందుకే మోదీ, ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా, వారి రాజకీయ పంథా మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది. మీకు కూడా ఓననిపిస్తుందా ?