ఒకసారి నాటితే . .. మూడుసార్లు కోసుకోవచ్చు . . దేశీయ వెరైటీ
తులసి బాసో ….. ఇది ఒక సంప్రదాయ వరి రకం. రామాయణ కాలం నుంచీ ఈ వరి భారతదేశంలో సాగుచేశారని చెపుతారు .
ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఈ అరుదైన వరి రకాన్ని సాగుచేస్తున్నారు . ఒకసారి నాట్లు వేసుకుంటే మూడుసార్లు పంట తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొంతమంది రైతులు ఇలాంటి అరుదైన దేశీయ వంగడాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు. వీరు మన సాంప్రదాయ విత్తనాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పాలి .
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆర్గానిక్ మేళాలలో లేదా విత్తన మేళాలలో కలుసుకొని అరుదైన వరి వంగడాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి ఈ అరుదైన వరి వంగడాన్ని అలాంటి రైతుల వద్ద సేకరించి, ఇప్పుడు ఒక ఎకరా తులసి బాసో పంట వేసినట్లు చెప్పారు .
తులసి బాసో పరిమళభరితమైన వరి రకం. “తులసి లాంటి సువాసన గల బియ్యం” అని అర్థం. అంటే సెంటెడ్ రకం. బాస్మతి లాగా మంచి సువాసన వస్తుంది. చిట్టి ముత్యాలులాగా చాలా చిన్న గింజ. తినడానికి చాలా మధురంగా ఉంటూ, ఎంత తిన్నా వెగటు అనిపించదు. భుక్తాయాసం రాదు.ఎక్కువ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బియ్యంగా గుర్తించబడింది. చిన్నపిల్లల ఎదుగుదలకు కావలసిన మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్న బియ్యం. దేవాలయాలలో ప్రసాదాలకు, పాయసాలకు చాలా అనువైన రకం. రోజువారి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉండటం వలన ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా చెప్తారు. ముడి బియ్యంగా తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
తులసి బాసో పంట కాలం 135 రోజులు. ఖరీఫ్ కి మాత్రమే అనువైన రకం అంటే రోహిణి కార్తెలో వేసుకోగలిగితే మొదటి పంట 135 రోజులకి వస్తుంది. తరువాత 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మూడో పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సహజంగా ప్రధాన పంటను కోసిన తర్వాత రెండవసారి మూడోసారి కోసినప్పుడు గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ దీని గింజ పరిమాణం తగ్గదు. సువాసన, పరిమళం పెరుగుతుంది. మొదటి కోతకి, రెండవ కోతకి సువాసన పెరుగుతుంది. రెండవ కోతతో పోల్చుకుంటే మూడోసారి కోతకు వచ్చినప్పుడు అందులో సువాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులు విత్తనానికి వినియోగపరిచేటువంటి వాళ్ళు మొదటి కోతలో ఉన్న పంటను మాత్రమే విత్తనానికి వినియోగించాలి.
రెండవ పంట మూడో పంట విత్తనానికి వినియోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి పూర్తిస్థాయిలో మనం చూస్తే 135 రోజుల తర్వాత ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల్ వస్తుంది. రెండవ కోతకి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది. మూడవకోతకి ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనిని పండించవచ్చు. పంట ఒరగదు. ఎంతటి గాలులకైనా తట్టుకొని నిలబడుతుంది. తుఫాన్లు సైతం తట్టుకొని నిలబడి ఉండే రకం. అన్ని ప్రాంతాల వారు ఈ రకాన్ని పండించుకోవచ్చు.
ఇలాంటి అరుదైన వరి రకాలు సేకరించి,పండిస్తున్న అభ్యుదయ రైతు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డిని ప్రక్రుతి సాగు రైతులే కాదు . .. అందరూ అభినందించాల్సిందే .
విత్తనాల కొరకు ఈ రైతును మీరు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తూ పండించే విధానం, రైతులకు వివరిస్తారు. ఈ రైతుని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6300027502, 9440809364



