ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్స్ లోకి వెళుతుంటే . .. జగన్ హయాంలో వైసీపీ సర్కార్ మద్యం అమ్మకాలను నగదు రూపంలోకి తీసుకువచ్చినపుడే జనంలో లిక్కర్ స్కాం పై అనుమానాలు రేకెత్తాయి . …
వైఎస్సార్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు మద్యం మాఫియా సాగించిన అరాచకాలు, అకృత్యాలు తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు . నియంతృత్వ ప్రభుత్వాలు, అప్పటి రాజులు కూడా దిగదుడుపే. తమ మాట వినకపోతే మార్కెట్లో ఎంతో పేరున్న మద్యం బ్రాండ్లకూ ఆర్డర్లు లేకుండా చేశారు. సామ దాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఐదేళ్లపాటు అందిన మేర కొల్లగొట్టారు. కమీషన్ల వసూలులో రాజ్ కెసిరెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించినట్లు తేలింది.
ఫ్యాక్షనిజ0తో బెదిరింపులు : మద్యం కుంభకోణంలో సిట్ అధికారులకు సైతం విస్తుగొలిపే అరాచకాలు బయటకొస్తున్నాయి. ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం నడిపించారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంత రెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మాఫియా మొత్తాన్ని రాజ్ కెసిరెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి కలిసి నడిపించారనేందుకు ఇదీ ఒక నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
నంద్యాలలో ఉన్న ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్రెడ్డి, శరత్చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ ఛాంబర్స్ లిమిటెడ్, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో సొమ్ములు మళ్లించారు. ఇలా 30 కోట్లను శిష్ట్లా శ్రీనివాస్కు చెందిన శాన్హోక్ ల్యాబ్స్కు బదిలీ చేసారు . దీన్ని డికార్ట్ లాజిస్టిక్స్లోకి పంపారు. అనంతరం ఈ సొమ్మును ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీకి డికార్ట్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించింది. నిధుల లావాదేవీల వివరాలను విచారణ బృందాలు సేకరించాయి. ఎస్పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్రెడ్డి, శరత్చంద్రారెడ్డి అనంతరం వీటిని డికార్ట్ లాజిస్టిక్స్లోకి మళ్లించారు.
పొరుగు రాష్ట్రాల కంపెనీలకు బెదిరింపులు
తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్, ప్రొడక్ట్స్ లిమిటెడ్కు చెందిన జయ మురుగున్, మాతప్పన్ను వాట్సప్, ఫేస్బుక్ ద్వారా ప్రకాశ్, రాజశేఖర్రెడ్డి సంప్రదించారు. విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డికి దగ్గరి వాళ్లమని పరిచయం చేసుకుంటూ, మద్యం అమ్మకాలకు సంబంధించి లంచాలు చెల్లించాలని లేదంటే పరిశ్రమను సబ్లీజ్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. వారు తిరస్కరించడంతో 2019 సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన 16 కోట్ల చెల్లింపులను ఆపేశారు. కమీషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీ, బీవీఎస్ డిస్టిలరీ, ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వాటికి ఆర్డర్లు తగ్గించారు. అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారు. లిక్కర్ వ్యవహారంలో తమ ఆదేశాలు కాదని వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు . దీంతో కంపెనీల యజ్నమ్యాలు సైతం భయకంపితులై వీరి చెప్పుచేతల్లోకి వచ్చారు .



