హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గించడానికి మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. త్వరలో ఇది పూర్తికానుంది .
ఆంధ్ర-తెలంగాణలను కలుపుతూ కేంద్రం నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే 365-BG ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తవ్వాల్సి ఉన్నా భూ సేకరణలో జాప్యం, అధిక వర్షాలతో నిర్మాణం పూర్తి కాలేదు. ఖమ్మం-దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తోన్న ఈ రహదారి మిగతా వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చని పొలాల మధ్యలోంచి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ – విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రయ్ రయ్ మంటూ దూసుకెళ్లవచ్చు.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖ మధ్య దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు 12 గంటలపాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నూతన రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు.



