”కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని నేను చేయను, ఎవరినీ చేయనివ్వను . .. ” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ”దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుంది . ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు . ..” సీఎం చంద్రబాబు ధీమాగా చెప్పారు .
అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

‘వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చి భూములిచ్చారు. భూ త్యాగాలు చేసిన రైతులకు గత 5ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశాను. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడు. తప్పు చేసిన వారికి ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు . .. ‘ ఎన్నో అనుభవాలు చూశాను. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం చేపట్టా. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాను. వేంకటేశ్వరస్వామి దయతో అమరావతికి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి . . ‘– ఎన్ . చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి
రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకార నిర్మాణం : మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.



