మోదీ-లోకేష్ బంధం.. వ్యూహం ఏమిటి ?

Rama Chandra P

నారా లోకేష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం, ఆత్మీయతల వెనుక కారణం ఏమై ఉండొచ్చు . దీని వెనుక విస్తృతమైన వ్యూహం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ఏ మేరకు వాస్తవికతకు తగ్గారగా ఉంది . . మిత్రపక్షాల్లో తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించడం ద్వారా కూటమిని బలోపేతం చేసుకోవడం దీని లక్ష్యం. ఈ నమూనాకు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ ఒక ఉదాహరణ. ఆయన మోదీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు. ప్రధాని పాదాలకు నమస్కరించారు. బదులుగా మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఫలితంగా చిరాగ్‌కు కీలకమైన కేంద్ర మంత్రి పదవి లభించింది. ఆయన పార్టీకి 5 ఎంపీలు ఉన్నారు.

మరోవైపు రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించారు. దీంతో జయంత్ ఎన్డీఏకు మద్దతు పలికారు. ఆయన పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇది రాజకీయ వారసత్వాలను గౌరవిస్తూ, వారిని కలుపుకుపోయే ఎత్తుగడ.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కును అందుకోలేకపోయింది. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పలేదు. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ కూటమిలో రెండో అతిపెద్ద పక్షంగా అవతరించింది. ఈ పరిణామం వల్ల చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో (మరోసారి) కింగ్‌మేకర్‌ అయ్యారు. ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీడీపీతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం బీజేపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ భవిష్యత్ నాయకుడైన లోకేష్‌కు మోదీ అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు.

లోకేష్ తన రాజకీయ బ్రాండ్‌ను సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణపై నిర్మించుకున్నారు. విశాఖపట్నంలో ₹1500 కోట్లతో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల కోసం లండన్, సింగపూర్ వంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించారు. ఆయన అభివృద్ధి మంత్రం, మోదీ ‘వికసిత భారత్’ ఆశయానికి దగ్గరగా ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను “డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్” అని లోకేష్ అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను బహిరంగంగా ప్రశంసించారు. ఈ విధేయత, విధాన సారూప్యత మోదీకి నచ్చింది. అందుకే కర్నూలు సభలో లోకేష్ దూరంగా నిలబడితే, “ఇక్కడికి రా” అని ఆత్మీయంగా పిలిచారు. ఈ బహిరంగ ఆమోదం లోకేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలున్న టీడీపీ అత్యంత కీలకం. అందుకే లోకేష్‌కు ప్రాధాన్యం ఎక్కువ. చిరాగ్ బంధం వ్యక్తిగత విధేయతపై ఆధారపడితే, లోకేష్‌తో బంధం విధానాల ఏకీభావనపై కూడా నిలిచింది.లోకేష్‌ను ప్రశంసించడం ద్వారా, అభివృద్ధి రాజకీయాలు చేసే వారసులకు తన మద్దతు ఉంటుందని మోదీ ఇతర ప్రాంతీయ పార్టీలకు సందేశం పంపుతున్నారు. ఇది సంకీర్ణ రాజకీయాల కొత్త నమూనా. వ్యక్తిగత ఆభిమానం వెనుక పక్కా రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

మోదీ-లోకేష్ బంధం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలున్నాయి. ఇది ఒక సహజీవన సంబంధం. ప్రభుత్వ స్థిరత్వం కోసం మోదీకి లోకేష్ అవసరం. జాతీయ స్థాయిలో గుర్తింపు, కేంద్రం మద్దతు కోసం లోకేష్‌కు మోదీ ఆశీస్సులు అవసరం. లోకేష్ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చనే సంకేతాలను ప్రధాని పరోక్షంగా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పుత్రోత్సాహానికి మించిన విజయం ఏ తండ్రకీ వుండదు. మోదీ అపురూపమైన ఈ మానవ సంబందపు ఆనందాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారు, మోడీ చేస్తున్న ఈ లాజిక్కు గురించి ఎవరు ఏమి చర్చుకున్నా … దేశరాజకీయ పరిస్తుతులలో పెను మార్పునకు కారణం అవుతుందా > అనేదానిపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి .

You May Also Like…