ఆమె సక్సెస్ .. అచ్చమ్ సినిమా లాంటి స్టోరీ…

Abhi Correspondent

July 15, 2025

వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో వేలమంది ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. కొన్నివేల మంది చేస్తున్నారు. అయితే ఒకామె ఈ కంపెనీలోని కెరీర్ ప్రారంభించి . .. ఇదే కంపీనీ సిఈవో స్థాయికి ఎదిగారు .  ఆ కంపెనీలో 30 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె.. ఎన్నో ఆటుపోట్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు..

ప్రియా నాయర్. చిన్న ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి ఎదిగిన ప్రియా నాయర్ సక్సెస్‌ నేటి తరానికి ఎంతో ఆదర్శవంతం. అనుచరణీయం . ..

 ఆమె ప్రతీ అడుగులో అంకితభావం, ఎదురైన ప్రతీ సవాలును స్ఫూర్తిగా మలుచుకున్న ధైర్యం, ఆమె హృదయంలోని అచంచలమైన సంకల్పం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆమె విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు.. అకుంఠిత దీక్షతో శ్రమించే వారికి మార్గదర్శనం . ..

 కంపెనీ వస్తువులను.. సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. ప్రియా నాయర్ మెదడులో వచ్చిన ఆలోచన ఆమెను సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా నిలిపింది. 2014లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. పైగా కోతలు ఎక్కువ. ఇక ఇంటర్నెట్ అంటే చాలా మందికి పరిచయమే లేదు. టీవీలు ఉన్నా.. చాలా గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. 1933లో ప్రారంభించిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అయితే అప్పటికే దేశంలోనే మంచి పేరున్న ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థగా కొనసాగుతోంది. ఇక ఈ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు కొనేవారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారే . దీంతో సంస్థ తీసుకువచ్చిన కొత్త ఉత్పత్తులను వారికి పరిచయం చేయడం ఎలా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కొత్త సీఈఓ అండ్ ఎండీగా నియమితులైన ప్రియా నాయర్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ సంస్థ 92 సంవత్సరాల చరిత్రలో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ ప్రియా నాయర్ కావడం విశేషం. 1995లో హెచ్‌యూఎల్‌లో చేరిన ప్రియా నాయర్.. ఇప్పుడు సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సంస్థలోని హోమ్ కేర్, బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్, పర్సనల్ కేర్ డిపార్ట్‌మెంట్‌లలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అనేక కీలక పాత్రలు పోషించారు. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. ఆ సంస్థకు చెందిన బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సీఎంఓగా ఆమె గ్లోబల్ బ్రాండ్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. హెచ్‌యూఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె లండన్‌లో నివసించేవారు.  వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించడం, నీటిని తక్కువగా ఉపయోగించుకోవడం సహా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేందుకు అనుగుణంగా తమ కంపెనీ ఉత్పత్తులను ప్రియా తీసుకొచ్చారు.

”ప్రియా నాయర్ మనసుతో ఆలోచిస్తారు . ఎందుకంటే ఆమె ప్రచారం చేసిన బ్రాండ్‌లు అన్నీ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించేలా చూడటం ఆమె అలవాటు . …” అని సంస్థలో ఆమె గురించి బాగా తెలిసిన ఉన్నతోద్యోగులు చెపుతూ ఉంటారు . కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఈ మాటను అంగీకరిస్తారు .

You May Also Like…