అప్పుల ఊబిలో అగ్రరాజ్యం.. ఏటా వడ్డీలకే ట్రిలియన్ డాలర్ల ఖర్చు
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలోని ప్రధాన దేశాలు బలహీనపడటంతో ప్రపంచంలోనే ఆర్థికంగా సైనికంగా తిరుగులేని అగ్రరాజ్యంగా ఆవిర్భవించే అవకాశం అమెరికాకు దక్కింది. ఆ తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సోవియట్ యూనియన్ నుంచి రాజకీయంగా సైనిక ఆయుధశక్తిపరంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నా అంతిమంగా గెలిచింది అమెరికానే. సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక అమెరికా ఏకైక అగ్రదేశంగా నిలిచి ప్రపంచదేశాలను అన్నివిధాలుగా శాసిస్తూ వచ్చింది. అయితే ఈ వైభవం ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలు కొంతకాలంగా ఆర్థిక రంగంలోని నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. విశ్వవాణిజ్యంలో ఇప్పటిదాకా ప్రధాన కరెన్సీగా ఆమెరికా డాలర్ చలామణిలో ఉంది. బంగారం వంటి విలువైన లోహాల నుంచి ముడి చమురు వ్యాపారం దాకా అత్యధిక శాతం మారకం డాలర్లలోనే సాగుతోంది. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో మారే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా చైనా దేశం నుంచి అమెరికాకు ఎదురవుతున్న పోటీయేనని చెప్పుకోవాలి. చైనాకు అమెరికా మధ్య సాగుతున్న ఆర్థిక పోటీ, వ్యూహాత్మక వేడి, డాలర్పై ఆధిపత్యాన్ని తగ్గించాలన్న చైనాకి ఉన్న ప్రణాళికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ప్రపంచ తయారీ రంగంపై పెరిగిన చైనా ఆధిపత్యం..
ప్రపంచ తయారీ రంగంలో గడచిన రెండున్నర దశాబ్దాలుగా చైనా శరవేగంగా దూసుకెళుతోంది. 2023 నాటికి గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్లో చైనాకి ఉన్న వాటా దాదాపు 28.8 శాతంగా ఉంది, ఇది పెద్దన్న అమెరికా (15.5%) కంటే ఇంచుమించు రెట్టింపు. రెండు దశాబ్దాల క్రితం ఇది కేవలం 8 శాతం మాత్రమే. చైనా తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో పెరిగిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. చైనా దూకుడు ఉత్పత్తి రంగంతో మాత్రమే ఆగలేదు. ‘Made in China 2025’ వంటి ప్రణాళికలతో దేశీయ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన సాంకేతిక రంగంలో సైతం ఆధిపత్యాన్నిసాధించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా టెక్ జెయింట్లు వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి తయారు చేసిన చాట్ జీపీటీ వంటి అద్భుత సాంకేతిక సాధనాలకు పోటీగా తక్కువ వ్యయంతోనే డీప్సీక్ వంటి డిజిటల్ ఉత్పత్తులతో ఆ రంగంలోనూ అమెరికాకు సవాల్ విసురుతోంది.
టెక్నాలజీ, పరిశోధనలో గణనీయ పెట్టుబడులు
చైనా తన జాతీయ ఆదాయంలో 2.6 శాతానికి పైగా నిధులను పరిశోధన & అభివృద్ధి రంగానికి ఖర్చు చేస్తోంది. 2024లో ఈ ఖర్చు దాదాపు $70 బిలియన్లకు చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, చిప్ తయారీ వంటి కీలక రంగాల్లో చైనా స్వావలంబన వైపు వేగంగా కదులుతోంది. ఇది తన ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు అనే భయం అమెరికాలో నెలకొంది. అందుకే అక్కడ నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షలు పెడుతోంది.
డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ?
చైనా పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో అమెరికన్ డాలర్కు బదులుగా, తమ కరెన్సీ అయిన రెమ్మిన్బి (యువాన్)లో లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తోంది. 2024 నాటికి ట్రేడ్ ఫైనాన్స్లో రెమ్మిన్బి వాడకం స్విఫ్ట్ డేటా ప్రకారం రెండో స్థానానికి చేరింది. ఇది డాలర్ ఆధిపత్యానికి గండికొట్టే దిశగా బలమైన అడుగుగా పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇప్పటికే చైనా ఎదిగింది. అమెరిక సహా అనేక దేశాలతో వాణిజ్యంలో చైనాకు మిగులు ఆదాయం ఉంది. అంటే ఆయా దేశాలనుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువ కంటే చైనా ఎగుమతి చేసేవాటి విలువ ఎంతో ఎక్కువ. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాలు కూడా అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.
అమెరికా రక్షణాత్మక చర్యలు
చైనా సహా ఇతర దేశాలు సాధిస్తున్న వృద్ధి తనకు ప్రతికూలంగా మారుతున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు పలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటోంది. చైనా టెక్ సంస్థలపై ఆంక్షలు, హై-ఎండ్ చిప్స్ ఎగుమతులకు అడ్డుపడే విధంగా చర్యలు, మిత్ర దేశాల్లో చైనా దూకుడును తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక స్థానికంగా తయారీని ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అమెరికా చేస్తోంది. కానీ ఆ దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంతో అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
అమెరికాను భయపెడుతున్న అప్పులు
అగ్రరాజ్యం అమెరికాకు అప్పులు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అవి సుమారు 37 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏటా అమెరికా వీటిపై కడుతున్న వడ్డీనే ఏటా 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారింది. అమెరికాతో వాణిజ్య మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని చైనా తిరిగి ఆదేశంలోనే బాండ్లలో పెట్టుబడి పెడుతూ వచ్చింది. పదేళ్లక్రితం ఈ పెట్టుబడులు దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. ఆ తరువాత అమెరికాలో అత్యధిక పెట్టుబడులు ఉన్న దేశాలుగా జపాన్, యూకే ఉండేవి. అయితే ఈ దశాబ్ద కాలంలో చైనా అమెరికా బాండ్లలో తన పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం అవి 785 ట్రిలియన్ డాలర్లకు తగ్గడంతో చైనా అమెరికా పెట్టుబడుల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఒకరకంగా ఇది అమెరికా డాలర్పై వత్తిడి పెంచేందుకు చైనా అనుసరించిన వ్యూహాత్మక విధానమేనని చెప్పాలి. ఆర్థికంగా బలంగా ఉన్న చైనా తన పెట్టుబడులు ఉపసంహరించుంటే అమెరికాకు రుణ సేకరణ భారమవుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆంక్షలంటూ చైనా సహా పలు దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేస్తున్న విన్యాసాల వెనుక నేపథ్యమిదే.
కమ్యూనిస్టు దేశం కావడమే చైనాకు అడ్డంకి..
అయితే ఇప్పటికిప్పుడు చైనా పూర్తిగా అమెరికా స్థానాన్ని సొంతం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ చైనా కొన్ని సరళ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నా మౌళికంగా కమ్యూనిస్టు దేశం. ఇంకా పర్-క్యాపిటా ఆదాయం, బహుళరాజకీయ విధానాలు, ఫైనాన్షియల్ వ్యవస్థలు వంటి విషయాల్లోనూ అమెరికాతో పోలిస్తే చైనా వెనుకబడి ఉంది. అయితే దీర్ఘకాలంలో చూసినప్పుడు, చైనా ముందస్తు ప్రణాళికలతో, క్రమంగా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విషయం కాదనలేని వాస్తవం.



