బాంబులా పేలిన జన మనోగతం
సాక్షిటివిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జర్నలిస్ట్ ని అని చెప్పుకునే కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలపై నమోదైన కేసులో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా జైలు కి వెళ్లిన కొమ్మినేని శ్రీనివాసరావు కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన జనం నోళ్ళ నుంచి తప్పించుకోలేరు . ..
మీడియామీద సామాన్యుల్లో జనరల్ గా వున్న కోపం, జగన్ అప్రజాస్వామిక, కక్షసాధింపు, నియంతృత్వాల మీదా, ఓడిపోయాక కూడా రాజధాని అమరావతిని వ్యతిరేకించి ద్వేషాన్ని వెళ్లగక్కే పైశాచికత్వాల మీద మధ్యతరగతి విద్యావంతుల్లో వున్న ఆగ్రహం- కృష్ణంరాజు మాటలతో బాంబులా పేలింది. ఇది కృష్ణంరాజుకు , కొమ్మినేని శ్రీనివాస్ కో నష్టం తెచ్చే అంశంకాకపోవచ్చు . కృష్ణంరాజు అంతగా తెలియని వ్యక్తి . ఈ ఎఫెక్ట్ జగన్ పైనా , అయన పార్టీ YSRCP పైనా … తీవ్ర ప్రభావం పడుతోంది .
మురికి వ్యాఖ్యలను నివారించగలిగి వుండి కూడా, కృష్ణంరాజుపై సోషల్ మీడియా ట్రోలింగ్ పెరిగిపోతుందని తెలిసి కూడా, ఆమేరకు హెచ్చరించి ఓ నవ్వు నవ్వేసి మౌనం పాటించిన కెఎస్ఆర్ దొరికిపోయారు. రిమాండ్ కు పంపడం శిక్షకాదు. ఆయన నేరంచేశాడు కాబట్టి శిక్షింపచేయడానికి మొదలైన పోలీసు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే!
ఏ పార్టీ అధికారంలో వున్నా పోలీసు చర్య వెనుక రాజకీయ నిర్ణయాలే వుంటాయనేది కాదనలేని విషయం . పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పరిణతి మన సమాజానికి ఇంకా వచ్చినట్లు లేదు .
ఎమో షన్స్ ను రెచ్చగొట్టడంలో న్యూస్ టివిల పాత్ర అంతా ఇంతా కాదు. వార్తలకోసం సమాచారం కోసం 30 శాతం మంది వార్తా పత్రికలు చదువుతున్నారు. 65-70 శాతం వరకూ ప్రజలు న్యూస్ టివిలను చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత దశలో పేపర్లు చదివేవారు, టివిలు చూసేవారూ కలిసి 40 శాతం మందివరకూ యూ ట్యూబ్ చానళ్ళను, న్యూ యాప్ లనూ చూస్తున్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
పాఠకుల కంటే ప్రేక్షకులే ఎక్కువ మంది వున్న ఈ పరిస్ధితుల్లో టివిలు రేటింగ్ కోసం ఎమోషన్లను రెచ్చగొట్టి వార్తల్ని కల్తీ చేయడంలో మునిగిపోయాయి.
ఇతర టివిలు కనీసం కొంత తటస్ధతను నటిస్తున్నా సాక్షి టివి పూర్తిగా ఏకపక్ష0గానే వ్యవహరిస్తోంది . వాళ్ళు పెట్టుకున్నదే అందుకు . టివిల్లో డిబేట్లు, పానల్ డిస్కషన్లకు మరో పార్టీవారిని పిలవడం మానేశారు. ఈ ధోరణి కి కెఎస్ఆర్ కేంద్రబిందువు అయ్యారు. ఇతర టివిలు కూడా జగన్ వార్టీని వెలివేశాయి. ఈ బాధ్యత జగన్ దే తప్ప కెఎస్ఆర్ ది కాదు. అయినా సీనియర్ హోదాలో తప్పొప్పుల్ని ఆయనే మోయక తప్పలేదు.
ఏకపక్ష టివిలో డిబేట్ ని బ్యాలెన్స్ చేసే కెఎస్ఆర్ ను చూసిచూసి విసుగొచ్చేది. చివరికి నటనాత్మకమైన బేలెన్స్ చేయడంలో కూడా విఫలమైపోయారు. ఆయన జైలుకి వెళ్ళే వరకూ దారితీసిన పరిస్ధితులను గుర్తుచేసుకుంటే అమరావతి పై వ్యాఖ్యలు కేవలం ట్రిగ్రర్ నొక్కడం మాత్రమేనని అర్ధమైపోతుంది.
ఈ కేసులో చట్టం, న్యాయం ఒక ఫ్రేములో తమపని తాము చేసుకుపోతాయి. అది ధర్మబద్ధంగా లేకపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినపుడు తమ ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) మేరకు ప్రతిస్పందిస్తారు. ప్రజల నిర్ణయాలు, రాగద్వేషాలు వారి ఇంగిత జ్ఞానం నుంచే వస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం కంటే ఇంగితజ్ఞానమే బలీయమైనది.



