రాజకీయ నిర్ణయాలలో చంద్రబాబు తటపటాయింపులతో నష్టం – సీనియర్లను పక్కనపెట్టాలి
యువగళం పాదయాత్ర ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న నేత నారా లోకేష్. అంచలంచలుగా రాజకీయంగా తన సామర్ధ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాటుదేలారు లోకేష్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఈ మహానాడులోనే పట్టంకడతారని అంతా భావించారు . అయితే చంద్రబాబు ప్రతీ విషయంన్నీ పదేపదే ఆలోచిస్తారు. దీనివల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుంటుంది . పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో సైతం సీనియర్లు నూరిపోసి భయ0తో చంద్రబాబు వెనకడుగువేసినట్లు కనిపిస్తోంది .
మహానాడులో లోకేష్ సత్తా . …
మహానాడులో లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నిర్వహించగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో లోకేశ్ ప్రసంగాన్ని గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమైంది . ఎన్టీఆర్ ఉన్నప్పుడు నంబర్ 2గా ఉన్న చంద్రబాబును కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేశారు. ఆయనపై నిత్యం ఆరోపణలు చేసేవారు. చివరికి చర్మ సంబంధమైన సమస్య వచ్చి చికిత్స తీసుకున్నప్పుడు కూడా అవమానించారు. అయితే లోకేశ్కు ఎదురైనన్ని అవమానాలు చంద్రబాబుకు ఎదురవలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు చంద్రబాబు వెరవకుండా కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ఎన్టీఆర్కు వారసుడిగా నిలిచారు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు, ఆ తర్వాత సురక్షితమైన కుప్పం నియోజకవర్గానికి మారారు. లోకేశ్ అలా చేయలేదు. సంక్లిష్టమైన మంగళగిరి నుంచి మొట్టమొదటిసారి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఉండాల్సింది కాదు అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, మంగళగిరిలో 1983 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు పర్యాయాలు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ లోకేశ్ మరో సురక్షిత నియోజకవర్గం వెతుక్కోకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా పట్టుదల ప్రదర్శించి గత ఎన్నికల్లో తాను ఓడిన మంగళగిరి నుంచే 91 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆయనలోని ధైర్యానికి, పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడులో లోకేశ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేశ్ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేశ్ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురైన చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో లోకేశ్ పట్టుదలతో కృషి చేశారు. దీంతో ఆయనపై కార్యకర్తల్లో భరోసా ఏర్పడింది. ఇప్పుడు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందడమే లోకేశ్ ముందున్న కర్తవ్యం. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, అంటే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజామోదం పొందే ప్రయత్నాలను ఆయన ఇప్పటికే మొదలెట్టారు.
మోదీ సలహ . .. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లోకేశ్ కలుసుకోవడం, ప్రధాని వారితో రెండు గంటలపాటు గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్కు కొన్ని సూచనలు చేయడంతో పాటు ఆయనలో తాను గమనించిన మార్పు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మీలో పరిణతి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మీ ప్రసంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారు’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో చంద్రబాబు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా లోకేశ్కు ప్రధాని సూచించారు. ప్రధాని పరిశీలన నిజమే. గతంతో పోలిస్తే లోకేశ్ ఇప్పుడు రాటుదేలారు. నిజం చెప్పాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉండవు. ఆయనకు అంతటి వాగ్ధాటి లేదు. 2019కి పూర్వం తెలుగులో మాట్లాడటానికి తొట్రుపడిన లోకేశ్, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. లోకేశ్ భాష కూడా బాగా మెరుగైంది. అదే సమయంలో ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ కూడా అందుకు అనుగుణంగా మారింది. దీనికోసం లోకేష్ ఎంతో ప్రాక్ట్స్స్ చేసారు .
ఎదురైన అవమానాలు . .. వర్తమాన రాజకీయాలలో లోకేశ్కు ఎదురైనన్ని అవమానాలు మరే ఇతర నాయకుడికీ ఎదురవలేదు. జగన్ అండ్ కో ఒక పథకం ప్రకారం లోకేశ్ను కించపరిచే విధంగా ప్రచారం చేశారు. పప్పు అని అవమానించారు. ఆయన భాషను హేళన చేశారు. చివరికి ఆయన పుట్టుకపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడారు. మామూలుగా అయితే ఇన్ని అవమానాలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోతాం. అయితే లోకేశ్ వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కదిలారు. తానేమిటో రుజువు చేసుకోవడానికి అహరహం కృషి చేశారు. బాడీ షేమింగ్కు గురైనప్పటికీ బాధపడకుండా ఆహార నియంత్రణ పాటించడం ద్వారా విమర్శకుల నోళ్లు కట్టేశారు. రాజకీయాలలో నంబర్ 2గా ఉన్న వారిని టార్గెట్ చేసుకోవడం సహజం.
లోకేష్ నడపగలరు . .. పార్టీని సమర్ధవంతంగా నడపగల సత్తా లోకేష్ సంపాదించుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఆయన సామర్ధ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ దక్కుతుంది . చంద్రబాబు సీనియర్ల మాటాలకు కాస్త భయపడుతూ . .. తన నిర్ణయాన్ని వాయిదావేసుకోవడం పార్టీ రాజకీయాలకు ఎంతోకొంత నష్టం చేకూరుస్తుంది . దీనిపై చంద్రబాబు పునరాలోచుంచుకోవాలి .