విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు – ఏఐ సిటీగా అవతరించనున్న వైజాగ్
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం మరోమారు అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోనుంది . విశాఖ మకుటంలో మరో కలికితురాయి చేరనుంది. రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఈ సంస్థ విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ను వచ్చే నెలలో ప్రారంభించబోతోంది. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ఏర్పాటుపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది .
టీసీఎస్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించారు . రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలో పెట్టనుండటం గమనార్హం. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏఐ సిటీగా విశాఖ: డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నగరంగా రూపుదిద్దుకోనుంది. డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అమెరికా బయట రూ.56,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ను (1,000 మెగావాట్లు) ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి నవంబరులో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా రూ.87,520 కోట్ల పెట్టుబడులతో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఆ సంస్థ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఐటీ భవిష్యత్తుకి భరోసా : సిఫీ టెక్నాలజీస్ రూ.16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. మెటా సంస్థ సముద్రగర్భంలో సబ్మెరైన్ కేబుళ్ల ద్వారా విశాఖలోనూ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హైస్పీడ్ డేటా సెంటర్లతో ఏఐ, క్వాంటమ్, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్తు కేంద్రంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన ఉపాధి అవకాశాలు: టీసీఎస్ విశాఖలో ఏర్పాటు చేసే డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రూ.1,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా సుమారు 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థ సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 22 ఎకరాలను కేటాయించింది. ఇదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. సత్వా, ఏఎంఎన్ఎస్ ద్వారా మరో 15,000 మందికి ఉపాధి లభించ నుంది .



