చిక్కుల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. భూకుంభకోణం కేసులో విచారణ

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై భూకుంభకోణం (Land Scam) ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం సిద్దరామయ్య కుటుంబం విచారణకు గవర్నర్ చంద్ గెహ్లాట్ (Governor Chand Gehlot) విచారణకు ఆదేశించడంతో తీవ్ర కలకలం చెలరేగింది.

కర్ణాటకలో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముడా భూ కేటాయింపు (Land Allotments) ల్లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దీని వలన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతి లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2021 లో మైసూరు (Mysore) లోని కేసరే గ్రామంలో పార్వతికి చెందిన మూడు ఎకరాల స్థలాన్ని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. అందుకు ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూరులోని విజయనగర్ ప్రాంతంలో ఇతర ప్లాట్లను కేటాయించారు. అయితే విజయనగర్ ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలోని పార్వతి అసలు భూమి ధర కంటే ఎక్కువ.

సిద్ధరామయ్య ఎన్నికల అఫిడవిట్ (Election Affidavit )లో ఈ మూడు ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించలేదని, తన భార్య పేరుతో ఉన్న భూమి వివరాలను కూడా అఫిడవిట్ లో స్పష్టం చేయాలని అబ్రహం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ సైతం సీఎంను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్ధరామయ్యను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.