జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగానే కాకుండా . .. తెలుగింటి అల్లుడిగా సుపరిచుతులు. భారత్ తో వాణిజ్య ఒప్పందం బలపరచుకునేందుకు యుఎస్ ప్లాన్ ఏమిటి ? దీనికోసం జేడీ వాన్స్ ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లనున్నారు .
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై చర్చలు జరుగుతున్న వేళ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన చాలావ టఫ్ నెగోషియేటర్ అని, ఆయన చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్ అన్నారు.
ట్రేడ్ డీల్పై పురోగతి
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్- ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ సైతం భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీ వాన్స్ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందం ఖరారుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అగ్రి ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గిస్తారా?
‘భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల, అమెరికా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోంది’ అని వాన్స్ ఇటీవలే వ్యాఖ్యానించారు . వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో పాటుగా జపాన్, కొరియా తదితర దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ చెప్పారు.