విదేశీ పెట్టుబడులు 100 శాతం . . భీమా సమస్యలకు ఎఫెక్ట్ ..>

Abhi Correspondent

December 23, 2025

100 శాతం విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భీమా రంగానికి ఎంత మేర మేలు చేకూరుస్తుంది . భారత పార్లమెంటు ‘సబ్కా బీమా సబ్కీ రక్షా (ఇన్సూరెన్స్ చట్టాల సవరణ) బిల్లు-2025’ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 74 శాతం నుండి ఏకంగా 100 శాతానికి పెంచారు. బీమా చట్టం-1938, ఎల్‌ఐసీ చట్టం-1956, ఐఆర్‌డీఏ చట్టం-1999లను సవరిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశంలో మందకొడిగా ఉన్న బీమా విస్తరణను వేగవంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, కేవలం పెట్టుబడుల పరిమితి పెంచినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తీరుతాయా అన్న అంశంపై చర్చ నడుస్తోంది .

పెట్టుబడుల వేగం తగ్గింది . .

కొన్నేళ్లుగా భారత్‌లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 43.9 బిలియన్ డాలర్లుగా ఉన్న నికర ఎఫ్‌డిఐ, 2025 నాటికి 959 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు దేశంలో బీమా తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. జీడీపీలో బీమా ప్రీమియం వాటా 3.7 శాతంగానే మాత్రమే ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ అంతరాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ద్వారాలు తెరవడం పెద్ద చర్చ .

విదేశీ కంపెనీల ముందున్న సవాళ్లు 100 శాతం పెట్టుబడికి అవకాశం ఇచ్చినప్పటికీ, విదేశీ సంస్థలు భారత్‌లో అడుగుపెట్టడానికి ఒక ప్రధాన అడ్డంకి ఉంది. అదే ‘ఏజెంట్ వ్యవస్థ’. మన దేశంలో బీమా వ్యాపారం పూర్తిగా ఏజెంట్ల నెట్‌వర్క్ మీద ఆధారపడి నడుస్తుంది. దాదాపు 50 శాతం వ్యాపారం ఏజెంట్ల ద్వారానే జరుగుతోంది. విదేశీ సంస్థలు సాధారణంగా సాంకేతికతను నమ్ముకుంటాయి. కానీ భారతీయ వినియోగదారులు ‘మనిషి భరోసా’ (human interface) కోరుకుంటారు. ఏజెంట్ వచ్చి మాట్లాడితే తప్ప పాలసీ కొనని పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంత పెద్ద ఏజెంట్ వ్యవస్థను నిర్వహించడం విదేశీ కంపెనీలకు కత్తి మీద సాము వంటిదే. అందుకే చాలా కంపెనీలు జాయింట్ వెంచర్లకే మొగ్గు చూపుతున్నాయి.

కఠిన నిబంధనలు – ఐఆర్‌డీఏఐ పవర్స్ కొత్త చట్టం బీమా నియంత్రణ సంస్థ (IRDAI)కు అపరిమిత అధికారాలు కల్పించింది. తప్పుడు మార్గంలో సంపాదించిన లాభాలను జప్తు చేయడం, సోదాలు నిర్వహించడం వంటి అధికారాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకులు, ఇతర మధ్యవర్తులపైనా ఈ చర్యలు తీసుకునే వీలుంది. ఇది పరిశ్రమ వర్గాల్లో గుబులు రేపుతోంది. దీనికి తోడు, కంపెనీలో మెజారిటీ వాటా విదేశీయులదే అయినా… ఛైర్మన్, సీఈఓ లేదా ఎండీ వంటి కీలక పదవుల్లో కచ్చితంగా భారతీయులే ఉండాలన్న నిబంధన ఉంది. ఇది పెట్టుబడిదారులను వెనకడుగు వేయించే అంశం.

జేబులో డబ్బుంటేనే బీమా అసలు సమస్య వేరే ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆదాయం పెరగకపోవడమే బీమా రంగం డీలా పడటానికి అసలు కారణం. దేశంలో నాణ్యమైన ఉద్యోగాలు తగ్గుతున్నాయి. జీతాలు పెరగడం లేదు. సుమారు 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ ఉచిత రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ కంపెనీలు ఎంత పెట్టుబడి తెచ్చినా, సామాన్యుడి జేబులో డబ్బు లేకపోతే బీమా పాలసీలు ఎవరు కొంటారు? ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే తప్ప బీమా విస్తరణ సాధ్యం కాదని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

You May Also Like…

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు - ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - పెంటగాన్...