వందేభారత్ ను మించిన వేగం..
తెలుగు రాష్ట్రాలలో 2 రూట్లు..
మొత్తం బడ్జెట్ రూ.20వేల కోట్ల అంచనా
5, 6 ఏళ్లలో పట్టాలపైకి..
ఇక భారత్ ట్రాక్ మీద హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయి. వాటి వేగం వందే భారత్ ను మించి ఉంటుందంటే ఆశ్యర్య పడాల్సిందే. వందే భారత్ వేగం గంటకు 160 కిలో మీటర్లు. అదే ఒక సంచలనం అనుకుంటే ఈ హైస్పీడ్ రైళ్ల వేగం మరింత సంచలనం. వాటి వేగం గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్లు. ఈ రైళ్ల కోసం భారత్ లోని చాలా ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక కారిడార్ ఏర్పాటుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దానిలో ఏపీ, తెలంగాణకు సంబంధించి రెండు ముఖ్యమైన లైన్లు ఉన్నాయి.
అతివేగంగా నడిచే ఈ రైళ్లకోసం ప్రత్యేక లైన్లు అవసరం. ఇప్పుడున్న రైల్వే లైన్లు అనువుగా ఉండవు. అలాగే ఈ హైస్పీడ్ ట్రెయిన్స్ కోసం ప్రత్యేక బ్రిడ్జిలు కూడా నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టు రూ.20వేల కోట్లు బడ్జెట్ అంచనా వేశారు. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో భాగంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మించాలి, ట్రాక్స్ లు ఏవిధంగా వేయాలి అనే అనేక అంశాలను పరిశీలించారు. మరో ఐదారు ఏళ్లలో ఈ స్పీడ్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని చెపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ – విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ రూట్లలో హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే జరుగుతోంది. ఆ రిపోర్ట్ వస్తే డీపీఆర్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగున్నర గంటల్లో చేరవచ్చని అధికారులు చెపుతున్నారు. వందే భారత్ రైలు ఇంచుమించు ఎనిమిది, ఎనిమిదిన్నర గంటలు సమయం పడుతోందనే విషయం తెలిసిందే..