” సంపన్న దేశాలలో ఓ పక్క ఆహార వృధా లెక్కలేనంతగా ఉంది. ఫంక్షన్లలో ఫుడ్ వేస్ట్ పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంటున్నా… వృధా చేసేవారికి మాత్రం అది పట్టడంలేదు..
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభము తీవ్రమవుతున్న నేపధ్యాన్ని ఓ సర్వే తేటతెల్లం చేసింది..
32 దేశాలలో 36 మిలియన్లకు పైగా ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. ఈ కారణంగా గాజా స్ట్రిప్, సూడాన్లలో ఆహార భద్రత పరిస్థితి మరింత దిగజారిందని సర్వే గుర్తు చేసింది. మొత్తంగా 2023లో పోషకాహార లోపం పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని తెలుపగా వాటిలో మొదటిది దేశాల మధ్య యుద్ధం, రెండవది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరిగిన స్థానభ్రంశమని చెప్పింది. ఐక్యరాజ్యసమితి(UNO) ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్లో ఈ సమాచారాన్ని వెల్లడించింది.
2016లో ప్రపంచ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య ఇదే అత్యధికమని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో అన్నారు. ఈ నివేదిక ప్రకారం దక్షిణ సూడాన్, బుర్కినా ఫాసో, సోమాలియా, మాలీలలో వేలాది మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని రిపోర్ట్ తెలిపింది. గాజాలో 11 లక్షల మంది, దక్షిణ సూడాన్లో 79 వేల మంది జూలై నాటికి 5వ దశకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
దీంతో కరువును ఎదుర్కోవాల్సిన దశ కూడా మొదలవుతుందని చెప్పింది. అలాగే 2016లో నమోదైన సంఖ్యతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిందని తెలిపింది. తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న వారిలో 80 శాతం మంది అంటే 5,77,000 మంది ఒక్క గాజాలోనే ఉన్నారని ఆర్థికవేత్త చెప్పారు. ఇక్కడ ఆకలి అత్యంత దారుణంగా ఉందన్నారు.
ప్రపంచంలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న 10 దేశాలు
1. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 25.8
2. నైజీరియా 24.8
3. సుడాన్ 20.2
4. ఆఫ్ఘనిస్తాన్ 19.9
5. ఇథియోపియా 19.7
6. యెమెన్ 18.0
7. సిరియా 12.8
8. బంగ్లాదేశ్ 11.9
9. పాకిస్తాన్ 11.8
10. మయన్మార్ 10.6