ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూటమికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అన్నీ సవ్యంగా సాగుతున్న సమయంలో ఓ తలనొప్పి వచ్చిపడింది. కూటమికి రెబల్స్ గా పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులలో గందరగోళం నెలకొంది. కూటమి సీట్ల పంపకంలో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు కేటాయించారు.
గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిన ఎన్నికల కమిషన్ ”ఫ్రీ సింబల్” జాబితాలో పెట్టింది. దీంతో కొందరు రెబల్స్ కి కూడా ఈ గుర్తు రావడంతో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించామని ఎన్నికల అధికారులు చెపుతున్నారు. 16 అసెంబ్లీ స్థానాలలో స్వతంత్రులకు, 3 పార్లమెంట్ స్థానాలలోను గాజు గ్లాస్ గుర్తు.. జనసేనేతరులకు కేటాయించారు. ఇది ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్..
కాకినాడ జిల్లా జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పి. సూర్యచంద్రకు గాజుగ్లాసు కేటాయించారు. ఆటను జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ చురుగ్గా ఉన్నారు. స్థానికంగా కూడా కాస్త పట్టు సాధించారు. అయితే జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. సూర్యచంద్ర ఇండిపెండింట్ గా బరిలోకి దిగారు. అతనికి గ్లాసు గుర్తు రావడంతో పెద్దగా అవగాహనలేని కొందరు ..జనసేనకు చెందిన వారు, అభిమానులు పొరపాటున గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తే.. టీడీపీ అభ్యర్థి నెహ్రూకి ఎంతోకొంత మైనస్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీత కు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు . రాష్ట్రంలో మొత్తం 16 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలలో చోట్ల కూడా స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఒక్కో అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు చీల్చినా కూటమి అభ్యర్థులకు ఇది కొంతమేర ప్రమాదంగా మారే పరిస్థితి ఉందన్న ఆందోళన నెలకొంది.
జనసేన కాకుండా ఇతరులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు.. అభ్యర్థులు వీరే..
- విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ మీసాల గీత
- మైలవరం స్వతంత్ర అభ్యర్థి: వల్లభనేని నాగ పవన్ కుమార్
- విజయవాడ సెంట్రల్: ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్
- టెక్కలి: స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్
- జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి: పాఠంశెట్టి సూర్యచంద్ర
- పెదకూరపాడు: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబు
- గన్నవరం: స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణ
- అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీ చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప
- మంగళగిరి: రావుసుబ్రహ్మణ్యం
- మదనపల్లె ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్.