ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే గెలుపు
20-22 లోక్సభ సీట్లు కూడా గెలుస్తామంటూ చంద్రబాబు ధీమా
వేధింపులే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.. వినాశనమే ఆయన ధ్యేయం
చంద్రబాబుతో ‘ది రిపబ్లిక్’ టీవీ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 160 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. 24 లోక్సభ స్థానాల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలుసున్నారని బాబు స్పష్టం చేసారు. ‘ది రిపబ్లిక్’ టీవీ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి చంద్రబాబును ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు..
ఇంటర్వ్యూ లోని ముఖ్యా0శాలు…
కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుంద న్న విశ్వాసం తమకుందని.. 400కి పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని.. ఆంధ్ర రాష్ట్రం నుంచి అదనంగా 20 కిపైగా లోక్సభ స్థానాలిస్తామని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ పవర్గా మారుతోందన్నారు. ‘ది రిపబ్లిక్’ టీవీ నిర్వహించిన ‘దేశం తెలుసుకోవాలనుకుంటోంది (నేషన్ వాంట్స్ టు నో)’ కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు అత్యంత ఆత్మవిశ్వాసంతో సమాధానాలిచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వాలని జగ న్ అడిగితే ప్రజలు ఇచ్చారని.. కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని సీరియస్ గా నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ పరిపాలనను జనం చూశారని, అదే విధంగా తన పాలనతో జగన్ పాలనను సరిపోల్చుకుంటున్నారని.. ఫలితంగా తమవైపు మొగ్గుతున్నారని తెలిపారు.
నేను ఎందరో ముఖ్యమంత్రులను చూశాను. కానీ జగన్లా జనాన్ని వేధించి అందరినీ నాశనం చేసే, మానసిక సంతులనం లేని సీఎంను ఎప్పుడూ చూడలేదు.
– చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ని కాపాడేందుకే పొత్తు
”2019లో బీజేపీని మీరు వ్యతిరేకించారు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏముందని మళ్ళీ NDA లో చేరారు..?” అని చంద్రబాబును అర్ణవ్ ప్రశ్నించారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అక్కడ ప్రజాస్వామ్యమే లేదని.. ఏపీని, తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీయేతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అదే సమయంలో గత పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడేనన్నారు.
బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు.. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అర్ణవ్ అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీయేలో తానెప్పుడూ ఏ హోదానూ ఆకాంక్షించ లేదని, మంత్రి పదవులూ కోరుకోలేదన్నారు. ఈ మహోన్నత దేశానికి తన వంతు సేవ చేయడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. జాతి నిర్మాణంలో ఎన్డీయేకి సహకరిస్తామన్నారు. దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే తన అభిప్రాయమని.. మోదీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో సదభిప్రాయం నెలకొని ఉందని తెలిపారు. మోదీ ..ఇపుడు ఆంధ్రప్రదేశ్ కి మేలు చేస్తారన్న నమ్మకంతోనే పొత్తుతో ఎన్నికలకు వెళుతున్నామని తెలిపారు చంద్రబాబు..