ఏపీలో పాఠశాలలు కొత్త విద్యావిధానంలో అడుగుపెట్టబోతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. గతంలోలా కాకుండా ఆరు అంచెల విద్యావిధానంతో విద్యా సంవత్సరం కొనసాగనుంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్ ప్లస్ గా పాఠశాలలు ఉండబోతున్నాయి. పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలు తెరుచుకోనున్న ఈ రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కిట్లు అందించనున్నారు. ఈ కిట్లలో మూడు జతల యూనిఫాం, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను అందించనున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్ లో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే అన్ని పాఠశాలల ప్రాంగణాలు, గదులను అధ్యాపకులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.