బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ పటాన్ చెరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారు.’నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను, ఇది మోదీ గ్యారంటీ. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడు. మోదీ గ్యారంటీ అంటే.. ఇచ్చిన హామీని నెరవేర్చే గ్యారంటీ. భారత్ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలి. ఇప్పటికే భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారింది. విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారు. మేం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370ను రద్దు చేశాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగింది.
ఇవాళ మీ అందరికి ఒక గ్యారంటీ ఇస్తున్నా… రాసుకోండి.
ప్రపంచంలో భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. కాంగ్రెస్ నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో వారి కుటుంబాలు బాగుపడ్డాయి. ప్రజలు బాగుపడలేదు. కుటుంబ వాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. కుటుంబవాదులకు దోపిడీచేసే లైసెన్స్ ఉందా? కొంతమంది నాకు అసలు కుటుంబమే లేదని విమర్శిస్తున్నారు. ఆ నాయకులకు తమ కుటుంబమే ముఖ్యం. నాకు మాత్రం దేశమే ముఖ్యం. దేశంలో ప్రతి కుటుంబం ముఖ్యం.
ఆ నాయకుల దేశంలో అనేకమందిని రాజకీయంగా ఎదగనివ్వలేదు. యువకులకు కాకుండా వృద్ధులకు మాత్రమే వారు అవకాశం ఇస్తారు. కుటుంబవాదులు తమ ఖజానా నింపుకుంటారు. కొందరు నాయకులు గిఫ్ట్ లు తీసుకొని ఖజానా నింపుకుంటున్నారు. వారి దొంగసొత్తును బయటకు కక్కిస్తున్నాం. మీరు తలదించుకునేలా చేయబోను.కొందరు నల్లధనం దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.
ఓ వర్గం తమ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు కట్టించారు. మేం మాత్రం దేశంలో పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించాం. అందుకే నాకు కుటుంబం లేదంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే. ఇండి కూటమికి ఇది అర్థం కావడంలేదు. అందుకే తాము మోదీ కుటుంబ సభ్యులమని ప్రజలందరూ అంటున్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టాం.
దళితుల సమస్యలు అర్థం చేసుకున్నాం. బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒకటే. నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసింది.
‘మీరు తిన్నారు.. మేం కూడా తింటాం’ అన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్లు రెండింటిదీ ఒకే బాట.. ఝూట్.. లూట్ (అబద్ధాలు.. దోపిడీ) రానున్న లోక్సభ ఎన్నికల్లో 400సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలి.