” 2024 ఎన్నికల తర్వాత నరేంద్రమోదీ తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ప్రపంచం ఎదురు చూస్తోంది…”
ప్రధాన మంత్రి మోడీ ఈసారి కూడా బీజేపీని గెలిపిస్తే, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కన్నా పవర్ ఫుల్ లీడర్ అని రుజువు చేసుకున్నట్టవుతుంది. వరసగా మూడుసార్లు లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవడం అనేది మన తొలి ప్రధాని నెహ్రూకు మాత్రమే ఇప్పటి వరకు సాధ్యమైంది. భారత రాజకీయాల్లో ఉక్కు మహిళ అని పేరు పొందిన ఇందిరా గాంధీకి కూడా హ్యాట్రిక్ విజయం సాధ్యం కాలేదు.
నెహ్రూ నాయకత్వంలో 1952, 57, 62 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 1967 ఎన్నికల సమయానికి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆమె నాయకత్వంలో 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ 1977 ఎన్నికల్లో జనతా పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. స్వయంగా ఇందిరా గాంధీ రాయ్ బరేలీలో ఓడిపోయారు. కానీ జనతా ప్రభుత్వం తొందరగా పడిపోవడంతో 1977లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందిర ఈసారి తన పార్టీని గెలిపించుకున్నారు. ఆమె హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 414 పైగా సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ రెండు సీట్లు మాత్రమే నెగ్గింది.
అటు తర్వాత 1989లో రాజీవ్ గాంధి తన పార్టీని గెలిపించ లేకపోయారు. అప్పటి నుంచి 2009 వరకు ఏ పార్టికీ మెజారిటీ రాలేదు. అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నాయకత్వంలో సొంతంగా మెజారిటీ సాధించింది. మోడీ నాయకత్వంలోనే 2019లో కూడా బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి గెలిస్తే మోడీకి హ్యాట్రిక్ సాధించిన ఘనత దక్కుతుంది. ఇందిరను మించిన నాయకుడు మా నరేంద్ర మోడీ అని బీజేపీ నాయకులు గర్వంగా చెప్పుకోనే ఆ అవకాశం వస్తుందే లేదో, జూన్ 4వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.