ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు బెయిల్ నిరాకరించింది.
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. ఈ విషయంపై దాఖలైన మరో పిటిషన్ తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజకీయవేత్త కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.