ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు తెలియజేయాల్సి ఉంది.కేసుల వివరాలు దాచిపెడితే ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనపై నమోదైన కేసుల వివరాలు కోరినట్లు సమాచారం.
ప్రభుత్వం తనపై పలు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అధికారులు తనకు తెలియజేయలేదని కోరారు. వ్యక్తిగతంగా ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి సమాచారం పొందడం సాధ్యం కాదు కాబట్టి సమాచారం కోరుతున్నానని పేర్కొన్నారు. లేఖ కాపీని అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు చంద్రబాబు పంపించారు.