రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారానికి వేగం పెంచాయి. అందులోను బీజేపీ ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ లోనూ మరింత దూకుడు పెంచింది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఈ యాత్రను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు.
ఈ నెల 24న హైదరాబాద్ లో జరిగే విజయ్ సంకల్ప్ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. అయితే తొలి దశ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలున్నాయి. తేదీ, స్థలం ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ కు ‘స్టార్ లీడర్స్’ను కేటాయించి ఆయా ప్రాంతాల్లో ప్రచార యాత్రను నడిపించింది.