తెలుగుదేశం, మిత్రపక్షం జనసేన పార్టీలతో ఎన్నికలలో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించిన భారతీయ జనతా పార్టీ నేతలు పొత్తు అంశం తేల్చేందుకు చేస్తున్న జాప్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికలకు రెండు నెలలే గడువు ఉండటంతో అసెంబ్లీ టికెట్స్ కేటాయింపులపై తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నెలాఖరుకి సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి రావాలని ఇరు పార్టీల నేతలు భావించారు. అయితే బీజేపీ పొత్తు అంశం తేల్చకుండా జాప్యం చేస్తుండటంతో సీట్ల పంపకంపై టీడీపీ-జనసేన పార్టీలు సైతం వేచిచూడాల్సిం పరిస్థితి.
పొత్తు అంశంపై మాట్లాడడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన రోజే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం హుటాహుటిన ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ ని కలిశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే పొత్తు ఉన్నా, లేకపోయినా… కీలకమైన సమయంలో పొత్తు అంశం తేల్చకుండా జాప్యం చేస్తే అది టీడీపీకి రాజకీయంగా నష్టం చేస్తుంది. బీజేపీలో జగన్ అనుకూలురు.. ఈ జాప్యం కావాలనే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్ కోసమేనా: ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ది చేకూర్చడానికి బీజేపీ ..పొత్తు అంశాన్ని జాప్యం చేస్తుందంటూ పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలలో పొత్తు పెట్టుకుందామంటూ.. ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 20 రోజుల క్రితమే పిలుపు వచ్చింది. హడావుడిగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ..బీజేపీ అగ్రనేత అమిత్ షా తో భేటీ అయ్యారు. ఏమయిందో.. తెలియదు కానీ, టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV -5 లలో పొత్తు అంశాలపై ఎటువంటి సానుకూల వార్తా కధనాలు రాలేదు. బీజేపీ గట్టిగానే అడిగినట్లుంది.. ఏపీలో 8 లోక్ సభ, 15 అసెంబ్లీ సీట్లలో తమవాళ్లు పోటీ చేస్తారని బీజేపీ పెద్దలు, చంద్రబాబుకి సూచించినట్లు చెపుతున్నారు. ఇప్పటికే జనసేనకు 30 వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించడంతో.. బీజేపీ డిమాండ్ చేస్తున్న … 15 అసెంబ్లీ సీట్లు ఇస్తే.. 45 అసెంబ్లీ స్థానాలు పోగా, టీడీపీ వాళ్లకి..130 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సవ్యంగా జరగడానికే: బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను నిలువరించవచ్చన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు. ముఖ్య0గా రాయలసీమ ఏరియాలో జగన్ అండ్ కో.. ఎన్నికలలో భయాందోళన సృష్టింస్తారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల అల్లర్లు చేసి, అరాచకాలు క్రియేట్ చేస్తే.. ఆ ప్రభావం రాష్ట్రమంతా పోలింగ్ పై పడుతుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో ఉంది. ఈ కారణంగానే బీజేపీ ఆసరా ఉంటే.. కేంద్ర బలగాలు, ఎన్నికల కమిషన్ తమకు అనుకూలంగా లేకపోయినా,, జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా ఉండరన్న భావం టీడీపీ నేతల్లో ఉంది. బీజేపీతో పొత్తు కోరుకునేందుకు ఇది కూడా ముఖ్య కారణమే.