”గత జన్మలలో చేసిన కర్మలు ఈ జన్మలోనూ వెంటాడతాయ్ .. ఇదే సూత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి బాగా వర్తిస్తుంది. 2019 ఎన్నికలలో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ, ఎన్డీఏ కూటమికి వ్యతిరేఖంగా దేశమంతా తిరిగి .. ఇష్టానుసారం విమర్శలు చేసి.. మోడీతో శత్రుత్వం కొని తెచ్చుకున్నారు. 2024 ..ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికలలోనూ , బీజేపీ హవాను కాంగ్రెస్ ఆధ్వర్యంలో I N D I A కూటమి అడ్డుకట్టవేయగలిగేలా కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 2019 లో 1 శాతంలోపే ఓట్లు వచ్చాయి. బీజేపీ పట్ల, మోడీ పట్ల ఏపీలో ఇంకా వ్యతిరేఖత ఎక్కువే ఉంది. ఈ దశలో ఆ పార్టీతో పొత్తుతో ఎన్నికలకు వెళితే టీడీపీకి భారీ నష్టమే. అయినా బీజేపీ పెద్దలు బలవంతపు పొత్తు కోసం చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ”
కమలం పార్టీతో ఎన్నికలకు కలసి వెళితే…ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి నష్టమే ఉంటుంది. జగన్ అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని ఎన్నికలు సజావుగా జరిగి ప్రజాభిప్రాయం ప్రతిబింబించాలంటే బీజేపీ సహకారం తెలుగుదేశం పార్టీకి అవసరంగా కనిపిస్తోంది. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న రాయలసీమలో తెలుగుదేశం నాయకులు బీజేపీతో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇది వరకే పొత్తు ప్రకటన చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవొద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీయేలో చేరతామని నచ్చజెప్పడానికి తెలుగుదేశం తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి చెప్పుకోదగిన బలం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేకపోగా ప్రజల్లో వ్యతిరేకత కూడా ఎక్కువే ఉంది.
జగన్ కి మేలు.. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ మేలు జరుగుతుంది. బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేఖత ప్రభావం.. టీడీపీ, జనసేన పై కూడా పడుతుంది. అంతేకాకుండా.. జగన్- బీజేపీతో లేరు.. అన్న సంకేతం మైనార్టీలలోకి వైసీపీ తీసుకువెళ్లడం ద్వారా ఆ ఓటు బ్యా0క్ ను పదిలపరచుకోగలుగుతారు. తద్వారా జగన్ లబ్ది పొందే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం విజయావకాశాలను దెబ్బ తీసేందుకు బీజేపీలో కొందరు పెద్దలు యత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయ్. టీడీపీ జోష్ కు అడ్డుకట్టవేసి.. జగన్ ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఏపీలో బీజేపీలో కొందరు నేతలు సైతం లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా టీడీపీ కేడర్ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తో పొత్తు లేకుండా జనసేన-టీడీపీ కలసి వెళితే బాగుంటుందన్న అభిప్రాయం టీడీపీ నేతలలో ఎక్కువగా ఉంది.