”2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ”కాపు” రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబును, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నానా యాగీ చేసిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం .. తన రాజకీయ ఉనికి కోసం తహతహలాడుతున్నారు. జనసేన లేదా తెలుగుదేశం పార్టీలలో ఎక్కడో చోటు చేరి.. తనయుడిని అసెంబ్లీ సీటుకు పోటీ చేయించాలని యత్నిస్తున్నారు. ముద్రగడ కుటుంబ రాజకీయ భవిష్యత్ పక్కన పెడితే.. టీడీపీ-జనసేన కూటమికి ముద్రగడ చేరిక తీవ్ర నష్టాన్ని తెచ్చే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనలలో పలువురు మేధావి వర్గం వారు ” తెలుగుదేశం పార్టీకి ఇన్నాళ్లూ మద్దతుగా ఉంటూ వస్తున్న బీసీ జాబితాలో పలు వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది..” అని ఆందోళన చెందుతున్నారు. ”
2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కాపుల కోసం ”కాపు కార్పొరేషన్” ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయల లోన్స్ ఇప్పించారు. కాపు రిజర్వేషన్ల కోసం కూడా ప్రయత్నించారు. అయినా ముద్రగడ .. చంద్రబాబును టార్గెట్ చేసి అలజడి సృష్టించారు. 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా.. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అటకెక్కించారు. అంటే జగన్ పై ముద్రగడకు భయం అయినా ఉండాలి.. లేక భక్తి అయినా ఉంది ఉండాలి.
జనసేన-టీడీపీ ఎందుకు గ్రహించడంలేదు: ముద్రగడ ఎత్తుగడను టీడీపీ-జనసేన కీలక నేతలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు. రాజకీయంగా స్థిరత్వం లేని నేతను తెచ్చుకుని.. మాంచి జోష్ మీదున్న టీడీపీ-జనసేన కూటమికి ఎందుకు తలనొప్పులు కొని తెచుకోవాలనుకుంటున్నారు?
కాపు “ముద్ర “: కాపులంతా ఏకతాటిపైకి రావాలి.. అన్న పవన్ పిలుపు మేరకు ముద్రగడ స్పందించి ఉంటే అది ముద్రగడకు ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో తెలియదు కానీ, జనసేనకు ముద్రగడ రాక తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుంది. జనసేన పూర్తిగా కాపుల పార్టీగా ముద్ర వేసుకోక తప్పని పరిస్థితి. అందరినీ కలుపుకుని సామాజిక రాజకీయం చేయాలనీ ఉవ్విళ్లూరుతున్న పవన్ కి ఇది ముమ్మాటికీ అడ్డుపడే అంశంగానే చూడాలి.
ముద్రగడ నిజంగానే టీడీపీ-జనసేన పార్టీలలో ఎదో ఒకదానిలో చేరితే.. ఈ రెండు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్ళడానికి సమాయత్తమయ్యాయి .. కనుక.. తెలుగుదేశం వైపు ఉన్న బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ ప్రభావం కోస్తా జిల్లాలలో ఎక్కువగా ఉండొచ్చు అన్న అంచనాలు వస్తున్నాయ్. కాపు రిజర్వేషన్ ఉద్యమ సారధిగా పేరొందిన ముద్రగడ .. సహజంగానే తమ రిజర్వేషన్లు లాగేసుకుంటున్నారన్న అనుమానం ఉన్న బీసీ కులాలు.. సహజంగానే అతనికి వ్యతిరేఖంగా ఉంటారు. ఇవన్నీ టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు గ్రహించి రాజకీయంగా కొత్త ఇబ్బందులు తెచ్చుకోకుండా కీలక నిర్ణయం తీసుకుంటే ఆయా పార్టీలకు, ఏపీ భవిష్యత్తుకు మంచిది. పవన్, చంద్రబాబు.. ఇది సీరియస్ గా ఆలోచించుకోవాల్సిం అంశం. మీ ఇద్దరి రాజకీయమే కాదు.. ఆంధ్ర ప్రజలు భవిష్యత్తు మీ నిర్ణయం పై ఆధారపడి ఉంది. తస్మాత్ జాగ్రత్త..