” వైఎస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అందుకోకుండా నిలువరించగలుగుతుందా?
వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించడానికి షర్మిల ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.
రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి ఇదే తరుణంగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల సరైన నేతగా గుర్తించింది. ఈ మేరకు సోనియా, రాహుల్ షర్మిలతో మంతనాలు జరిపి.. 2029 ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ కీలక పార్టీగా ఎదగడం ద్వారా తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిల కూడా ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ”
2023 సంవత్సరం ..వరసగా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో మాంచి జోష్ మీదుంది. అదే జోష్ తో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ని గాడిన పెట్టడానికి హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది.
వై ఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం జోరందుకుంది. ఇది జగన్ కి వణుకు పుట్టిస్తోంది. ఇది ఏ మాత్రం వాస్తవరూపం దాల్చినా.. (జగన్, షర్మిల లోపాయి కారి ఒప్పందాలు లేకపోతే ) గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఈ సారి కాంగ్రెస్ తరపున అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎంతో కొంత నష్టం తప్పదని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయన్న అంచనాలు వస్తున్నాయ్.
వైసీపీ ఓట్లు ఏ మేరకు చీలతాయి: 2024 ఏప్రిల్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ-టీడీపీ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా షర్మిల చరిష్మా ను వాడుకుని.. ఓటు బ్యా0కును పెంచుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది.
వైసీపీ పాలనపై ఏపీలో వ్యతిరేఖత గణనీయంగా పెరుగుతోంది. గోతులమాయమైన రోడ్లు, ఉపాధిలేక లక్షల మంది యువత ఖాళీగా ఉండటం, నాణ్యతలేని మద్యం, ఇసుక, మైనింగ్ దోపిడీ.. వంటి ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలతో పాటు.. అసెంబ్లీ అభ్యర్థుల తొలగింపు, మార్పు వంటి పరిణామాలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలోకి వలసలు జోరందుకున్నాయి.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలలోకి వెళ్ళడానికి ఇష్టపడని నేతలకు, ముక్యంగా వైసీపీలో రాజశేఖర్ రెడ్డి అనుచర గాణానికి షర్మిల ఆశాదీపంగా కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే..వైసీపీ దళిత, క్రిష్టియన్ ఓటు బ్యాన్క్ కి గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది.
కనీసం 5 నుంచి 8 శాతం ఓట్లను కాంగ్రెస్ దక్కించుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ నిర్విహించిన పలు సర్వేలు సైతం ఇదే లెక్క చెపుతున్నాయి. ఇదే జరిగితే జగన్ సంప్రదాయ ఓటు చీలి.. గెలుపు అవకాశాలను కోల్పోయే ప్రమాదం మరింత పెరుగుతుంది.
2024 కోసం కాదు.. 2029 స్కెచ్
ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతాలు సృష్టిస్తుంది అని చెప్పలేం.. కానీ, వైసీపీ ని భయపెట్టగలుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్నా… కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏ మాత్రం పెరిగినా అది ఖచ్చితంగా వైసీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వణుకు పుట్టిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావస్తుండటంతో ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కూడా కొంత మేరకు తగ్గింది. అంతే కాదు..విభజన తర్వాత తొలి సీఎం అయిన చంద్రబాబు తో పాటు రెండవ సారి సీఎం అయిన జగన్ కూడా ప్రత్యేక హోదా తో పాటు కేంద్రం నుంచి విభజన హామీలు సాధించటంలో పూర్తిగా విఫలం అయ్యారు. కాంగ్రెస్ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేసారు. ఈ పరిణామాలు క్షుణ్ణ0గా పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి రాబోయేది గడ్డుకాలమే అని చెప్పకతప్పదు.