మనం మొదటి, రెండు,మూడో పారిశ్రామిక విప్లవంలో వెనుకబడిపోయాం. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి. ఆ దిశగా ప్రతీ నిత్యం జరుగుతున్న అభివృద్ధి పనులతో భారత్కు నూతనశక్తి లభిస్తోంది. దేశంలో ప్రతీ రోజు రెండు కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రతీ వారం ఒక యూనివర్సిటీ ప్రారంభమైంది, ప్రతీ రోజు 55 పేటెంట్లు, 600 ట్రేడ్మార్కులు రిజిస్టర్ అయ్యాయి. ప్రతీ రోజు 1.50 లక్షల రూపాయల ముద్ర రుణాల పంపిణీ జరిగింది. దేశంలో ప్రతీ రోజు 37 కొత్త స్టార్టప్స్ వచ్చాయి. దేశంలో నిత్యం 16వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలో ప్రతీ రోజు మూడు కొత్త జనౌషధి కేంద్రాలు తెరుచుకున్నాయి. ప్రతీ రోజు 14 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది. ప్రతీ రోజు 50 వేల కంటే ఎక్కువ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ప్రతీ సెకనకు ఒక హర్ ఘర్కో జల్ కనక్షన్ ఇచ్చాం. భారతదేశంలో ప్రతీ రోజు 75 వేల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాం’ అని ప్రధాని మోదీ అన్నారు. కుంభకోణాలు, అవినీతితో నాటి పాలన స్తంభించిపోయిందని ఆరోపించారు. ఈ పదేళ్లలో ఆ వ్యవస్థను సమూలంగా మార్చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు.
టీవీ 9 న్యూస్ చానెల్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రశంగించారు. చాలా విషయాలు ఈ సందర్భంగా ఆయన వివరించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, వారసత్వ రాజకీయాలు దేశ డీఎన్ఎను నాశనం చేశాయి. గడిచిన పదేళ్లలో ఆ భయానక స్థితి నుంచి దేశాన్ని ముందుకు తీసుకొచ్చాం. గడిచిన పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ టాప్ ఫైవ్లోకి వచ్చింది. దేశంలో నేడు అవసరమైన విధానాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకోవడం జరుగుతోంది. మైండ్సెట్లో వచ్చిన మార్పులు అద్భుతాలు తీసుకొచ్చాయి’ అని గతానికి వాస్తవానికి మధ్య తేడాలను వివరించారు.
ఆర్టికల్ 370 రద్దు నుంచి మొదలుపెట్టి రామాలయ నిర్మాణం వరకు, ట్రిపుల్ తలాఖ్ రద్దు నుంచి మహిళా రిజర్వేషన్ వరకు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వరకు అన్ని నిర్ణయాలు దేశం ముందు అనే భావనతో తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు అసంపూర్ణంగా వదిలేసిన ఎన్నో పనులను తాము పూర్తి చేశామని వెల్లడించారు. 21వ శతాబ్దపు రాబోయే రోజుల కోసం కూడా భారత్ను మనమే సిద్ధం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పేస్ నుంచి సెమీ కండక్టర్ వరకు, డిజిటల్ నుంచి డ్రోన్ వరకు, AI నుంచి క్లీన్ ఎనర్జీ వరకు, 5G నుంచి ఫిన్టెక్ వరకు అన్ని రంగాల్లో భారతదేశం నేడు ముందు వరుసలో నిలుస్తోందని, దేశంలో మరోసారి మా ప్రభుత్వంమే వస్తుందని.. ప్రధాని మోదీ ప్రకటించారు.