బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దక్షిణాదిలో వీలైనన్ని సీట్లను గెలిచి బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈరోజు కేరళ, తమిళనాడు, తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు.
ఉదయం కేరళలోని పతనంతిట్టకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కేరళలో సభ ముగిసిన వెంటనే ఆయన తమిళనాడుకు బయల్దేరుతారు. కన్నియాకుమారిలో నిర్వహించే బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ ఏడాది మోదీ తమిళనాడులో పర్యటించడం ఇది ఐదోసారి. ఈసారి తన ప్రధాన భాగస్వామి అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే బీజేపీ బరిలోకి దిగుతోంది. అనంతరం మోదీ హైదరాబాద్ కు బయల్దేరుతారు. మల్కాజ్ గిరిలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొనబోతున్నారు. ఈ రాత్రికి ప్రధాని రాజ్ భవన్ లో బస చేస్తారు.