”రాజకీయ పార్టీలకు ఆదాయ పన్ను శాఖ వరుసగా నోటీసులు జారీ చేస్తూ పోతోంది…దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది…”
కాంగ్రెస్ పార్టీకి రూ.1,823 కోట్లకు పైగా పన్నులు చెల్లించాలని నోటీసులు పంపిన ఆదాయపు పన్నుశాఖ, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- సీపీఐకి నోటీసులు జారీ చేసింది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఐటీ అధికారులను సవాలు చేస్తూ లెఫ్ట్ పార్టీ తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది.
72గంటల్లో 11నోటీసులు
లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. 72 గంటల్లో ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు 11 నోటీసులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో కొన్ని నోటీసులు ఏడేళ్ల క్రితానివని చెప్పారు. ఈ మేరకు నోటీసుల ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘బీజేపీ ఎందుకు ఈ తెగింపు?’
“గత 72 గంటల్లో మొత్తం 11 ఆదాయపు పన్ను నోటీసులు వచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని మోదీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈడీ పనిచేయకపోతే ఐటీ. బీజేపీ ఎందుకు ఈ తెగింపు?” అని సాకేత్ గోఖలే ప్రశ్నించారు.