మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ ‘విశ్వంభర’. గతేడాది దశరా రోజున అత్యంత వైభవంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేది ఎవరనేది అప్పుడు ప్రకటించకపోవడం చిరు అభిమానులకు నిరాశ కల్పించింది. ఇప్పుడు ఆ కథానాయిక ఎవరనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
చిరు సరసన అనుష్కశెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నట్టు ప్రచారం సాగింది. విశ్వంభర మూవీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోంది. వీరోచిత సాహసాలు, అద్భుతమైన గ్రాఫిక్స్ తో చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా విశ్వంభర నిలుస్తుందని చిత్ర నిర్మణ సంస్థ చెబుతోంది. దీని కోసం 13 భారీ సెట్లు నిర్మించారట. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ మూవీ 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రానున్న ఈ చిత్రం చిరంజీవి కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్’పై 157వ సినిమాగా చేస్తున్నారు.
అయితే వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశారు. దీంతో చిరు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వీరి కాంబినేషన్లో 2006లో వచ్చిన ‘స్టాలిన్’ మూవీ అప్పట్లో మాంచి సంచలనం సృష్టించింది. 18 ఏళ్ల అనంతరం మెగాస్టార్, త్రిషల జంట మళ్లీ విశ్వంభరలో అలరించనుంది.