భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది RRR మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ (Naatu Naatu Song) ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు (Oscars 2023) గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. నాటు నాటు పాట ఆస్కార్ దక్కడం పట్ల యావత్ ఇండియన్ ఆడియన్స్ ఖుషీ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, పొలిటికల్ దిగ్గజాలు RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.
సినీ ప్రపంచంలో తెలుగుజెండా రెపరెపలాడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాట కైవసం చేసుకుని తెలుగోడి సత్తా ప్రపంచం నలుదిశలా వ్యాపించింది. ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ఈ ఘన విజయం వినువీధిలో భారత్ ప్రభంజనాన్ని వేనోళ్ల చాటి చెప్పింది.
”రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ ల ప్రతిభ ద్వారా తెలుగు పాటకు ప్రపంచ వేదిక గౌరవాన్ని ఇవ్వడం ఆనందదాయకం..;; అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకోవడం పై హర్షం వ్యక్తం చేసారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు గీతం ఆస్కార్ అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ.. సినీ అభిమానులు దేశమంతా ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు.