”కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదు..’ అని 2019 ఎన్నికల ముందే వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసారు. అయినా కాపులలో మెజార్టీ జగన్ కే మద్దతుగా నిలిచారు. కాపులను వదులుకున్నాడని భావించిన బీసీ సామాజిక వర్గాలలో మెజార్టీ జగన్ వెనుక నిలబడ్డారు.. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యంత కీలక పరిణామం. ఈ సున్నిత అంశాన్ని కాపులలో ఎంతమంది గుర్తించారో తెలియదు కానీ.. ”వధ్దనుకున్న వ్యక్తిని భుజాలపై పెట్టుకుని మోశారు..”. అంటూ కాపులపై పవన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో ఇపుడు హాట్ టాపిక్. జనసేనాని చేసిన ఈ వ్యాఖ్యలతో కాపులలో అంతర్మధనం మొదలైందా? వచ్చే ఎన్నికలో పవన్ వెనుకే మెజార్టీ కాపులు ఉంటారా? అనేది ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చ..
ఇదే సమయంలో…కాపుల్లో ఐక్యత లేదని.. అదే ఉండి ఉంటే గత ఎన్నికల్లో తాను ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, కాపు సంక్షేమ సంఘం నేతలతో ఆయన భేటీ సందర్బంగా ఈ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘డబ్బులతో పార్టీని నడపలేను. కేవలం భావనాబలంతో మాత్రమే పార్టీని నడుపుతున్నా. పార్టీని ప్రతికూల పవనాల్లోనూ నడుపుతున్నా. అనుకూల పవనాలు రాలేదన్నారు. అప్పడూ, ఇప్పుడూ గాజువాక, పిఠాపురంలో పోటీ చేయాలని చెబుతున్నారు. కులం పరంగా చూస్తే ప్రతి కాపు వ్యక్తీ ఓటు వేస్తే నేను గాజువాక, భీమవరంలో ఓడిపోకూడదు. కానీ, అలా జరగలేదు. ఒక కులం సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న చోట వైవిధ్యమైన అభిప్రాయాలు ఉంటాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా తీసుకున్నా. నేను ఓడినా వెనక్కి తగ్గలేదు. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిందన్న విషయం గుర్తు లేదు. కానీ, ఈ .పదేళ్లు నానా మాటలు అనిపించుకున్నా. అవసరం లేకపోయినా సమాజంలో మార్పు రావాలన్న ఉద్దేశంతో ముందుకు నడిచాను. నాకు అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు. సభలకు వచ్చి, చప్పట్లు కొట్టిన వారే ఓట్లు వేసే సమయానికి మొహం చాటేశారు. దాన్ని నేను తప్పుగా భావించడం లేదు. మిగిలిన పార్టీల వారు నన్ను కాపు కులస్థులతోనే తిట్టుస్తున్నారు. ఇప్పటికి పార్టీ పెట్టి 10 ఏళ్లు పూర్తయింది. మరో 15 ఏళ్లు అంటే 3 ఎన్నికల వరకు ఉండగలను. ఈ 15 ఏళ్లు కాపులు ఐక్యంగా ఉంటే మరొకరి దగ్గర దేహీ అనే పరిస్థితి రాదు’’ అని పవన్ అన్నారు. కాపులు పెద్దన్న పాత్రపోషించాలని సూచించారు. అన్ని కులాలను కలుపుకొని వెళ్లాలన్నారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని, ఒకవేళ మిగిలిన పార్టీల వద్ద డబ్బులు తీసుకున్నా జనసేన గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వైసీపీకి మాత్రం ఓటు వేయవద్దని కాపులకు పవన్ పదేపదే విజ్ఞప్తి చేసారు. అంటే ఈ ఎన్నికలలో టీడీపీతో జతకట్టడం ఖాయమని క్లారిటీ ఇచినట్లేనని భావించాలి.