” వందల సంవత్సరాల హిందువుల సంకల్పం సాకారమైంది. తండ్రి మాట జవదాటని ఆదర్శ పురుషుడు శ్రీ రాముడు జన్మించిన అయోధ్య ప్రాంతంలో రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట కనులపండుగగా సాగింది.. ఏవత్ భారతావనే కాదు.. ప్రపంచమంతా ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించి తరించారు..”
బాల రాముడి నేత్రోన్మీలనాన్ని తిలకించి పులకించిన భక్త జనం ఆనందానికి అవధుల్లేవు.. మరపురాని ఈ వేడుకలను కనులారా వీక్షించి తమ జన్మ చరితార్థం అయిందని ఓలలాడుతున్నారు. ఈ జ్ఞాపకాలను మనసుపొరల్లో దాచుకునేందుకు.. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తజనంతో అయోధ్యాపుర వీధులన్నీ నిండిపోయాయి! రెపరెపలాడుతూ ఎగిరే రామ ధ్వజాలతో.. రామనామ సంకీర్తన చేసే సాధుసంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందడి నడుమ.. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం అయింది.
రామభక్తులంతా ఆ బాల రాముని దర్శనం కోసం ఇన్నాళ్లుగా పడిన తపన కార్యరూపం దాల్చింది. అల సాకేతపురిలో జన్మించి.. సరయూ నది ఒడ్డున ఆటలాడి.. తండ్రిమాట జవదాటని పితృవాక్య పరిపాలకుడిగా ఎదిగి.. హిందూ జన హృదయ సామ్రాట్టుగా విరాజిల్లుతున్న ఆదర్శపురుషుడు, అవతారమూర్తి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా సాగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పుసుపు వస్త్రాన్ని తొలగించి (నేత్రోన్మీలనం అనంతరం) తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇచ్చారు.
50 వాయిద్యాలతో మంగళ ధ్వనులు
రామమందిరం ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు 2 గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించాయి. భారతీయ సంప్రదాయానికి చెందిన ఘటం (ఏపీ), మృదంగం, నాదస్వరం (తమిళనాడు), వీణ (కర్ణాటక) తదితర 50 రకాల సంప్రదాయ సంగీత వాయిద్య కారులు మధురముగా వినిపించారు.
10 లక్షల దీపాలు..
బాల రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సోమవారం (22న) సాయంత్రం అయోధ్య నగర వ్యాప్తంగా 10లక్షల మట్టి దీపాలు వెలిగించారు. నగరంలోని 100 ఆలయాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్లను దీపాలతో అలంకరించారు. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా క్రతువుల్లో 121మంది ఆచార్యులు పాల్గొన్నారు.
విదేశాలలో సైతం.. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్, కెనడా తదితర వందకుపైగా దేశాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.