”గత ఐదేళ్లుగా చూస్తున్నాం.. బీజేపీకి వైసీపీ, టీడీపీ లోపాయికారిగా ఒప్పందం ఉంది.. అందుకే జగన్, చంద్రబాబు బీజేపీని ఒక్క మాట కూడా అనరు .. ” అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆమె పీసీసీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మతం చాటున మంట కాచుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా టీడీపీ, వైసీపీలు ఎందుకు మౌనం వహించాయని దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు, జగన్ నిర్లక్ష్యం చేశారన్నారు.
రాజధాని ఏదీ? ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి అని షర్మిల అన్నారు. అమరావతిని చంద్రబాబు రాజధానిగా పెట్టి గ్రాఫిక్స్ చూపించారని, జగన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు అన్నారు.. ప్రస్తుతం ఏపీ రాజధాని ఎక్కడ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్లు పెట్టారని విమర్శించారు.
జగన్ సర్కార్ కి భయమేస్తోంది: షర్మిల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో కాన్వాయ్ ఆపడంపై షర్మిల మండిపడ్డారు. ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్ను పోలీసులు ఆపారు. అక్కడి నుంచి వాహనాలను మళ్లించారు. కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనక ఉన్న వాహనాలు వచ్చేవరకు ముందుకు వెళ్లమని షర్మిల తేల్చిచెప్పారు. అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. షర్మిల కాన్వాయ్కు అనుమతి ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆంధప్రదేశ్లో నియంత పాలన నడుస్తోందని షర్మిల ధ్వజమెత్తారు.