ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ హృద్రోగ నిపుణులు పద్మభూషణ్ ప్రొఫెసర్ బి.ఎం.హెగ్డే గారి ప్రసంగాలు ఆసక్తి గొలుపుతున్నాయి. ఆరోగ్యాంగా ఉండటం ఎంత అత్యవసరమో చెబుతూనే, దానికి సంబంధించి మనలో పేరుకుపోయిన ఎన్నో భ్రమల్ని పటాపంచలు చేస్తున్నాయి. స్వస్థత విషయంలో శాస్త్రీయ ఆధారాలతో కూడిన డాక్టర్ హెగ్డే గారి నిరూపణలు నివ్వెరపరుస్తున్నాయి. అంతే కాకుండా స్వాస్థ్య జాగ్రత్తల పేరుతో మనం శరీరంపై తీసుకుంటున్న అతిశ్రద్ధని, పధ్యాలు నెపంతో అలవరచుకుంటున్న అనుచిత ఆహారపు అలవాట్లను ఆయన తూర్పారపడుతున్నారు. నిజంగా ‘ఆరోగ్యం’ అన్న దానికి అసలైన నిర్వచనం తెలియక, కేవలం దేహంతో రోగాల జాడ, దేహానికి రోగాల బాధ లేకపోవడమే ఆరోగ్యమని అపోహపడుతున్నామని ఆయన ఓ ప్రసంగంలో ఎద్దేవా చేసారు. మనలో దేహంపై విపరీతమైన ద్యాస పెరిగి, మానసిక స్వస్థత, మానవీయ స్పృహ లోపించటం వల్లనే తనువు అస్వ్యస్తత పాలవుతుందని ఆ ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేసారు.
మణిపాల్ వైద్య విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ హెగ్డే ఆధునిక వైద్య శాస్త్రంలో ఆచార్యులైనా, మన భారతీయ సనాతన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రమాణంగా తీసుకోవడం విశేషం. అందులోని స్వస్థత సూత్రాలనే ఆధారంగా చేసుకొని సూచనలివ్వటం శ్లాఘనీయం. ‘వ్యాధులు’ లేకపోతె ఆరోగ్యాంగా ఉన్నట్లు కాదు. జీవితంలో ఉత్సాహం, హృదయంలో ప్రేమ, ముఖంలో చిరునవ్వు, కష్టాల వేళల్లో కూడా కుంగిపోకుండా నిలబడే నిబ్బరమే ఆరోగ్య రహస్యం.. అంటారు ఎనభై ఏళ్ల పైబడిన వయస్సులో కూడా ఎంతో ఉల్లాసంగా కనిపించే ఆ డాక్టర్ గారు. మనమూ అలా ఉండేందుకు ఇప్పటి నుంచీ ప్రయత్నిద్దాం.