వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని సీసీఎంబీ కీలక పురోగతి సాధించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే కచ్చితమైన బయోమార్కర్లను గుర్తించింది. ఆ సంస్థలోని క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త లేఖ దినేశ్ కుమార్ బృందం చేపట్టిన రీసెర్చ్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
మహిళలకు ఇదొక వరం..
వేలి కొనపై ఒక్క రక్తపు చుక్కతో షుగర్ లెవల్స్ తెలుసుకుంటున్నట్టే ఈ రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ల్యాబ్ ఆన్ చిప్గా అభివృద్ధి చేస్తే మన దేశంలోని మహిళలకు ఒక వరమని పరిశోధకులు అంటున్నారు. పరిశోధన వివరాలు సెల్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నలింగ్ జర్నల్ లో ప్రచురించారు.