రకరకాల వ్యాధులు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. మారుతున్న ప్రకృతి, మన అలవాట్లు, ఆహారం వంటి మార్పుల వల్ల వివిధ రకాలు వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి విజృంభిస్తుందో తెలియని పరిస్థితి. ఏ చిన్న వ్యాధి బారిన పడకుండా అప్రమత్తమవ్వక తప్పదు. కరోనా తర్వాత ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది. మంకీపాక్స్ తొలికేసు బ్రిటన్లో బయటపడింది. అక్కడి నుంచి స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలకు చాలా వేగంగా విస్తరించింది. అలాగు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య 20కి పెరిగాయి.. స్పెయిన్లో ఇప్పటి వరకు 23 కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది. దీంతో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్ చేయాలని, వారి నుంచి నమూనాలను సేకరించి పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని బీఎస్ఎల్-4కు పంపాలని ఆదేశించింది. నిజానికి మంకీపాక్స్ అనేది 1958లోనే కనుగొన్నారు. అప్పడు ప్రయోగశాల్లో కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. కాబట్టే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. ఇది కూడా మశూచి లాంటిదే. మనుషుల్లో తొలి కేసు మాత్రం 1970లో నమోదయింది. ఆ తర్వాత ఈ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమయింది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ప్రారంభమై రెండు నుంచి నాలుగు వారాలపాటు ఈ వ్యాధి ఉంటుంది. అయితే కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పటివరకు మరణాలు సంభవించలేదు.
ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. మంకీపాక్స్ సోకిన జంతువు కరిచినా, లేదంటే ఆ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇతరులకు సోకుతుంది. నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా.. అలాగే ఎలుకలు, ఉడతలు, చిట్టెలుకల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా సోకుతుంది. మశూచికి ఇచ్చే టీకాలే దీనిని కూడా నివారిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్కు గురైన పది మందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది శృంగారం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.