టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తాజాగా సర్కారు వారి పాట మూవీ సూపర్ సక్సెస్ తో హ్యాట్రిక్ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా దాన్ని అధిగమించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న మహేష్ మూవీ రూ. 200 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతోంది. కాగా సూపర్ స్టార్ తరువాత మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరో నటించే అవకాశమున్నట్టు సమాచారం. ఈ పాత్రకు కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్హాసన్ అయితేనే న్యాయం చేయగలరని రాజమౌళి భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి అప్డేట్లు లేనప్పటికీ ఈ కాంబో సెట్ అయితే అది సినీ అభిమానులందరికీ పండుగలాంటిదేనని చెప్పాలి.
కాగా ఇగోలకు దూరంగా ఉండే మహేష్ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఘన విజయం సాధించినా ఆ తరువాత మళ్లీ మల్టీస్టారర్ చిత్రంలో నటించలేదు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు తారక్, చెర్రీ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తారక్, చెర్రీ లతో కలిసి నటించేందుకు తాను సిద్ధమేనని మహేష్ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ఆ తరువాత సీనియర్ స్టార్ బాలకృష్ణ-మహేష్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్టు కూడా వార్తలు హల్చల్ చేసినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.
అయితే తాజాగా సన్నిహితులైన దర్శకులతో తాను మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని మహేష్ హింట్ ఇచ్చినట్టు సమాచారం. అంటే అటు సీనియర్ హీరోలతోనైనా లేక తన తరం స్టార్ హీరోలతోనైనా సరే వెండి తెర పంచుకునేందుకు రెడీగా ఉన్నానని, ఇక కథలు తయారు చేసుకుని తనవద్దకు వచ్చే బాధ్యత దర్శకులదేనని సూపర్ స్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చేసినట్టేననుకోవాలి. మరి ఏ దర్శకుడు మహేష్తో మల్టీస్టారర్ సెట్ చేస్తారో చూడాలి.