మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంగా స్వచ్ఛందంగా వెల్లువలా తరలివస్తున్న ప్రజల నుంచి ఆయనకు లభిస్తున్న హార్థిక స్వాగత సత్కారం అక్కడి టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. అదే సమయంలో వైసీపీ అడ్డాగా ఇప్పటివరకు భావిస్తున్న కడప, కర్నూలు జిల్లాల్లో సైతం విపక్ష నేతకు జనంలో వస్తున్న ఊహించని స్పందన చూసి వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. వైసీపీ అధిష్ఠానానికి సైతం కలవరం కలిగిస్తున్న అంశమిది. ఎందుకంటే ఇప్పటికీ రాయలసీమలో వైసీపీకి ఎదురులేదని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఇక్కడ అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగలమని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. కోస్తా ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పుంజుకున్నా రాయలసీమలో తమకుండే ఆధిక్యతతో తిరిగి అధికారం చేజిక్కించుకోగలమని నమ్ముతోంది. అయితే చంద్రబాబు పర్యటన ద్వారా రాయలసీమలోనూ వైసీపీ కోటలు బీటలు వారుతున్న పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గడప గడపకూ కార్యక్రమంలో నిరసన సెగలు..
నిజానికి గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో చాలాచోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. జనం నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో ఆ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టుగా వ్యతిరేక మీడియాలో కథనాలు రావడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో పనులు లేకపోవడం, కొత్త పరిశ్రమలు రాక నిరుద్యోగం పెరిగిపోవడం సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరగడానికి కారణాలుగా చెప్పాలి. ఇప్పుడు మంత్రులందరూ కలిసి బస్సు యాత్ర చేపట్టాలని, కొన్నిచోట్ల సభలు నిర్వహించి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఏ స్థాయిలో నిర్వహిస్తున్నదీ, వాటికోసం ఎంత వ్యయం చేస్తున్నదీ ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. నిజానికి ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా జరగని కార్యక్రమమిది. ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకులు బస్సు యాత్ర చేయాలనుకోవడం ద్వారా తమ బలహీనతలను తామే చాటుకున్నట్టవుతుందన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
వైసీపీకి ప్రమాద ఘంటికలు
ఇదే సమయంలో చంద్రబాబునాయుడు రాయలసీమ పర్యటనకు జనబాహుళ్యం నుంచి విశేష స్పందన వ్యక్తమవుతుండటం, వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయన విమర్శలతో విరుచుకుపడుతూ టీడీపీ నాయకులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుండటం వైసీపీ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ పార్టీ నాయకత్వాన్ని దిక్కుతోచని పరిస్థితిలోకి నెడుతోంది. రాయలసీమ జిల్లాల్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు త్వరలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను నియమించి ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తనపై వ్యతిరేకతను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. దానికి తగినట్టుగానే ముందుగానే ఆయన టీడీపీ వైపు నుంచి కార్యాచరణను ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ఇప్పటిదాకా నమ్మకంతో ఉన్న వైసీపీ మాత్రం టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకోకుండా ఉంటే తమ గెలుపు నల్లేరుపై నడకేనని భావించింది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉండటం గమనించాక ఇప్పుడు ఎలాంటి వ్యూహాలు రూపొందించుకుంటుందో వేచి చూడాలి.