కారం .. అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎరుపు రంగులో ఉండేది. ఎండు మిరపను మరపట్టించి, లేదా రోలులో దంచితే వచ్చేది కారం. ఇప్పటి వరకు మనలో మెజార్టీ జనం వంటల్లో ఎర్రకారంపొడిని వాడుతుంటాం. (కొంత మంది మాత్రం ఇటీవల కారం బదులుగా పచ్చి మిర్చి వాడుతున్నారు.) అయితే ఇకపై పచ్చకారంపొడి కూడా అందుబాటులోకి రానుంది. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (IIVR) పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలోనే పచ్చ కారంపొడిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఈ కొత్త ఆకు పచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది.
ఆకుపచ్చ కారంపొడిని ఎలా తయారుచేస్తారంటే… తొలుత పచ్చిమిరపకాయలను ప్రత్యేక పద్ధతుల్లో రంగు పోకుండా ఎండబెట్టి కారంపొడి చేస్తారు. ఇది మరింత ఘాటుగా, కారంగా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఆహారంలో ఈ కారాన్ని ఉపయోగించడం వల్ల మనం తిన్న తర్వాత త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించేలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎర్ర కారంపొడితే పోలిస్తే ఆకుపచ్చని కారంపొడిలో 30 శాతానికి మించి విటమిన్ సి, 94-95 శాతం క్లోరోఫిల్, 65-70 శాతం క్యాప్సిన్ ఉంటాయని IIVR సైన్టిస్టులు చెపుతున్నారు. ఎర్ర కారంపొడితో పోలిస్తే ఇలాంటి కారపు పొడిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని వెల్లడించింది. అంతేకాకుండా పచ్చ కారంపొడిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా నెలల పాటు నిల్వ చేయవచ్చని వీరి పరిశోధనలో రుజువయింది.
ఎర్ర కారంలో ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. పండిన మిరప కాయలను ఎండపెట్టినపుడు రాత్రి వేళల్లో కురిచే మంచు వాటిపై పడి ఫంగస్ ఏర్పడుతుంది. ఫంగస్ పట్టిన కారం కూరలు, పచ్చళ్ళు ద్వారా తింటే అది కేన్సర్ కారకంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. మిర్చి ఎండలో ఆరబెట్టినపుడు వచ్చి చేరే దుమ్ము, దూళి కణాలు కూడా కారంలో చేరి కూరలు, పచ్చళ్ళ ద్వారా మన లోపలికి చేరతాయి. ఈ ప్రభావం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ పచ్చ కారం పొడి వల్ల ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. దీంతో ఈ గ్రీన్ చిల్లీ పొడి కి మార్కెట్ లో మంచి డిమాండు ఉండే ఛాన్స్ ఉంది. గ్రీన్ చిల్లీ పొడి మార్కెట్ లోకి వచ్చే లోపు మనమూ ఇంట్లో తయారు చేసుకోవచ్చేమో ట్రై చేయండి.