ప్రతి ఏడూ ఉగాది వచ్చి మనం పాతబడిపోకుండా ‘కొత్త ఆశల’ చిగురు తొడుగుతుంది. ఆ ఆశ అత్యాశగా వికృత స్వార్ధ రూపం దాల్చి.. పక్షులు, ఇతర జీవజాలాలకు ఆవాసాలు లేకుండా చేస్తున్నాం. నగరీకరణ పేరుతో రెండు దశాబ్దాలుగా పచ్చని వనాలన్నీ కాంక్రీట్ మయమవుతున్నాయ్.
హరిత విప్లవంతో .. వ్యవసాయ దిగుబడులు పెంచుకోవాలన్న పేరాశతో రసాయనాలతో గాలి, నీరు, నేల విషతుల్యం చేసేశాం. మరో పక్క 1990 దశకం తర్వాత వస్తు వినియోగం పెరిగి ఫ్యాక్టరీస్ తామరతంపరగా పెంచేసుకుని.. అవి వెదజల్లే విష వాయువుల్ని పీల్చుకుంటూ.. రోగాలు, రొప్పులతో మనుగడ సాగిస్తున్నాం.
ఆధునికీకరణ పేరుతో ఏం పొందుతున్నామో, ఏం పోగొట్టుకుంటున్నామో.. తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ పరిణామ క్రమంలో మన అత్యాశతో పరిమితంగా ఉండే వనరులను దుర్వినియోగం చేస్తూ మన తర్వాత తరాలకు తీరని అన్యాయం చేస్తూ., ఇంకో వైపు పశు, పక్ష్యాదులు మనుగడకు ప్రశ్నర్ధకం అవుతున్నాం.
ఈ వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెడదాం. దీనికి పెద్ద ఖర్చేమీ కాదు. మట్టి పిడతలతో నీళ్లు పెడదాం. ఇంకా మనసు ఒప్పితే గుక్కెడు నీళ్లతో పాటు, గుప్పెడు గింజలు వేద్దాం. ఇది మన కనీస కర్తవ్యంగా భావిద్దాం. పిల్లలకు పక్షుల నీళ్ల పని అప్పగిస్తే వారు ఉత్సాహంగా, బాధ్యతగా చేస్తారు. ఇలాంటి పనుల వల్ల చిన్నారులలో సున్నితత్వం వస్తుంది. ఇది మానసిక వికాసానికీ దోహదపడుతుంది. బాల్కనీలు, పిట్ట గోడలు, అపార్ట్ మెంట్స్ పైనా, ఇంటి పెరట్లో.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ పక్షులకు మట్టి మూకుడులలో నీళ్లు పెట్టే పనికి ఈ ఉగాది రోజే శ్రీకారం చూడదాం.
ఈ ఏప్రిల్, మే నెలల్లో గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు పెట్టి.. వడ దెబ్బకు గిల గిల్లాడిపోతున్న బుల్లి ప్రాణులైన పిచుకలు, రామ చిలకలు, గోరింకలు, కాకులు, ఉడుతలు,,, ఇలా బక్క జీవుల ప్రాణాలు నిలబెడదాం. మంచి పని చేయడానికి ‘ఉగాది’ మనకు సెంటిమెంట్. శుభాలు చేకూరతాయంటారు. పక్షులకు నీళ్లు.. కూడా ఈ రోజే మొదలెడదాం.. పక్షులకే కాదు.. మనకూ ..(మానవాళికి) మంచే జరుగుతుంది.
” పక్షులకు నీళ్లు పెడదామన్న సందేశాలను వాట్సప్ లలో ఫార్వార్డ్ చేసే ముందు మనం ఆచరించిన తర్వాతే పదిమందికి పంపిద్దాం.”
“మీ ఆగామి కాలమంతా ఆనందాల హరివిల్లు విరియాలని,
మీ అంతరంగపు కోయిలలు ఆత్మ్యీయ రాగాలతో హృదయ వీణలను మీటాలని, మీ జీవనవనంలో ఈ శ్రీశుభకృత్ నామ సంవత్సరం శుభాల సిరులు కురిపించాలని ఆశిస్తూ .. ఆకాంక్షిస్తూ ..”
అభిన్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు.