ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ ఉరుమురిమి మంగళం మీద పడిందన్నట్టు తయారైంది ప్రపంచానికి. రోజుల వ్యవధితో ముగిసిపోతుందనుకున్న యుద్ధం కాస్తా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకపక్క రష్యా, మరోపక్క నాటో కూటమిలోని ప్రధాన దేశాలు తమ అమ్ములపొది లోని అణ్వస్తాలను బయటకు తీసి శత్రువుపై మొహరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయాక గత మూడు దశాబ్దాల్లో తొలిసారి ఈ పరిస్థితి కనిపిస్తోంది. రష్యాది దురాక్రమణ అని, ఇప్పుడు తాము పూర్తిస్థాయి మౌనం పాటిస్తే పుతిన్కు మున్ముందు ఇక పట్టపగ్గాలు ఉండవని భావించిన అమెరికా దాని మిత్ర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా పరోక్షంగా ఉక్రెయిన్కు అన్నివిధాలుగానూ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ కారణంగానే బలమైన సైనిక శక్తిగా ఉన్న రష్యాను.. ఉక్రెయిన్ వారాల తరబడి దీటుగా నిలువరించగలడమే కాదు.. రష్యన్ సైనిక బలగాలకు తీవ్ర నష్టం కలిగించగలుగుతోంది.
తనకున్నసైనిక, ఆయుధ సంపత్తితో చాలా తేలికగా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవచ్చునని భావించిన పుతిన్ లాంటి నియంతకు సహజంగానే ఈ పరిస్థితి తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని పెంచుతోంది. అందుకే యుద్ధం మొదలుపెట్టిన తొలిరోజుల్లోనే నాటో కూటమి దేశాలు యుద్ధంలో కలుగజేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పడం ద్వారా రష్యా అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడదని ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అంతేకాదు.. రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగ సన్నద్ధతను పరీక్షించాలని ఆయన సైనికాధికారులను ఆదేశించినట్టు రెండు రోజుల క్రితం వచ్చిన వార్తలు అమెరికా మిత్ర కూటమిలో ఆందోళన పెంచాయి. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా అణ్వాయుధ ప్రయోగానికైనా తెగబడే అవకాశాలను కొట్టిపారేయలేమని భావిస్తున్న నాటో కూటమి దేశాలు తాము కూడా అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా మొహరిస్తున్నాయి. యూకేలోని ఆల్మెరస్టోన్ అటామిక్ ఎస్టాబ్లిష్మెంట్ డిపో నుంచి కోల్పోర్టులోని రాయల్ నేవీ ఆయుధ డిపోకు అణువార్ హెడ్లను శనివారం రాత్రి తరలిస్తున్నట్టుగా బయటకు వచ్చిన చిత్రాలు నాటో కూటమి దేశాల్లో నెలకొన్న ఆందోళనకు నిదర్శనమని అంతర్జాతీయ దౌత్య వర్గాలు అంటున్నాయి. ఈ అణువార్ హెడ్లను జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగించే అవకాశం ఉందని సైనిక నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం చర్చల ద్వారా ముగుస్తుందా.. లేక మరింత ముదిరి ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారనున్నదా అన్నది వచ్చే కొద్ది రోజులు నిర్ణయించనున్నాయి.