ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ పార్టీల నాయకులు, క్యాడర్లో చురుకు పుట్టినట్టు కనిపిస్తోంది. కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వరుసగా మూడోసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకారం తీసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలకడమే తమ లక్ష్యమంటూ ప్రభుత్వంపై పోరు బాటను ఎంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయి వరకూ బలమైన క్యాడర్ అండగా ఉంది. అయితే నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతం కావడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. దానికితోడు ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడటం కూడా ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నీరుకార్చిందని చెప్పాలి. ఇదే తమకు అవకాశంగా భావిస్తున్న బీజేపీ .. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దూకుడు పెంచింది. అయితే తెలంగాణలో బీజేపీని నిలువరించే వ్యూహాలను కొన్ని నెలల ముందుగానే మొదలుపెట్టిన కేసీఆర్ వాటికి తగినట్టుగానే తన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
శనివారం సీఎం కేసీఆర్ తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న తెలంగాణ భవన్లో పార్టీ లెజిస్లేచర్ సమావేశం జరగనుంది. తెలంగాణలో రబీ సీజన్లో పండే ధాన్యాన్ని ఎఫ్సీఐ పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరు బాట పట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా బీజేపీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేయనున్నారు. సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోదీని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్టు సమాచారం. అంటే బీజేపీతో పోరుకు కేసీఆర్ తన సర్వ శక్తియుక్తులనూ సమీకరించుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఇక గతంలో మాదిరే ప్రత్యర్థి పార్టీలకు బలపడే సమయం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఆయన పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
కాగా ఇటు ఏపీలోనూ ఆర్థిక ఇబ్బందులతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం తనపై పూర్తిస్థాయిలో ప్రజా వ్యతిరేకత తలెత్తకముందే ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడ కూడా రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ జనసేన కూటమికీ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందన్న పరిస్థితే కొద్ది రోజుల కిందటివరకూ కనిపించింది. వైసీపీ నాయకత్వం సైతం అదే ధీమాలో ఉంది. అయితే జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వ వర్గాల్లో ప్రకపంపనలు సృష్టించాయి. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు సాకారమైతే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సభ జరిగి వారం రోజులు గడుస్తున్నా వైసీపీ ప్రభుత్వ వర్గాల నుంచి జనసేన, టీడీపీలపై విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఇక బీజేపీ సైతం రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. శనివారం కడపలో జరిగిన రాయలసీమ రణభేరి సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్దికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు. తద్వారా సీమ ప్రాంతంపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తంమీద ఎన్నికలు ఎప్పుడు రానున్నాయన్న అంశంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వేడి పెరగడం మాత్రం స్పష్టంగానే కానవస్తోంది.